‘నమస్తే తెలంగాణ, ముల్కనూరు ప్రజాగ్రంథాలయం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2022’లో ప్రత్యేక బహుమతి పొందిన కథ.
“అమ్మా! గోడ డిజైన్ చాలా బావుంది”.. కళ్లు విప్పార్చి చూస్తూ అన్నాడు పన్నెండేళ్ల జితేంద్ర.
“నీ గది నచ్చిందా జీతూ!” మురిపెంగా కొడుకు వంక చూస్తూ అన్నది వైశాలి.
“రేయ్! ఆ గది నీది, మామ్మది కూడా! ఆ పక్కది మా బెడ్ రూమ్”.. వెనకనుంచి అన్నాడు రంగనాథ.
ముగ్గురూ కాసేపు కొత్త ఇల్లంతా సంబరంగా కలియతిరిగి.. ఇంకా చేయాల్సిన పనులన్నీ బిల్డర్కి అప్పచెప్పి, ఇంటికి బయల్దేరారు.ఇంకో మూడు నెలలకు కొత్తింటి గృహప్రవేశం చేశారు రంగనాథ, వైశాలి దంపతులు. కొడుకు కొన్న కొత్తింటిని చూసి మురిసిపోయింది అతని తల్లి శ్యామలాంబ. రోజులు వేగంగా గడిచి పోతున్నాయి.
జితేంద్రకు ఇంజినీరింగ్ సీటు వచ్చిన సంవత్సరం.. రంగనాథ పాత ఇంటిని అమ్మి, మూడు పడకల కొత్త ఫ్లాట్ కొన్నాడు.
“జితేంద్రా! ఇది నీ బెడ్రూమ్, ఆ పక్కది నీ స్టడీ రూమ్. బావుందా?”.. కొడుకు మెరిసే కళ్ల వంక చూస్తూ అన్నది వైశాలి.
“యా! నా రూమ్ బావుంది. ఫ్లాట్ కూడా చాలా విశాలంగా ఉందమ్మా!”..
అన్ని సరికొత్త హంగులతో, అప్పుడే వేసిన లేత రంగులలో మెరిసిపోతున్న తన గదిని చూసుకుంటూ సంతృప్తిగా తలాడిస్తూ అన్నాడు జితేంద్ర. గృహప్రవేశానికి వచ్చిన స్నేహితులు, బంధువులంతా ఇల్లు చాలా బావుందన్నారు. రోజులు సంతోషంగా గడిచి పోతున్నాయి.
జితేంద్రకు ఖరగ్పూర్లో ఎంటెక్ సీట్ వచ్చింది. హాస్టల్లో చేర్పించడానికి వైశాలి, రంగనాథ కూడా వెంట వచ్చారు.
“ఏసీ గది అక్కర్లేదులే నాన్నా! ఇక్కడ హాస్టల్ రేట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి” అన్నాడు జీతూ.
“నీ మొహం. నీకేం తెలియదు. వేడికి మాడిపోతావు. నాన్న అన్నీ చూసుకుంటారులే!” కొడుకును వారిస్తూ అన్నది వైశాలి.
జీతూకు మంచి వసతిగా ఉన్న గదికోసం ఇద్దరూ ఆ రోజంతా బాగా తిరిగి, చివరికి మూడో అంతస్తులో ఉన్న ఒక విశాలమైన గదిలోకి చేర్చి.. ఫీజులన్నీ కట్టేసి, సామానంతా సర్దేసి.. ఇద్దరూ ఇంటికి తిరిగి వచ్చారు.
కొన్నేళ్ల తరువాత.. “ఏవండీ! మన జీవన ప్రయాణాన్ని తలుచుకుంటే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. రూపాయి రూపాయికి ఎంత కష్టపడ్డాం. ఎంత పొదుపుగా సంసారాన్ని నడిపాం. ఎక్కడో పల్లెటూళ్ల్లో చిన్నపెంకుటింట్లో పుట్టి పెరిగిన మనం.. ఇలా సిటీకి చేరి, చెరో ఉద్యోగం సంపాదించుకుని, మంచి ఇల్లు కొనుక్కుని.. మన జీతూ భవిష్యత్తును ఎంతో గొప్పగా తీర్చిదిద్దాం కదా!” ఆనందంగా నవ్వుతూ అన్నది వైశాలి.
“ఇదంతా నీ సహకారమే వైశూ! నా ఒక్క ఉద్యోగంతో ఇదంతా జరిగేది కాదు. కల నీది. కష్టం నీది. నీ తోడు.. నాకన్నీ సాధించగలనన్న మనోధైర్యాన్ని కల్పించింది. ముందో సింగిల్ బెడ్రూమ్, తర్వాత డబుల్ బెడ్రూమ్.. అలా ఇప్పుడొక సొంత ఇల్లు కొనుక్కునే స్థాయికి వస్తామని నేనెప్పుడూ ఉహించలేదు. ఇక జితేంద్ర పెళ్లి చేసేస్తే మన బాధ్యత పూర్తిగా తీరిపోతుంది” అన్నాడు రంగనాథ.కొడుకు పెళ్లి ఊహకే ఎంతో మురిసిపోతూ తలూపింది వైశాలి. రంగనాథ రిటైర్మెంట్, జితేంద్ర పెళ్లి.. ఇంచుమించుగా ఒకే ఏడాదిలో జరిగాయి. పెళ్లికూతురు ద్విజ.. యూనివర్సిటీలో హిస్టరీ ప్రొఫెసర్గా పనిచేస్తున్నది.పెళ్లిలో అప్పగింతలప్పుడు ఏడుస్తున్న ద్విజ తల్లిని ఓదారుస్తూ.. “ఏడవకండి వదినగారూ! నాకు ఆడపిల్లలు లేక పోయినా మీ బాధను నేను అర్థం చేసుకోగలను. మేము కూడా అయిదుగురు అప్పచెల్లెళ్లం. మా అమ్మ కూడా ఇలాగే మా అందరి పెళ్లిలలోనూ అప్పగింతలప్పుడు.. ‘ఆడపిల్లలంటే ఇంటికి వచ్చిపోయే అతిథులే! వాళ్లను కని, ప్రేమగా పెంచి అత్తవారికి అప్పచెప్పడమేనా కన్నతల్లి విధి!’ అంటూ భోరుమని ఏడుస్తూనే మమ్మల్ని అత్తారింటికి వదల్లేక వదల్లేక పంపించింది. అప్పట్లో మేమందరం తలా ఓ ఊరిలో, దూరంలో ఉండేవాళ్లం. కలవడం చాలా కష్టమయ్యేది. మా పెద్దక్కయ్య పిల్లల్నయితే.. నేను కొంచెం పెద్దయ్యాకే చూశాను. మా చిన్నబావ గారేమో.. మా చిన్నక్కను పుట్టింటికి అసలు పంపేవాడే కాదు. మా అక్కయ్యలు మా పెళ్లిళ్లప్పుడు ఒకపూట వచ్చి వెంటనే భయంభయంగా వెళ్లిపోయేవాళ్లు. ఇప్పుడా పరిస్థితి లేదు కదా! ఊళ్లో ఊరు. అయినా ద్విజ మాకు కోడలు కానే కాదు. మా కూతురే! మా కొడుకు కన్నా ఎక్కువ”.. చెమర్చిన కళ్లతో కదిలిపోతూ అన్నది వైశాలి.
“విల్లా.. ఎలా ఉంది నాన్నా!?”.. రంగనాథ వంక చూస్తూ అడిగాడు జితేంద్ర.
“చాలా విశాలంగా.. చుట్టూ మొక్కలు, పచ్చని లాన్లతో చాలా అందంగా ఉందిరా జీతూ!” పొంగిపోతూ అన్నాడు రంగనాథ.
“ఇది బుక్ చేసుకున్న అతను హఠాత్తుగా అమెరికా వెళ్లిపోతూ అమ్మేయడంతో నా చేతికి వచ్చింది. విల్లా కొనడం కన్నా ఈ అలంకరణకే చాలా డబ్బు అయ్యింది. ఇద్దరి జీతాల మీదా లోన్ కాబట్టి, నాలుగు వందల గజాల విల్లాను కొనగలిగాను”
ఆనందంగా కలియచూస్తూ అన్నాడు జితేంద్ర. ఆ విల్లాను చూసి తెగ మురిసిపోతూ.. వైశాలి ఉత్సాహంతో ఉరకలు వేస్తూ కొడుకుతో ముందుకు నడిచింది.
“అమ్మా! ఇది మా బెడ్రూమ్. ఇది మా జిమ్. ఇది నీ మనవడి రాకీ గది. ఇది కిచెన్. ఇది గెస్ట్ రూమ్. పైన రెండో అంతస్తులో హోం థియేటర్!”.. తల్లిదండ్రులకు ఒక్కొక్కటీ గొప్పగా చూపిస్తూ.. చెప్పుకొంటూ వెళ్లిపోతున్నాడు జితేంద్ర.
“మరి ఇన్ని విశాలమైన గదులలో మా గది ఏదిరా!?”.. క్రమ క్రమంగా ఆరిపోతున్న చిరునవ్వును పెదాల మీదికి బలవంతంగా తెచ్చుకుంటూ కష్టంగానే అడిగింది వైశాలి.
“ఇందాక చెప్పాను కదా! ఆ పక్కన ఉన్నదే! అదే.. గెస్ట్ రూమ్. అది మీకే!”.
“అదేం మాటరా!? అంటే.. మేం అతిథులమంట్రా!?” దెబ్బతిన్నట్టుగా చూస్తూ అన్నది.
“ఎప్పుడైనా మా ఇంటికి వచ్చినప్పుడు ఈ రూమ్ మీదే! ఇది మీరే వాడుకోవచ్చు. అమ్మా! మా సామాన్లు ఏవీ కూడా ఆ గదిలో అసలు పెట్టుకోం!” తల్లి భుజం మీద చేయి వేస్తూ అన్నాడు జితేంద్ర.
వైశాలి ఏదో అనబోతుంటే..
“అంతే జీతూ! కానీ, మా అమ్మవాళ్లు వచ్చినప్పుడు.. వాళ్లు కూడా ఇదే గెస్ట్రూమ్ను వాడుకుంటారుగా!”.. జితేంద్ర మాటలను సవరిస్తూ అన్నది.. పక్కనున్న కోడలు ద్విజ.
వైశాలి ఇక వంచిన తల పైకి ఎత్తలేదు. అందరి మాటలు వింటూ ఉన్న రంగనాథ.. భార్య భుజం చుట్టూ చేయి వేసి ముందుకు నడిచాడు.
జితేంద్ర విల్లా గృహప్రవేశం పూర్తి చేసేసి రంగనాథ, వైశాలి తమ ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు.
“ఏవండీ! జితేంద్ర పుట్టినప్పటినుంచి మనం ఇప్పటికి ఎన్ని ఇళ్లు మారాం. ప్రతిసారీ కొత్త ఇల్లు కట్టడం పూర్తవ్వగానే, జీతుని తీసుకెళ్లి అందంగా అలంకరించిన వాడి గదిని గొప్పగా చూపిస్తూ.. వాడితోపాటు మనం కూడా తెగ మురిసిపోయేవాళ్లం. సింగిల్ బెడ్రూమ్లో ఉన్నప్పుడు, మనం హాల్లో సర్దుకొని పడుకుంటూ.. ఉన్న ఒక్క గదినీ వాడి చదువు కోసమని ప్రత్యేకంగా కేటాయించాం. వాణ్ని క్షణం కూడా వదలకుండా, వాడికే నొప్పీ కలగకుండా, ఎంతో గారంగా, అపురూపంగా పెంచుకుంటూ.. ఇంత దూరం కలిసి ప్రయాణం చేసి, వాణ్ని ఇంతవాణ్ని చేశాం! మరి ఇదేమిటి? వాడు తొలిసారిగా ఒక కొత్త ఇల్లు కొనుక్కొని, మనల్నిలా ఆ ఇంటి గడపకవతల ప్రశ్నార్థకంగా నిలబెట్టాడు? వాడి దృష్టిలో తల్లిదండ్రుల స్థానం వాడింటి గదిలోనో, వాడి గుండె చప్పుడులోనో లేదు. వాడి గడపకివతల ఒక అతిథిగా మాత్రమే ఉంది. నిజానికి మనం ఊరవతల అంతదూరం వాడి ఇంటికి అసలు ఎప్పుడైనా వెళ్తామో లేదో.. అది పక్కన పెట్టండి. మాటవరసకు కూడా ఒక నిండుమాటను వాడు పలకలేకపోయాడు. మరి మనమెందుకు మన కొడుకును అలా అతిథిగా పెంచలేకపోయాం? మన శరీరంలోని ఒక భాగంగా, పంచప్రాణాలుగా చూసుకుంటూ ఎందుకని ఇన్నాళ్లూ పెంచి పెద్ద చేసుకుంటూ వచ్చాం?”.. ఆవేదనతో తల్లడిల్లుతూ ఆవేశంగా అన్నది వైశాలి.
“పిచ్చి వైశాలీ! వాడు కనీసం మనల్ని గడపకివతల నిలబెట్టి అన్ని గదులను, వాడి కొత్తింటిని ఎంతో ప్రేమగా, సంతోషంగా వివరంగా చూపించాడు. ఇప్పుడు చాలామంది పిల్లలు.. ‘మాకు స్పేస్ కావాలి!’ అంటూ తల్లిదండ్రులను తమ దరిదాపులకు కూడా రానివ్వడం లేదు. కనీసం మనుషుల్లా కూడా చూడటం లేదు. ఆ విధంగా చూస్తే మనం చాలా అదృష్టవంతులమే అనుకోవాలి. అసలీ ప్రపంచంలోకి మనమే అతిథులుగా వచ్చాం. ఇక మన పిల్లలు మనల్ని అతిథులను చేయడం ఏమిటి? నువ్వు ఇక ఎక్కువగా ఆలోచించకు. వాణ్ని వెళ్లిపోనీ. వాణ్ని ఎగరనీ! ఎదగనీ! ఇంకా ఎన్నో సాధించనీ! ఇలా ఏ తగవులూ లేకుండా, జీతుకు కొంచెం దూరంగా ఉంటూ.. కొంతలో కొంత బాంధవ్యాలను నిలబెట్టుకోవడం కన్నా మనం చేయగలిగిందేమీ లేదు. మనం మటుకు పెళ్లి కాగానే మన ఊరి నుంచి మన అమ్మా నాన్నలను వదిలిపెట్టి ఇక్కడ సిటీకి రాలేదా? ఇప్పుడెందుకని నీకు తేడాగా అనిపిస్తున్నది? మొన్నటి వరకు మనం ముగ్గురం. నిన్నటివరకు మనవడితో కలిపి ఐదుగురం. ఇవాల్టి నుంచి నాకు నువ్వు – నీకు నేను. ఇక మనిద్దరమే! అంతే! మనం ఎక్కడ ప్రయాణం ప్రారంభించామో.. మళ్లీ అక్కడికే వచ్చాం!”.. భార్య కన్నీళ్లు తుడుస్తూ భారంగా అన్నాడు రంగనాథ.
“మీరెన్నయినా చెప్పండి. మనం ప్రతిసారీ కొన్న కొత్త ఇంటికి వాణ్ని నేను చేయి పట్టుకొని తీసుకెళ్లి ఎంతో ప్రేమగా చూపించేదాన్ని. వాడి గదిని చూసినప్పుడు వాడి కళ్లలో మెరిసే మురిపాన్ని చూసి, నేను ఎంతో పొంగిపోయేదాన్ని. కానీ, ఇవాళ వాడు కొన్న కొత్త ఇంటిని.. పరాయివాళ్లకు చూపించినట్టుగా పై నుంచి వేలుపెట్టి చూపించాడు నాకు. ఇదా న్యాయం? ఇదా మన నిస్వార్థ ప్రేమకు.. మన పిల్లాడు మనకిచ్చే బహుమతి? ఈ బహుమతి చాలా బరువైనది. నేనసలు మోయలేనిది”.. వైశాలి కళ్లలో కన్నీళ్లు జలజలా రాలుతూనే ఉన్నాయి. రోజులు గడుస్తూనే ఉన్నాయి. రెండువైపులా రాకపోకలు చాలామటుకు తగ్గిపోతూనే ఉన్నాయి. మనవడి పుట్టినరోజుకు సాయంత్రం గ్రాండ్పార్టీ అని వెళ్లగానే.. ద్విజ అమ్మగారు, నాన్నగారు అతిథులు అందరితోపాటుగా రంగనాథకు, వైశాలికి స్వాగతం పలికారు.
భోజనాలు చేస్తుండగా మాటల్లో ఆవిడ అన్నది..
“ద్విజకు ఏడో నెల పడుతున్నది. అందుకని సాయంగా మమ్మల్ని ఉండమంటున్నారు. దాన్నే మా ఇంటికి వచ్చేయమంటున్నాం. కానీ, రాకీ స్కూల్ పోతుందంటున్నారు. మేం ఏం చేయాలా? అని ఆలోచిస్తున్నాం!”.. వైశాలి మౌనంగా విన్నది.చిన్నప్పటి నుంచి తన చేతుల్లో పుట్టి పెరిగిన మనవడు.. అసలు ఎంత ముద్దు చేద్దామన్నా తన దగ్గరికి అసలు రాలేదనీ, కొత్త వ్యక్తిని చూసినట్టు చూశాడని.. ఆ రాత్రి భర్తతో చెప్పుకొని బాధపడ్డది వైశాలి.
“రోజురోజుకూ మనషులు మారిపోతున్నారు. తన – పర గుర్తించడం చాలా కష్టం అవుతున్నది. ఇది మనసుకు చాలా గాయం చేస్తున్నది” నిట్టూరుస్తూ, విచారంగా అన్నది.
“ఎప్పుడైనా సరే, బంధాల మధ్య నిజమైన ప్రేమలు ఉంటే.. అవి దూరంగా ఉంటే తగ్గిపోవు. అలా అని దగ్గరగా ఉంటే పెరిగిపోవు. మన పిల్లాణ్ని ఏమన్నా అనుమతి అడిగి మనం కన్నామా చెప్పు? మనకిష్టమై మనం కన్నాం. ప్రేమగా, ప్రాణంగా చూసుకున్నాం. వాణ్ని ఇంతటి ఉన్నత స్థితికి చేర్చాం. అంతే! మన పని అంతవరకే! పిల్లలను వయసులో ఉన్నప్పుడు పట్టుకోవాలి. వయసు వచ్చాక విడిచేయాలి. అది మనకూ వర్తిస్తుంది. భవిషత్తులో వాళ్ల పిల్లలకూ అదే వర్తిస్తుంది!” గంభీరంగా అన్నాడు రంగనాథ.
భర్త వంక అయోమయంగా చూసిందామె.
“అవును వైశాలీ! జీతుని పూర్తిగా వదిలేసే సమయం వచ్చింది. మనమిప్పుడు జీవితంలోని ఆఖరి అంకంలోకి చేరుకున్నాం. ఇక ఎప్పుడో ఒకప్పుడు అందరికీ దూరంగా వెళ్లిపోవాల్సిన వాళ్లమే. జీతూ.. వాడి గమ్యాలను వెతుక్కుంటూ ఎంత దూరంగా వెళ్లిపోతే, మనకు అంత త్వరగా విముక్తి లభిస్తుంది. మరిక ఎన్నాళ్లని ఈ బంధాల ముళ్ల ముసుగులో ఉక్కిరిబిక్కిరి అవుతూ.. బాధపడుతూ ముందుకు సాగుతాం. ఇక ఎన్నాళ్లు ఈ ప్రేమ సంకెళ్లను హత్తుకోలేక.. విడదీసుకోలేక నిస్సహాయంగా దిక్కులు చూస్తాం! మనం మిగిలిన ఈ కాస్త జీవితాన్ని ఆనందంగా గడపాలి. ఏడుస్తూ, బాధపడుతూ కాదు. ఒకటి గుర్తుపెట్టుకో.. ఈ ఆఖరు అంకంలో ఇకనుంచి మన సంతోషాలను మన పిల్లాడిలో మనం అసలు వెతుక్కోకూడదు. మనలోనే, మన మధ్యే వెతుక్కోవాలి. అప్పుడే అది అర్థవంతమైన జీవితం అవుతుంది”.. కళ్లలోని నీళ్లు తుడుచుకుంటూ.. ఆలోచిస్తూ భర్త మాటలను వింటూ.. అతని భుజం మీద తలవాల్చింది వైశాలి.
“నాన్నా! నిన్నటి నుంచి మీ ఫోను కలవడంలేదు. ఎక్కడున్నారు? రేపు మీ మనవరాలి అన్నప్రాశన!”..
ఫోనులో ఆత్రంగా చెబుతున్నాడు జితేంద్ర.
“వారం రోజుల కిందట నేను నీకు ఫోన్ చేసినప్పుడు.. ‘మేం ఊళ్లో లేము! మా అత్తగారు మేమూ కలిసి పాపకు తలనీలాలు ఇవ్వడానికి తిరుపతికి వచ్చాం. సెల్ గదిలో పెట్టి దర్శనానికి వెళ్తున్నాం!’ అని చెప్పి, నేను చెప్పేది వినకుండా ఫోన్ పెట్టేశావు కదా! ఆ రోజే మేం ఉత్తరాఖండ్ బయల్దేరి వచ్చాంరా జీతూ!”.
“ఉత్తరాఖండ్ వెళ్లారా!? రేపు తెల్లారే ఇక్కడ ఫంక్షన్. మీరు లేకపోతే ఎలా?”.. ఆశ్చర్యంగానూ, బాధగానూ అన్నాడు జితేంద్ర,
“ఇదిగో ఉండు.. అమ్మకు ఇస్తాను!” అంటూ, ఫోన్ వైశాలికి అందించాడు రంగనాథ.
“జీతూ! ఎలా ఉన్నావురా? అర్ధరాత్రి, అపరాత్రి ఎప్పుడూ కాల్స్లోనే ఉంటావు? తినాలని కూడా ఎవరో ఒక్కళ్లు చెప్పాలి నీకు. వేళ పట్టుకు ఇంత అన్నం తినేసేయి. మేం ఇక్కడే ఇంకో నెల ఉంటాం. అన్నీ చూసుకుని కాశీ కూడా వెళ్లి తిరిగి వస్తాం. వినపడుతోందా!? ఇక్కడ సిగ్నల్స్ సరిగా లేవు. నిన్న యజ్ఞం ఎంత బాగా జరిగిందో? అబ్బా! ఇక్కడ గంగానది ఉరకలు వేస్తూ ఎంత వడివడిగా ప్రవహిస్తున్నదో? చుట్టూ పర్వతాలు, ఈ పచ్చదనం, ఈ చల్లటి గాలి.. ఎంత బావుందో! ఈ పచ్చటి ప్రకృతిలో ఆ దేవదేవుడు క్షణక్షణం సాక్షాత్కరిస్తున్నాడురా!”.. పరవశంగా చెప్పుకొంటూ వెళ్లిపోతున్నది వైశాలి.
వైశాలి ముఖంలో మెరుస్తున్న సంతృప్తిని, పెదాలపై విరిసిన ఆనందకరమైన చిరునవ్వును చూస్తూ.. భార్య తలను ఆప్యాయంగా నిమిరి, ఆమె భుజం చుట్టూ సంతోషంగా చేయి వేశాడు రంగనాథ.
– కామరాజుగడ్డ వాసవదత్త రమణ
9704444760