‘నమస్తే తెలంగాణ, ముల్కనూరు ప్రజాగ్రంథాలయం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2022’లో విశిష్ట బహుమతి పొందిన కథ.
విశ్రాంత జీవితానికి శుభారంభంగా హాయిగా ఆర్నెల్లు అమెరికాలో గడిపి.. శంషాబాద్లో విమానం దిగుతుండగా, రామస్వామి ఫోన్ మోగింది.
“రామస్వామీ! ప్రభాకర్ తల్లి చనిపోయింది!”.. అన్నారు అవతలి నుంచి.
“నేను ఇప్పుడే ఫ్లయిట్ దిగిన. హైదరాబాద్లో ఉన్న!”.. నేనేం చేయాలనే విసుగు.. ఆయన గొంతులో ధ్వనిస్తున్నది.
“ఎవరూ లేరు. నువ్వన్నా వస్తే!”..
తెలిసిన, దగ్గరి మనిషి గొంతే! కానీ, ఎవరో గుర్తుకు రావడం లేదు. నిజానికి, ప్రభాకర్ తల్లి ఇంతకాలం
బతికుందన్న సంగతి కూడా రామస్వామికి తెలియదు.
“నేను రావడం కుదురదు కానీ, ఇదే నెంబర్కు డబ్బులు వేస్తాను. మీరు కానియ్యండి!” అన్నాడు.
“సరే!” అని అవతలి గొంతు అనడంతో..
పరిస్థితి అర్థమై, సరిపడే సొమ్ము వెంటనే ట్రాన్స్ఫర్ చేశాడు. కారులో నగరానికి వస్తున్న ఆయనకు ప్రభాకర్ గుర్తొచ్చి.. ‘జీవితాన్ని సాహసాల కన్నా, భయాలే గెలిపిస్తాయి!’ అనుకున్నాడు.
ఊర్లో చదువుకొనే రోజుల్లో ప్రభాకర్, రామస్వామి మంచి స్నేహితులు. అప్పుడు ఇద్దరికీ విప్లవోద్యమం అంటే ఎంతో ప్రేమ. ఆ పత్రికలు, పుస్తకాలు వదలకుండా చదివేవారు.
స్టూడెంట్ యూనియన్ లీడర్ ప్రకాశ్.. ఎక్కడా, ఎన్నడూ చూడని చైనా, రష్యా విప్లవాలకు, కమ్యూనిస్టు సిద్ధాంతానికి చెందిన ఎన్నో పుస్తకాలు ఇచ్చేవాడు. ఆయన పరిచయం వల్ల వీళ్లిద్దరికీ విప్లవమంటే ఏమిటో మరింత స్పష్టంగా తెలిసిందని అనుకునేవారు.
వరంగల్ జిల్లాలో పుట్టి పెరిగిన ప్రకాశ్.. కావాలనే జగిత్యాల కాలేజీలో డిగ్రీలో చేరాడు. పార్టీ పత్రికల పంపిణీ, మీటింగుల గురించి గోడపై రాతలు, కాలేజీలో నోటీసు బోర్డుపై ప్రభుత్వ నిర్ణయాలపై ఖండన మండనలు.. అన్నిట్లో తానే కనిపించేవాడు.
విప్లవంపై ఇంత ఇష్టం ఉన్నా కూడా.. ప్రకాశ్కు పనుల్లో సాయం చేద్దామంటే, ఎవరైనా చూసి ఇంట్లో చెబుతారనే భయం.. ప్రభాకర్, రామస్వామి ముందరి కాళ్లబంధంగా ఉండేది. అప్పటికే చుట్టుపక్కల పోలీసుల అరెస్టులు, ఎన్కౌంటర్ వార్తలు తెలిసి.. కాలేజీలో చదువుతున్న తమ పిల్లలు ఏ అఘాయిత్యంలో వేలు పెట్టి ఏం చిక్కులు తెచ్చి పెడతారోనని తల్లిదండ్రులు కలవరపడుతున్నారు.
“ఇంత భయపడితే మనం విప్లవాన్ని కోరి లాభమేంది? పుస్తకాలు చదువుతాం. సిద్ధాంతాన్ని ఇష్ట
పడతాం. గంటల తరబడి చర్చిస్తాం.. కాలు మాత్రం కదపం. తెగువ కొరవడిన మనకు ఈ తెలివి దేనికి పని
కొస్తది!” అన్నాడు ఓ రోజు ప్రభాకర్ విసుగ్గా.
ఆయన అలా అనడానికి కొంత అర్థముంది. ప్రభాకర్ తండ్రి ఆరోగ్యం బాగుపడక ఇంటికి భారమనుకొని నడింట్లో ఉరివేసుకొని చచ్చిపోయాడు. ఒక్క గదిలో సర్దుకొని ఉంటూ మిగతా ఇంటిని కిరాయికి ఇచ్చి, బీడీలు చేస్తూ తల్లీ కొడుకులు కలిసి బతుకు బండి లాగుతున్నారు. మగపిల్లలు బీడీలు చుట్టడం అరుదే కానీ, తల్లికి సాయపడాలని ప్రభాకర్ నేర్చుకున్నాడు. జీవితం ఇచ్చిన చేదు అనుభవాలు ఆయనలో కొంత తెగింపును, అసహనాన్ని పుట్టించాయి. అందుకే.. ఆయన మాటలు ఏదో ఒకటి తేల్చేయాలన్నట్లుగా ఉంటాయి.
అలా ప్రభాకర్ మాటలు ముందుకు లాగినట్లుంటే.. రామస్వామి మాటలు మాటలకే పరిమితమైనట్లు వెనుకడుగు వేసినట్లుండేవి. ప్రభాకర్ వేసే ప్రతి ప్రశ్నకూ‘అవును కానీ..’ అనే సమాధానమే వస్తుంది రామస్వామి నుంచి. ఆ మానసిక పరిస్థితికి అసలు కారణం రామస్వామి తండ్రి బట్టల వ్యాపారి. వారిది దేనికీ లోటు లేని కుటుంబం. అయితే ప్రభాకర్ కన్నా సిద్ధాంత జ్ఞానం రామస్వామికే ఎక్కువ. ఆయన ప్రస్తావించే ప్రపంచ చరిత్ర, పుస్తకాలు, రచయితల పేర్లు కొత్తగా ఉండేవి. ఈ లెక్కన ముగ్గురిలో రామస్వామే విప్లవ మేధావి. ప్రభాకర్ మెతగ్గా ఉంటూ.. ‘ఓహో!’ అన్నట్లు ఇద్దరి మాటలూ ఆసక్తిగా వినేవాడు.
నిర్బంధం పెరిగి, క్రమంగా శివారు ఇళ్లలో పోలీసుల దాడులు పెరిగాయి. దాంతో విప్లవపార్టీ వ్యూహాలు మార్చింది. ఓ రోజు రాత్రి పది గంటలకు రామస్వామి ఇంటి ముందు ఓ మోటరుసైకిల్ ఆగింది. వెనుక కూర్చున్నాయన దిగగానే.. మోటర్సైకిల్ ముందుకెళ్లి పోయింది. దిగినాయన రెండు వైపులా మనుషులను గమనించి ఇంటి తలుపు కొట్టాడు. తలుపులు తెరిచిన రామస్వామి తండ్రి..
“ఎవరు కావాలి?” అని అడిగాడు.
“నేను రామస్వామి క్లాస్మేట్ని. సారంగాపూర్ మాది. వచ్చేటప్పుడు రూమ్ కీ ఇంట్లనే మర్చిపోయిన. పొద్దున ఊరికి పోయి తెచ్చుకుంట. ఈ రాత్రికి..” అనగానే తండ్రి రామస్వామి ముఖం చూశాడు.
‘అవును.. సరే.. మీ ఇష్టం!’ అని అర్థం వచ్చేలా రామస్వామి తల ఊపడంతో..
“సరే బాబు!” అంటూ లోపలికి రమ్మన్నాడు తండ్రి.
రామస్వామితోపాటు భోజనం చేసిన ఆయన.. గదిలోకి వచ్చాక ‘ప్రకాశ్’ అని రాసి ఉన్న చీటీ చూపించి, దాన్ని చిన్నచిన్న ముక్కలుగా చించేశాడు.
‘సరే!’ అన్నట్టు రామస్వామి తలాడించాడు.
రాత్రి ఆలస్యంగా నిద్ర పోయిన ఆగంతకుడు మర్నాడు పొద్దున్నే నాలుగింటికి లేచి సిద్ధమై కూర్చున్నాడు. బయటి నుంచి మోటర్సైకిల్ వస్తున్న శబ్దం వినరాగానే.. ఆయన చిరునవ్వుతో తల ఊపి వెళ్లిపోయాడు. రామస్వామికి భయంతో రాత్రంతా అస్సలు నిద్ర పట్టలేదు. ఓ గంట తర్వాత గుప్పుమన్న వార్తతో ఊరు నిద్రమత్తు వదిలింది.
ఫస్ట్ బస్సుకు హైదరాబాద్ వెళ్తున్న రాంపల్లి భూస్వామిని బస్సు ఎక్కుతుండగా డోర్ దగ్గరే కాల్చి చంపారని తెలిసి.. ఊరంతా పోలీసుల బూట్ల చప్పుడుతో మార్మోగింది. తూటా పేల్చినవాడు రాత్రి తమ ఇంట్లో ఉన్న సంగతి గుర్తొచ్చి, రామస్వామి గుండె గుబులు గుబులుగా కుదుపులకు గురయింది. రామస్వామి అదంతా తన కడుపులోనే దాచుకున్నాడు. పార్టీ విషయాలు రెండో మనిషికి కూడా తెలియకూడదని ముందే ప్రకాశ్ చెప్పినందున.. ఎక్కడా నోరు విప్పలేదు. ఫలానా దళ సభ్యుడు ఈ దురాగతానికి పాల్పడ్డాడని మాత్రం పోలీసులు ప్రకటించారు. వారి అన్వేషణలో ఏ చిన్న ఆధారం చిక్కినా తన కుటుంబ పరిస్థితి గుర్తుకొచ్చి వణుకు పుట్టేది. చెప్పాచెయ్యకుండా మరో పిడుగు పడుతుందేమోనన్న భయంతో.. ఆ విషయాన్ని ప్రభాకర్తో చెప్పాడు రామస్వామి. ఆ రోజు రాత్రి తెలుగు
లెక్చరర్ ఇంట్లో జరిగిన రాజకీయ తరగతులకు రామస్వామి వెళ్లలేదు.
“రామస్వామి రాలేదేం?” అన్న ప్రకాశ్తో.. రామస్వామి భయపడుతున్న విషయాన్ని చెప్పాడు ప్రభాకర్.
“అయ్యో! ముందే చెప్పొచ్చు కదా! సరే.. ఇక ముందు ఎవ్వరూ రారు. తనను మాత్రం క్లాసులకు రమ్మను” అన్నాడు ప్రకాశ్.
రాత్రి పది దాటాక ప్రభాకర్ భోజనానికి కూర్చున్నాడు. తల్లి రెండు పళ్లేలను తీస్తున్నది. దర్వాజకు ఎదురుగా కూర్చున్న ప్రభాకర్కు ఇంటి ముందర ఒకాయన కనిపించాడు.
‘అర్థం చేసుకో!’ అన్నట్లు తల ఊపాడు.
ఆయన పేరేమో కానీ, పరిచయం ఉన్న మనిషిని పిలిచినట్లు..
“రా.. మహేశ్! లోపలికి రా!” అంటూ లేచి.. ఆయన్ను లోపలికి తీసుకొచ్చి కూర్చోమన్నాడు ప్రభాకర్.
ప్రభాకర్ దోస్తులందరూ ఆయన తల్లికి తెలుసు.
“మా కాలేజినే! వానకు రూమ్ తడిస్తే మనింటికి రమ్మన్న!” అన్నాడు తల్లితో.
“దాందేముంది బిడ్డా! కూర్చోమను. అన్నం తింటడు” అని ఇంకో పళ్లెం తీసింది.
అలా ఎవరెవరో రాత్రి – పగలు ప్రభాకర్ ఇంటికి వస్తున్నారు. ఇల్లు చిన్నదే అయినా.. సందులో ఉన్నందున ఎవరి చూపూ పడదు. చూసినవాళ్లు కూడా చుట్టాల పిల్లలేమో అనుకుంటారు.
ఓ రోజు తెల్లవారి చూస్తే.. ఇంట్లో తల్లికి ప్రభాకర్ కూడా కనిపించలేదు. రెండ్రోజులుగా ఇంట్లో ఉంటున్నాయన ఎవరి దగ్గరికైనా తీసుకెళ్లాడేమోనని దినమంతా ఎదురుచూసింది. పొద్దుగుంకుతున్నా ప్రభాకర్ జాడ లేదు. ఏమై ఉంటుందోనని రామస్వామి ఇంటికెళ్లింది.
“ఎటు వెళ్తడు.. వస్తడులే చిన్నమ్మా! నేను చూసొస్తా. నువ్వు ఇంటికి పో!” అని తను బయటపడ్డాడు.
తెలుగు లెక్చరర్ ఇంట్లో ప్రకాశ్ కలిశాడు. ప్రభాకర్ తల్లి చెప్పిన మాటలు ఆయనతో అన్నాడు.
“వస్తడు!” అని చెప్పిన ప్రకాశ్.. పొడి మాటను పొడిగించవద్దని ఊరుకున్నాడు.
ప్రకాశ్ చెప్పనిదేమిటంటే.. ప్రభాకర్ పార్టీలో పని చేస్తానని ఆయనతో చాలా రోజులుగా అంటున్నాడు. అండర్ గ్రౌండ్ కాకుండా లీగల్గా ఆయన నుంచి పని తీసుకొనేందుకు పార్టీ ఒప్పుకొన్నది. రహస్యంగా కరీంనగర్లో తయారవుతున్న మాస పత్రిక కాపీలను రద్దీ కాగితాల్లో చుట్టి.. జిల్లా అంతటా పంచి, రెండ్రోజుల్లో ఇంటికి వచ్చాడు ప్రభాకర్.
“చిన్న పని దొరికింది. డబ్బులిస్తారు” అని తల్లితో అబద్ధమాడాడు.
“అట్లా చెప్పా చెయ్యకుండా మళ్లెప్పుడు పోకు బిడ్డా!” అని సర్దుకుంది ఆమె.
అప్పటినుంచి ప్రభాకర్ పగలు – రాత్రి ఎటు వెళ్లినా.. ఏదో నాలుగు పైసలొచ్చే పనికి వెళ్తున్నాడని అనుకునేది. ఇంటికి వచ్చే వాళ్లను పనిలో దొరికిన దోస్తులనుకునేది. కొన్ని రోజుల తర్వాత ఓ రాత్రి పూట ఇద్దరు పోలీసులు ప్రభాకర్ ఇంటికి వచ్చారు. తల్లి ఒక్కతే ఇంట్లో ఉంది. వస్తువులను చిందర వందర చేస్తూ ఇల్లంతా వెతికారు. ఆనాటి నుంచి ప్రభాకర్ మళ్లీ ఇంటివైపు రాలేదు. అప్పుడప్పుడూ వచ్చి బెదిరిస్తున్న పోలీసుల కాళ్ల మీదపడి..
“సార్లూ.. నా బక్క పానంతోని ఆడుకోకుండ్రి!” అని వేడుకునేది ప్రభాకర్ తల్లి.
ప్రభాకర్ గుంటూరులో సాధారణ జనంలాగే నలుగురిలో తిరుగుతూ.. పార్టీ పనుల్లో నిమగ్నమయ్యాడు. నల్లమలలో ఉద్యమాన్ని నిర్మిస్తూ అడవిలో తలదాచుకుంటున్న వారికి కావాల్సిన ఏర్పాట్లను చూసుకుంటున్నాడు. తిండి సామగ్రి, మందులు, టెంట్లు, డ్రెస్సులు చాటుమాటుగా అందజేయడం ఆయన పని.
ఓ రోజు సరుకులు కొంటుండగా..
“ఇంతేసి పచారు సామాను తీసుకుంటావబ్బీ.. హాస్టల్ గానీ నడుపుతున్నావా?” అన్నాడు కిరాణా కొట్టు యజమాని.. ప్రభాకర్తో!
టక్కున.. లేదన్నట్లు తల అడ్డమూపాడు ప్రభాకర్.
“మరి?!” అన్నాడు కొట్టాయన.
ఆయనకు ఏదో సర్ది చెప్పాల్సిన చోట.. ‘నీకెందుకయ్యా!?’ అన్నట్లు ముఖం పెట్టాడు ప్రభాకర్.
దుకాణదారు మంచివాడిలా ఉన్నాడని ఒకేచోట కొంటుంటే.. ఊహించని చిక్కుప్రశ్న ఎదుర్కోవాల్సి వచ్చింది. మరో మార్కెట్ పక్క వీధిలో ఉన్నందున.. ఒక్క వస్తువు కోసం అంతదూరం వెళ్లడమెందుకని, వేరే దుకాణానికి వెళ్లాడు. అది చూసిన పాత కొట్టాయన ఓ కస్టమరుతో.. “చూశారండీ చోద్యం! ‘ఇంతేసి దినుసు కొంటావు. హాస్టల్ గానీ ఉందా!?’ అన్నందుకే మరో దుకాణానికి వెళ్లాడా బాబు!” అని వేలెత్తి చూపించాడు.
ఆయన వెంటనే..
“ఏ ఊరు ఆయనది?” అని అడిగాడు.
“ఏమో! బయటాయనే కాబోలు.. కొత్తగా కనిపిస్తున్నాడు” అని జవాబిచ్చాడు కొట్టు ఆసామి.
ఆ కస్టమరు.. మఫ్టీ పోలీసు.
వార్త డిపార్ట్మెంట్కు చేరింది. ప్రభాకర్పై నిఘా మొదలైంది. వారం రోజులుగా ఆయన కదలికల్ని పసిగడుతూ.. వెంటాడుతూ అమ్రాబాద్ దగ్గర సున్నిపెంటలోని ఓ గుడిసెను చుట్టుముట్టిన స్పెషల్ ఫోర్స్ జరిపిన కాల్పుల్లో.. నలుగురు దళ సభ్యులతోపాటు తూటా తగిలి ప్రభాకర్ ప్రాణాలు కూడా గాలిలో కలిసిపోయాయి. అలా పార్టీలో చేరిన రెండేళ్లకే ప్రభాకర్ పేరు దళసభ్యుడిగా అమరుల్లో కలిసిపోయింది. పోలీసుల వెంట వచ్చిన ప్రభాకర్ తల్లి.. చాపలో చుట్టి ఉన్న కొడుకును చూసి నేలపై కూలిపోయి, నెత్తీ నోరూ కొట్టుకొంటూ ఏడ్చింది. కొడుకును గుర్తు చేసుకుంటూ రోజూ ఏడ్చి ఏడ్చి.. చివరికి కొడుకు ఫొటోను చూస్తూ బతకడం అలవాటు చేసుకుంది.
పెరిగిన నిర్బంధంలో పార్టీ కదలికలు కనాకష్టమయ్యాయి.
ఓ రోజు బస్సునాపి వెతుకుతున్న పోలీసులకు..
పార్టీ పత్రికలతో దొరికిపోయాడు ప్రకాశ్. ఎంత హింసించినా తనకు ప్రెస్సు, పత్రికలు తప్ప వేరే ఏదీ తెలియదన్నాడు. పత్రికతో సంబంధం ఉన్నవాళ్లను పట్టుకొచ్చారు. వారితోపాటు ప్రకాశ్ కూడా ఖైదీగా జైలుకెళ్లాడు. కోర్టులో పోలీసులు కేసు వేస్తే.. పత్రిక నడపడంలో, దాన్ని చదవడంలో తప్పేముందని జడ్జీ కేసును కొట్టేశారు. అలా ప్రకాశ్ బతికి బయటపడ్డాడు. మళ్లీ పార్టీ వైపు వెళ్లకుండా.. వరంగల్లో ఓ స్కూల్ తెరిచాడు. తన తెలివినంతా ఉపయోగించి విద్యా వ్యాపారాన్ని పెంచి పెరిగిపోయాడు.
క్రాంతి విద్యా సంస్థలు పేరిట వరంగల్లో, హైదరాబాద్లో ఇంజినీరింగ్ కాలేజీలు తెరిచాడు. రాజకీయంగా కూడా పలుకుబడి పెంచుకున్న ఆయన్ను ఎమ్మెల్సీ పదవి కూడా వరించింది.
బుద్ధిగా చదువుకున్న రామస్వామి లెక్చరర్గా జీవితాన్ని ఆరంభించి, పీహెచ్డీ పూర్తిచేసి.. యూనివర్సిటీలో ప్రొఫెసర్ అయ్యాడు. తన కాలేజీ మిత్రుడు ప్రకాశ్ ఎమ్మెల్సీ అయిన వార్త పత్రికలో చదివి.. రామస్వామి తెగ సంబురపడి పోయాడు. తాము కలిసి చదివిన
కాలేజీలో ప్రకాశ్కు సన్మానం చేయాలని రామస్వామి
ఆ బ్యాచ్ వాళ్లను ఏకం చేశాడు. ఆహ్వానించగానే
ప్రకాశ్ ఉత్సాహంగా వచ్చాడు. ఘన సన్మానానికి ఎమ్మెల్సీ ప్రకాశ్ ఉప్పొంగిపోయి.. పేరు పేరునా
కృతజ్ఞతలు తెలిపాడు.
భోజనాలు అయ్యాక పక్క పక్కనే కూర్చున్న
ఇద్దరు మిత్రుల మనసులు.. బహుశా ఒకే ఆలోచనలో ఉండొచ్చు. ఇంకొద్ది సేపట్లో ఎవరి దారి వారు
చూసుకుంటారు. చివరికి రామస్వామి..
‘అడగాలా వద్దా!?’ అనుకుంటూనే.. ఆపుకోలేక..
“ప్రకాశ్ గారు.. మీకు మన ప్రభాకర్ గుర్తున్నాడా!” అనేశాడు.
ఏ నిమిషంలోనైనా రామస్వామి నోట ఈ ప్రశ్న వచ్చి తీరుతుందని ప్రకాశ్కూ తెలుసు. అంతా గుర్తున్నా గుర్తుకు రానట్లు అడ్డంగా తల ఊపాడు.
“అదే.. మన.. పార్టీ..” అని గుర్తుకు తెచ్చేందుకు మరింత ప్రయత్నం చేశాడు రామస్వామి.
ఆయన యాతన పడలేక..
“చూడు స్వామి! నేను ఇప్పుడేమిటో నీకు స్పష్టంగా తెలుసు. నీ సంగతేమో గానీ, నేను మాత్రం పార్టీ వైపు వెళ్లక చాలా ఏండ్లయింది. ఆ రోజులన్నీ నేను పూర్తిగా మరిచిపోయాను. దాని జోలి మళ్లీ నా దగ్గర తీసుకురాకు” అన్నాడు విసుగ్గా.
“ఛ.. ఛ! నేను కూడా మీలాగే! దూరమే! ఏదో కాలేజీ రోజులు..” అంటూ ఇంకేదో అనబోయి,
ఆ ప్రస్తావన ఆపేశాడు.
ఎదుగుతున్న మనిషికి దూరం కావద్దనే అంతర్బోధతో తనను మన్నించమన్నట్లు రామస్వామి
చేతులు జోడించాడు.
తన దారిలోకి వచ్చిన రామస్వామి ఇంకెందుకు
పనికొస్తాడు అనుకున్న ప్రకాశ్..
“స్వామీ! రిటైర్మెంట్ తర్వాత కలువు. మన కాలేజీల్లో ఏదైనా మంచి పొజిషన్ తీసుకుందువు” అన్నాడు.
“మా అమ్మాయి, అబ్బాయి ఇద్దరూ యూఎస్లో ఉంటారు. ముందు వాళ్ల దగ్గరికి వెళ్లాలి” అన్నాడు రామస్వామి.
ఆ సమాధానం ప్రకాశ్కు రుచించలేదు. అమెరికా యాత్రికులను నమ్మితే పనులు కావనిపించి..
“వస్తాను! థాంక్యూ వెరీమచ్!” అంటూ సెలవుతీసుకున్నాడు.
ఆ రాత్రివేళ తిరుగు ప్రయాణం అవుతున్న ప్రకాశ్ కారు.. ప్రభాకర్ ఇంటి ముందు నుంచే వెళ్తున్నది. ఏదో గుర్తొచ్చినట్లు.. ప్రకాశ్ కళ్లు దర్వాజలోంచి ఆ ఇంటి లోపలికి తొంగి చూశాయి.
గుడ్డి దీపం వెలుగులో బీడీలు చుడుతున్న తల్లి వెనుకాల.. గోడపై పూలదండ వేసిన ప్రభాకర్ ఫొటో కనిపించింది. ఇల్లు దాటగానే వెనుక నుంచి ఎవరో తననే పేరు పెట్టి పిలుస్తున్నట్లు.. వెంటపడి వస్తున్నట్లు ప్రకాశ్కు అనిపించింది. తల తిప్పకుండానే డ్రైవర్తో..
“స్పీడు పెంచవయ్యా!” అని చేతులతో ముఖం దాచుకున్నాడు.
భయానికో, బాధకో వచ్చిన కన్నీళ్లతో ఆయన అరచేతులు తడిస్తే.. పక్కనున్న తువ్వాలుకు తుడుచుకున్నాడు.
తన రిటైర్మెంట్ సభకు రమ్మని ఎమ్మెల్సీ ప్రకాశ్ను రామస్వామి పిలిస్తే.. ఏదో ముఖ్యమైన పనుందని చెప్పి రాలేనన్నాడు. ఈ నాయకులతో తనకు కుదరదని ఆయనకు అర్థమైంది. పనులన్నీ ముగించుకొని విశ్రాంత జీవితానికి హంగులు అద్దేలా రామస్వామి అమెరికాకు పయనమయ్యాడు.
దుకాణదారు మంచివాడిలా ఉన్నాడని ఒకేచోట కొంటుంటే.. ఊహించని చిక్కుప్రశ్న ఎదుర్కోవాల్సి వచ్చింది. మరో మార్కెట్ పక్క వీధిలో ఉన్నందున.. ఒక్క వస్తువు కోసం అంతదూరం వెళ్లడమెందుకని, వేరే దుకాణానికి వెళ్లాడు.
బద్రి నర్సన్
చుట్టూ ఉన్న సమాజాన్ని అక్షరీకరించి.. తన రచనల ద్వారా ప్రపంచానికి చూపుతారు బద్రి నర్సన్. రచయితగా, కాలమిస్ట్గా తెలంగాణ సమాజానికి సుపరిచితులు. స్వస్థలం జగిత్యాల. డిగ్రీ వరకూ అక్కడే చదువుకున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ, ఎంఎడ్ పట్టా పుచ్చుకున్నారు. తెలంగాణ గ్రామీణ బ్యాంక్లో ఉద్యోగం చేసి, 2015లో పదవీ విరమణ పొందారు. పాఠశాల స్థాయినుంచే సాహిత్యాభిలాష పెంచుకున్నారు. బాల్య మిత్రులతో కలిసి ‘సాహితీ మిత్ర దీప్తి’ అనే సంస్థ ద్వారా కవిత, కథల పోటీలు నిర్వహించారు. ఎంపికైన రచనలను పుస్తకాలుగా తీసుకొచ్చారు. ఉద్యోగంలో చేరడానికి ముందు.. రంగుల కల, విముక్తికోసం సినిమాల్లో రచన, దర్శకత్వ శాఖల్లో పనిచేశారు. గత కొన్నేళ్లుగా వివిధ అంశాలపై పత్రికలకు వ్యాసాలు, పుస్తక సమీక్షలుగా రచనా వ్యాసంగం చేస్తున్నారు. ఈ క్రమంలోనే యాభైకి పైగా కథలు రాశారు. ‘ఓ రైతు కథ’కు నోముల సత్యనారాయణ పురస్కారం, నవతెలంగాణ కథల పోటీల్లో ద్వితీయ, తృతీయ బహుమతులు అందుకున్నారు. పాలపిట్ట – శకుంతల జైని దసరా కథల పోటీలో ‘రబ్బరు బొమ్మ’కు ప్రథమ బహుమతి దక్కింది. ఇలాగే మరికొన్ని కథలూ బహుమతులు పొందాయి.
బద్రి నర్సన్
94401 28169