జరిగిన కథ : చౌండ ఇంటినుంచి బయటికి వచ్చిన జాయప.. అనుకోకుండా సుబుద్ధిని కలుసుకున్నాడు. జాయప పెద్దల గుర్తింపులో లేడని గుర్తించిన సుబుద్ధి.. అతణ్ని తన ఇంటికి తీసుకెళ్లాడు. సుబుద్ధి నివసించే వీధి మొత్తం తన బంధువులే. అందరి పిల్లలూ కలిపి దాదాపు పాతిక మందివరకూ ఉంటారు. అశుభ్రంగా, నలిగిన బట్టల్లో ఉన్నప్పటికీ.. వాళ్లంతా జాయపకు నచ్చారు. వారితో కలిసి ఎన్నో ఆటలు ఆడాడు. అయితే, చౌండ సేనాని వేగులు జాయపను అనుసరిస్తూనే ఉన్నారు. ఆ విషయాన్ని గుర్తించిన సుబుద్ధి.. వెంటనే చౌండను శరణు కోరాడు.
మరునాడు ఆటల్లో పరుగెడుతూ పక్కసందులో ఓ ఇంటి అరుగుమీద మరో గురువు ఆ వీధి పిల్లలకు పాఠాలు చెబుతుండటం చూశాడు జాయప. అక్కడే నిలబడ్డాడు. గురువు చెబుతున్నాడు, పిల్లలు వల్లె వేస్తున్నారు.
“ఓం సరస్వతీ నమస్తుభ్యం! వరదే కామరూపిణి!!
విద్యారంభం కరిష్యామి! సిద్ధిర్ భవతు మే సదా!!”
అక్కడున్న పాతికమంది పిల్లలు సరస్వతి ప్రార్థన చేయడం చూసిన జాయపకు ఆ గురువు నచ్చాడు. శుక్రశర్మ ఈడువాడే. లేత పసుపు నీర్కావి ధోవతి కట్టి, గంగమట్టితో లలాటాన బొట్టుపెట్టి, జరీపట్టు కండువా ధరించి తెల్లగా మెరుస్తున్న జన్నిదంతో అందమైన శిఖతో, జ్ఞానకాంతితో మెరిసే కళ్లతో.. నిజమైన గురువుగా తోచాడు. జాయపకు నచ్చింది అతని కంఠం. శ్రావ్యంగా.. పఠనంలోని మాధుర్యాన్ని పంచుతున్నది. ఉత్సాహంగా ఆ ఎత్తయిన అరుగు దగ్గరగా వెళ్లి తనూ గొంతు కలిపాడు. అది చూసి అతణ్ని దగ్గరికి రమ్మని పిలిచాడు గురువు.
“ఎవరి అబ్బాయివి నువ్వు? చదువుకుంటావా?” అన్నాడు. “జాయప మమ నామం. అహం భో అభివాదయే!”.. చెప్పి చేతులు జోడించి నమస్కరించాడు. గురువు ఆనందంతో తన్మయుడయ్యాడు. జాయప పెద్ద పండితుల వద్ద అభ్యసించిన కులీన కుటుంబానికి చెందిన పిల్లవానిగా గుర్తించాడు.
“నాపేరు నాగంభట్టు” అన్నాడాయన మెరిసే కళ్లతో. సాధారణంగా గురువు పిల్లలకు తన పేరు చెప్పుకోడు. తమ తోటి పిల్లవానికి గురువు పేరు చెప్పుకోవడంతో పిల్లలు ఆశ్చర్యంగా జాయపను చూశారు. ఆ తర్వాత పిల్లలు కింద చిన్న అరుగుపై అప్పటికే పేర్చి ఉన్న మట్టిలో చూపుడు వేలు పెట్టి అక్షరాలు దిద్దుతుండగా.. నాగంభట్టు ఆ అక్షరాలను వల్లె వేయించాడు. ప్రాథమికంగా విద్యాభ్యాసం తొలిదశ.. లేఖనం (చదవడం), గణనం (లెక్కలు), రూపనం (రాయడం/చిత్రించడం). దివి రాజ కుమారుడిగా జాయపకు అత్యుత్తమ గురువులతో విద్యాభ్యాసం ప్రారంభమయ్యింది. అక్కడ పలకపై సుద్దముక్కతో రాసేవాడు. ఇక్కడ పిల్లలు మట్టిలో వేలుపెట్టి రాయడం అతనికి వింతగా తోచింది. తల్లి దాయాంబ కూడా రామాయణ భారతాల్లో ప్రవీణురాలు. గోరు ముద్దలవేళ ఆమె ఎన్నో కథలు చెప్పేది. అలాగే యుద్ధవిద్యలు కూడా పిల్లలకు చిరుప్రాయంలోనే నేర్పడం ప్రారంభించారు పినచోడుని అన్నదమ్ములు. అన్నిటిలోనూ ప్రావీణ్యం పొందుతున్న వేళ.. విచిత్రంగా అనుమకొండ చేరాడు జాయప. నాగంభట్టు గురించి సుబుద్ధికి చెప్పాడు జాయప. ఆయన నవ్వి..
“మనవాళ్లకు చదువెందుకు యువరాజా. రేపో ఎల్లుండో పెద్దవాళ్లయిన మగపిల్లలను యుద్ధ శిక్షణశాలకు తోలుకుపోతా. ఆడపిల్లలు ఎట్టాగూ తల్లులకు ఇంట్లో పనికి సహాయపడతారు. మనోళ్లకు ఈ పిచ్చి పంతులు చాల్లే..” అన్నాడు నిరాసక్తంగా.
“మీకు నచ్చితే మీరు చదువుకోండి. నేను ఆయనకు తగిన సంభావనలు ఇస్తాను” అన్నాడు కూడా. మర్నాడు చక్కగా బావివద్ద స్నానంచేసి, పక్కవీధిలో నాగంభట్టు పాఠశాలకు వెళ్లాడు జాయప. చిత్రంగా జాయప కోసమే ఎదురుచూస్తున్నట్లు నాగంభట్టు వీధి వైపు చూస్తూ ఉన్నాడు. జాయప రావడం చూసి ఆయన ముఖం విప్పారింది. జాయప కూడా వంగి పాదాలకు నమస్కరించాడు. పులకిత మనస్కుడయ్యాడు భట్టు.
“భర్తృహరి అనే ఓ మహా పురుషుడు చెప్పిన ఓ మహత్తర సుభాషితాన్ని చెబుతాను విను. దీనిని జీవితంలో ఎప్పుడూ మర్చిపోకూడదు సుమా!”.. ఇష్టమైన శిష్యునికి గురువు రహస్యంగా చెప్పే ముఖ్యపాఠంలా అన్నాడు నాగంభట్టు. వినయంగా చేతులు జోడించాడు జాయప.. చెప్పమన్నట్లు. మధురంగా పాడాడు నాగంభట్టు.
“కేయూరాణి న విభూషయంతి పురుషం హారా న చంద్రోజ్జ్వలా
న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజాః
వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే
క్షీయంతే ఖిల భూషణాని సతతం వాగ్భూషణం భూషణం ॥”..
“అంటే?..” అన్నాడు జాయప అప్రయత్నంగా. “అంటే.. పుష్పాలంకరణ గానీ, వెన్నెల వెలుగుల బంగారు నగలు గానీ, చందన అత్తరు లేపనాలు గానీ, చూపులను ఆకర్షించే కేశాలంకరణలు గానీ పురుషునికి సొబగులు తేలేవు. కేవలం చదువు ఒక్కటే.. అదికూడా సంస్కరించబడిన చదువు మాత్రమే పురుషుణ్ని ఎప్పటికీ నశింపక అంటిపెట్టుకుని ఉండే అలంకారం అవుతుంది..” వివరించాడు భట్టు.అది వినగానే జాయప ఎంతో పరవశించాడు.
“వాగ్భూషణం భూషణం.. బావుంది బావుంది” అన్నాడు.. పద్యాన్ని స్మరిస్తూ, ప్రతి పదాన్నీ అర్థం చేసుకుంటూ. భర్తృహరి నామం, ఆయన సుభాషితాలు జాయప జీవితాన్ని సాంస్కృతికం చేశాయి.
“గురుబ్రహ్మ.. గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః
గురుస్సాక్షాత్ పరబ్రహ్మ.. తస్మై శ్రీగురవే నమః”
శుక్రశర్మకు చేయని గురువందనం నాగంభట్టుకు చేశాడు జాయప. తెలియని వయసు నుంచే సుభాషితాలు, మహాకవుల వాక్యాలు అతణ్ని విశేషంగా ఆకర్షించేవి. జాయప తన శిష్యవర్గంవాడైనా అతనిలో వయసుకు మించిన ప్రతిభను గుర్తించిన నాగంభట్టు.. తమ అనుబంధాన్ని శిష్యరికంగా కాక మంచి స్నేహంగా మలిచాడు ఆ తర్వాత. నాగంభట్టు వేదవేదాంగ పండితుడైన శివభట్టోపాధ్యాయ కుమారుడు. పది తరాలుగా ఉపాధ్యాయవృత్తిలో ఉంటూ ఎందరో విప్రుల, కులీన, మండలేశ్వరుల పిల్లలకు విద్య నేర్పాడు. అందరూ విద్య నేర్వాలన్న బౌద్ధ, జైన విధానాలను వదలనివారు శివభట్టు, నాగంభట్టు. నాగంభట్టు పాఠ్యాంశాలే కాదు.. విద్యారంగం గురించి, అతని తాతల ఆశయం, దానిని అతను నెరవేర్చాలన్న ప్రగాఢమైన దీక్ష గురించి కూడా పిచ్చాపాటిగా జాయపతో ముచ్చటించేవాడు. నాగంభట్టుకు విద్యకు ఎంతో ప్రాధాన్యమిచ్చిన బౌద్ధ, జైనాలు కూడా అంతే ప్రీతి. అతని అసలు పేరు నాగార్జున భట్టోపాధ్యాయ. ఆయన పేరు మార్చుకోవడం జాయపను ఆశ్చర్యానికి గురిచేసింది.
“మా తాతలు శ్రీపర్వత విశ్వవిద్యాలయంలో సాక్షాత్తూ శ్రీ నాగార్జునులవారి వద్దే విద్యను అభ్యసించారు. అప్పటినుంచి మా ఇంట్లో నాగార్జునుని పేరు అనూచానంగా వస్తూ ఉంది. నన్నయభట్టు మా గోత్రీకుడే. మా తాతలు కొందరు వేంగి నుంచి విజయపురి విశ్వవిద్యాలయానికి వెళ్లి చదువుకున్నారు. అనంతరం ఇక్కడ జైనం వర్ధిల్లుతుండటం చూసి ఇక్కడికి వలస వచ్చారు. నన్నయ, మరికొందరు వేంగిలోనే ఉండిపోయారు. అప్పటి కాకతీయ మహారాజు ప్రోలరాజ వర్యులకు మా ముత్తాత శ్రీనృసింహభట్టుగారు విద్య నేర్పించారు. ఇప్పుడు కాకతీయ రాజ్యంలో జైనం కాస్తకాస్తగా క్షీణించి శైవమతాన్ని ఆచరించడం ఎక్కువైంది. ఈ గణపతిదేవ మహారాజు కూడా శివదీక్ష తీసుకున్నాడని విన్నాను. ఇక చదువు చంకనాకి పోతుందేమో!?”.
“అదేమిటి గురువుగారూ. మతంతోనే చదువు కూడానా!? మతప్రసక్తి లేకుండా చదువు ఉండదా?”.
“మతం కంటే దైనందిన జీవనానికి ఎక్కువ ప్రాధాన్యమిచ్చాయి బౌద్ధ, జైనాలు. ప్రజలను విడదీసి చూడకుండా అందరికీ విద్య నేర్పాయి. మతం ఏమో గానీ.. రాజాశ్రయం లేనిదే విద్యే కాదు గురువూ బతకలేడు. ప్చ్!?” అన్నాడు నాగంభట్టు.
మరోరోజు మరోసారి చదువులపై చర్చ వచ్చింది.
“మా ముత్తాత నృసింహభట్టు, అసలు అక్షరాభ్యాసం ఎలా చెయ్యాలో.. చేశాక తొట్టతొలుత ఏమి చెప్పాలో బౌద్ధ, జైన విధానాలను అనుసరించి ఇప్పటి బాలలకు, కౌమారులకు, యువతకు వేరువేరుగా పాఠ్య ప్రణాళిక తయారుచేశారు. కాకతీయ ప్రజలను విద్యావంతులుగా చేసే ఈ విద్యావిధానం ప్రోలరాజువర్యులకు నివేదించి ఈ విధానవ్యాప్తికి తనకొక అగ్రహారం ఇవ్వమని అభ్యర్ధించారు. చక్రవర్తి అంగీకరించారు. అయితే ఓ మంత్రి అడ్డుపడి ఆ అగ్రహారాన్ని మరో గురువుకు బదలాయించాడు. తాతగారు ఆ దుఃఖంతోనే మరణించారు. ఆయన ఆశయసాధనకు మూడుతరాలుగా తపస్సు చేస్తున్నాం. ఇప్పుడు మా పేరు కూడా పెద్ద అవరోధం అయ్యింది. రాజులు ప్రేమించిన మతావలంబులే వారికి ప్రీతి కదా! ఏది ఏమైనా నేను మా ముత్తాత గారి పేరుతో ఘటికాస్థానం ఏర్పాటుచేసి, దానిని కాకతీయ రాజ్యంలో అద్భుత విద్యాకేంద్రంగా తీర్చిదిద్ది.. వారి ఆశయాన్ని నెరవేర్చాలి..” అన్నాడు నాగంభట్టు. జాయప ఈ అంశాన్ని మర్చిపోడని.. భట్టుకు తెలియదు.
ఓ రోజు సుబుద్ధిని గట్టిగా నిలదీశాడు జాయప.. అదీ అతని పెద్దభార్య సోమిదమ్మ సమక్షంలో. ఆమెకు జాయప అంటే ఎంతోముద్దు. జాయపను తన పిల్లలకంటే మురిపెంగా చూస్తుంది.
“మామయ గారూ! గతం గతః.. ఇప్పుడు విద్య అందరికీ కావాల్సిందే! మీరు అన్యధా భావించకుండా మన పిల్లలందరికీ చదువు నేర్పించాల్సిందే. మంచి గురువు దొరికాడు. మంచి గురువువద్ద చదువు నేర్చుకోకపోతే ఒక తరం నాశనం అవుతుందని మా గురువుగారు చెప్పారు. అందుచేత ఉత్తమ గురువు వద్ద మన పిల్లలకు విద్య చెప్పించాలి. ఆడవాళ్లకు విద్య మరింత ముఖ్యమని గురువుగారు అంటారు. మరో సంగతి, నేనూ రేపటినుంచి మీతో యుద్ధ శిక్షణశాలకు వస్తాను. కాస్త యుద్ధవిద్యలు నేర్పండి” అన్నాడు జాయప. పిల్లలకు.. ముఖ్యంగా ఆడపిల్లలకు చదువు తప్పనిసరి అనడం సోమిదమ్మకూ, తను కూడా యుద్ధశిక్షణకు వస్తాననడం సుబుద్ధికి బాగా నచ్చాయి. ఆయన మెరిసే కళ్లతో చూస్తుంటే సోమిదమ్మ జాయప బుగ్గలు గట్టిగా పుణికింది. జాయప గతంకంటే కొంచెం స్థిరంగా, పెద్దరికంగా మాట్లాడటం ఆ ఇద్దరి దృష్టిలో నిలిచింది.మర్నాడు శుక్రశర్మ పాఠం చెబుతుండగా నాగంభట్టు అక్కడికి వచ్చాడు. పక్కన జాయప.
“మీ పేరు ఏమిటి? మీ గురుపరంపర ఏమిటి? గురువు హోదా ఎక్కడ తీసుకున్నారు?”.. సూటిగా అడిగాడు నాగంభట్టు.శుక్రశర్మ తేలుకుట్టిన దొంగలా బిక్కచచ్చిపోయి నేలచూపులు చూస్తున్నాడు. ప్రాచీనకాలం నుంచి గురుశిష్య పరంపర భారతీయ విద్యావిధానం. గురువుగా నియమించుకునే సమయంలో అందరూ అడిగే ప్రశ్న.. ‘మీ గురుపరంపర ఏమిటి?’ అని. ఆ గురువు ఎవరివద్ద విద్య అభ్యసించాడో ఆ గురువుకు గురువు.. ఆపై గురువు.. ఇలా కొంత పరంపర చెప్పినప్పుడే ఈయన ప్రతిభను నిర్ణయించి గురువుగా అంగీకరిస్తారు.
“మీ అజ్ఞాన విద్యవల్ల పిల్లలు చెడిపోయే ప్రమాదం ఉంది. అందుకే నేను జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. మీరు అన్యధా భావించకుండా ముందు పండిత పరీక్ష ఉత్తీర్ణులు కావాలి. అందుకు మా తండ్రిగారు మీకు సహాయపడగలరు. దయచేసి మా ఘటికాస్థానానికి రండి” అని శుక్రశర్మను వెంట బెట్టుకుని తండ్రి వద్దకు తీసుకెళ్లాడు నాగంభట్టు. ఆ మర్నాటినుంచి నాగంభట్టు సుబుద్ధి పిల్లలకు, మరో నాలుగు నెలల్లో ఆ వాడలోని పిల్లలందరికీ గురువయ్యాడు. చతుర్ధవర్ణ శూద్రులైన వీరబలింజ కులస్తులు నివసించే ఆ వాడ ఇప్పుడు పూర్తి చదువులవాడగా అనుమకొండలోనే గుర్తింపులోకి వచ్చింది. అందుకు ప్రధాన విద్యారూపం నాగంభట్టుదైతే.. అందరినీ సమాయత్తపరచిన నిర్వహణ రూపం.. జాయపది. (సశేషం)
-మత్తి భానుమూర్తి