‘వాడు నడిపే బండీ.. రాయల్ ఎన్ఫీల్డ్’ అంటూ యువతను హుషారెత్తించాడు. ‘రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా!..’ అంటూ ఆర్ద్రత నిండిన పాటతో ఎదఎదనూ తడిమాడు. తెలంగాణ సంస్కృతిని, పల్లెజీవన విధానాన్ని ప్రతిబింబించే పాటల్ని కోకొల్లలుగా రాశాడు. ఆయనే ప్రసిద్ధ గాయకుడు మిట్టపల్లి సురేందర్. తన పాటలలో నిండైన పదసౌందర్యం, గాఢమైన భావుకతను అందించడం ఆయన ప్రత్యేకత.
ప్రజాగాయకుడిగా, గీత రచయితగా సుపరిచితుడు మిట్టపల్లి సురేందర్. ఉమ్మడి వరంగల్జిల్లా టేకుమట్ల మండలంలోని వెల్లంపల్లి ఆయన స్వగ్రామం. తల్లిదండ్రులు మధునమ్మ, నర్సయ్య. సురేందర్కు చిన్నప్పటి నుంచే పాటలు రాయడం, పాడటం అంటే ఎంతో ఇష్టం. తెలంగాణ జీవన సంస్కృతి, మాండలిక పదాల సొబగు ఉట్టి పడేలా 400కు పైగా పాటలు రాశారు. అందులో ‘జననీ జననీ జననీ.. జై తెలంగాణ.. నీవంటి తల్లి లేదే జగతిలోన’,‘కళల ప్రపంచం కల్లోల ప్రపంచం’ మొదలైన ప్రైవేటు గీతాలు బహుళ ప్రజాదరణ పొందాయి.
‘ధైర్యం’గా తొలి అడుగు..
2005లో తేజ దర్శకత్వంలో వచ్చిన ‘ధైర్యం’ సినిమాతో సినీగీత రచయితగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు మిట్టపల్లి సురేందర్. ఈ చిత్రంలో ‘బైపీసీ బద్మాష్ పోరి బాగుంది మామో’ అంటూ మొదటి పాటతోనే యువ హృదయాలను కొల్లగొట్టారు. ‘కత్తిలాంటి పోరిరో ఖతర్నాక్ ప్యారిరో’ లాంటి పదాలతో కుర్రకారుతో చిందులు వేయించారు. ఆ తర్వాత ‘పోరు తెలంగాణ’ (2011) సినిమాకోసం రాసిన ‘రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా! రక్తబంధం విలువ నీకు తెలియదురా!’ అనే పాట మిట్టపల్లిని మరో మెట్టు ఎక్కించింది. ఈ పాటకు నంది అవార్డుకూడా దక్కింది. తల్లిప్రేమలోని మార్దవాన్ని, పేగుబంధం గొప్పతనాన్ని అద్భుతంగా చాటుతుందీ గేయం. రక్తబంధపు విలువను చాటుతూ, భగవంతుడిని ప్రశ్నించిన వైఖరి కనిపిస్తుంది. ‘నుదుటి రాతలు రాసే ఓ దేవదేవా.. తల్లి మనసేమిటో నీవు ఎరుగవురా’ అనే పంక్తుల్లో అమ్మ మమకారాన్ని, దయాగుణాన్ని తెలియజెప్పారు.
పల్లె ఒక మేలుకొలుపు
‘రాజన్న’ (2011)లో మిట్టపల్లి రాసిన ‘కాలిగజ్జె ఘల్లుమంటె పల్లెతల్లి మేలుకుంటదో ఓ అమ్మలారా! అక్కలారా!’ పాట ప్రత్యేక గుర్తింపును పొందింది. అచ్చమైన పదబంధాలు, భావుకత నిండిన సోయగాలు ఈ పాటలో కనిపిస్తాయి. ప్రకృతిలోని జీవరాశులన్నిటినీ పులకింపజేసే స్వచ్ఛమైన యాస, చేతనత్వం ఇందులో తొంగి చూస్తాయి. గుండెనుంచి పొంగి, గొంతుదాటి సాగి వచ్చే పదానికి తగ్గట్టుగా ‘పదం’ కలిపి ఆడిన పల్లెప్రజల ఉల్లాసమూ దర్శనమిస్తుంది. ఆ తర్వాత ‘జై తెలంగాణ’ (2012) సినిమాలో ‘ఆకలి కడుపులు.. చీకటి గడపలు.. ఇంకా ఎంత కాలం?
ఈ కన్నీళ్లెంత కాలం?’ అంటూ ప్రజల కన్నీటిగాథల్ని మన ముందుంచారు. ప్రత్యేక రాష్ట్రం కోసం అమరులైన త్యాగధనులను, ఆకలితో అలమటించే నిరుపేదల బతుకు కథలను, ‘పది జిల్లాల పట్టుగొమ్మలు.. శవాల గుట్టలవుతున్నాయి’ అనే బలమైన పంక్తిలో తెలియజేశారు. ఈ సినిమాలోనే ‘పేరులోనే ధర్మముంది’, ‘మట్టితల్లి రుణం తీర్చుకుంటిరా’ పాటలు రాశారు.
ప్రణయ గీతాల్లోనూ..
ఉద్యమపాటలే కాదు ప్రణయగీతాలు, యువతను మేల్కొలిపే అభ్యుదయ పాటలూ రాయగలనని నిరూపించారు మిట్టపల్లి సురేందర్. ‘భిక్కు రాథోడ్’ (2012)లోని ‘పదరా పదరా.. ఈ కాలం కన్నా వేగంగా..’ అనే పాటద్వారా, అలపులేని గమనంతో సాగి పొమ్మనీ, తొణకని ఆత్మస్థయిర్యంతో కదలి సాగమనే సందేశాన్ని ఇచ్చారు. ‘లవ్ అంటే’ (2013) చిత్రం కోసం ఓ ప్రేమగీతాన్నీ ఆవిష్కరించారు. ఇందులో ‘మనసే కోరిందిలే నీ చెలిమినే.. ప్రతి జన్మకే’ పాట తొలివలపులో తడిసిన హృదయాల్లో చెలరేగిన ఆనందానికి ప్రతీక. ‘అనగనగా ఒక చిత్రం’(2015)లోనూ ‘చిట్టి చిట్టి నీ మదిని చుట్టు ముట్టి’ అంటూ మరో ప్రణయగీతం రాశారు. ప్రేయసిని పొందాలనే ప్రియుడి ఆరాటాన్ని ఈ పాటద్వారా తెలిపారు. ఈ పాటలో ‘తీరంలా నువు నిలబడి ఉంటే.. అలలై నిను తడుముతు ఉంటా’ అనే భావుకత వినూత్నంగా ఉంది. ప్రేయసి తీరమైతే, ప్రియుడు అలలై తడమడం, సముద్రమై కనిపెట్టుకుంటూ ఉంటాననడం అనిర్వచనీయమైన ప్రేమభావనకు నిదర్శనమని చెప్పవచ్చు.
‘రాయల్’ పాటలు
‘తుపాకీ రాముడు’ (2019)లో ‘కొమ్మా కొమ్మాలొ వెన్నెలగాసే అమ్మా నీ కోసం’ అంటూ బతుకమ్మ సంబురాల గురించి కమ్మగా చెప్పారు. రమణీయమైన ప్రకృతికి తీయని ఆకృతిగా నిలిచిన బతుకమ్మ వైభవం ఈ పాటలో కనిపిస్తుంది. ఇందులోని ‘బతుకమ్మనే అలంకరించుకోవాలని పువ్వుల ఆరాటం’ అనే కవి భావన కొంగొత్తగా ఉంది. ‘జార్జిరెడ్డి’ (2019) సినిమా మిట్టపల్లి సురేందర్కు ప్రత్యేక గుర్తింపును ఇచ్చింది. ఇందులోని ‘వాడు నడిపే బండి రాయల్ ఎన్ఫీల్డ్’ పాట యువత హృదయాల్లోకి ఒక ‘బుల్లెట్’లా దూసుకెళ్లింది. అందరిచేతా జేజేలు పలికించింది. వేగంగా సాగే కథానాయకుడి పయనాన్ని, రాజసాన్ని, అతని వాడి చూపుల్లోని చురుకుదనాన్ని ఈ పాటలో వివరించిన తీరు ఎంతో ప్రత్యేకంగా ఉంది. ‘లవ్ స్టోరి’ (2021) సినిమాలోనూ ‘నీ చిత్రం చూసి.. నా చిత్తం చెదిరి నే చిత్తరు వైతిరయ్యో’ అనే పాట యువత హృదయాలను కొల్లగొడుతున్నది. వీటితోపాటు ‘నాన్ స్టాప్’, ‘మన్యం’, ‘గువ్వా గోరింక’ మొదలైన సినిమాల్లో 30కి పైగా పాటలు రాశారు. ‘రాతి బొమ్మల్లోన’ పాటకుగాను 2011లో ఉత్తమ గేయ రచయితగా అమితాబ్ బచ్చన్ చేతులమీదుగా నంది పురస్కారాన్ని అందుకున్నారు. 2014లో మల్లావజ్ఝల సదాశివుడు పురస్కారం, 2018లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పురస్కారం లాంటి అనేక సత్కారాలు అందుకున్నారు. పాటనే పరమావధిగా భావిస్తూ, పాటతోపాటే తన జీవన ప్రయాణాన్ని కొనసాగిస్తున్న మిట్టపల్లి సురేందర్ కలం నిజంగానే తెలంగాణ పల్లె జీవననాదం.
-తిరునగరి శరత్ చంద్ర ,6309873682