Kasi Majili Kathalu Episode 91 ( కాశీ మజిలీ కథలు ) |జరిగిన కథ : గంగలో మునిగిపోతున్న ఒక స్త్రీని రక్షించబోయి.. ఫణిదత్తుడు పాతాళానికి వెళ్లిపోయాడు. అక్కడ వరుణకన్యకల కోరిక మేరకు సింహంతో యుద్ధం చేసి, కొన్ని దివ్యవస్తువులు సంపాదించుకున్నాడు. పితృదత్తకు గర్భం చేసిన మణిమంతుడు.. కాళిదాసు ప్రభావం వల్ల భోజరాజు వద్దకు వచ్చాడు. ఆయన శాసనం ప్రకారం పితృదత్తను భార్యగా చేపట్టాడు.
కాశీనగరం ప్రశాంతంగా ఉంది. గంగ ఒడ్డున కూర్చుని సుబాహుడు తన మనసులో ఫణిదత్తుడి గురించే తలపోస్తున్నాడు.‘మిత్రమా! నిన్ను చేజార్చుకున్న తరువాత నాకీ జీవితం ఎందుకు!’ అని కన్నీరు కారుస్తున్నాడు. సరిగ్గా ఆ సమయంలోనే నదినుంచి ఒక మనిషి పైకి లేచి వస్తున్నాడు. సుబాహుడు ముందుగా పట్టించుకోలేదు కానీ, ఆ మనిషి దగ్గరికి వస్తున్నకొద్దీ అతని ఆశ్చర్యానికి, ఆనందానికి మేర లేకుండా పోయింది. పరుగుపరుగున వెళ్లి కౌగిలించుకున్నాడు.
“మిత్రమా! వచ్చావా? బతికే ఉన్నావా?”
అంటూ ఒళ్లంతా తడిమి చూశాడు.ఫణిదత్తుడు గట్టుకు వచ్చి, సేదదీరిన తరువాత తన కథనంతా వివరంగా చెప్పాడు. తాను పాతాళలోకానికి వెళ్లడం, అక్కడ వరుణకన్యకల కోరిక మేరకు సింహాన్ని చంపడం వరకు గల కథనంతా చెప్పాడు.
సింహాన్ని చంపిన తరువాత ఆ లోకానికి రెండో దిక్కున కాపలాగా ఉన్న గుర్రం దగ్గరికి వెళ్లాడు ఫణిదత్తుడు. సింహం దగ్గర శంఖం, చురకత్తి ఉన్నట్లే.. ఈ గుర్రం దగ్గర ఒక తాళం చెవి, నాగమణి ఉంటాయి. అవి రెండూ ముందుగా చేజిక్కించుకుంటే తప్ప గుర్రాన్ని చంపడం సాధ్యం కాదు. ఫణిదత్తుడు అలాగే చేసి, గుర్రాన్ని చంపాడు. దివ్యవస్తువులతో వరుణకన్యకలు ఉన్న దిక్కుకు బయల్దేరాడు. కొంతదూరం వెళ్లాక.. దారి మధ్యలో నేలలో పాతిన ఇనుపతలుపు ఒకటి కనిపించింది. ‘ఇదే వరుణలోకానికి మార్గం అయి ఉండాలి’ అనుకుంటూ, తన చెంతనున్న తాళం చెవితో తలుపు తెరిచేందుకు ప్రయత్నించాడు. వెంటనే తలుపు పైకి ఎగిరిపోయింది. లోపలికి సోపాన మార్గం దర్శనమిచ్చింది. సాహసంతో ఆ మార్గంలో ప్రవేశించి పదిమెట్లు దిగగానే రెండుదారులు కనిపించాయి. కుడివైపు మార్గాన్ని ఎంచుకుని, కొంచెం దూరం వెళ్లగానే చీకటిపోయి వెలుగు వచ్చింది. ఆ వెలుగులో అతనికొక గుడి, ఆ పక్కనే ఒక సరోవరం కన్నులపండువ కావించాయి. బాగా అలసిపోయి ఉన్న కారణంగా ఆ చెరువులో హాయిగా స్నానం చేయాలనిపించింది.
..“కట్టుబట్టలతోనే చెరువులో మునిగాను. లేచి చూస్తే ఇక్కడ తేలాను. ఇదంతా కలకాబోలు అనుకున్నాను కానీ, చూడు.. నేను సంపాదించుకున్న వస్తువులన్నీ నా దగ్గరే ఉన్నాయి” అని వాటిని సుబాహుడికి చూపాడు ఫణిదత్తుడు.
“నిజమే! లోకంలో అప్పుడప్పుడూ ఇలాంటి వింతలు జరుగుతుంటాయి” అన్నాడు సుబాహుడు.
“ఇంతకూ మన మిత్రులందరూ ఎలా ఉన్నారు?! నేను పాతాళానికి వెళ్లి ఎంతకాలమైందో చెప్పగలవా?!” అడిగాడు ఫణిదత్తుడు.
“సుమారుగా ఏడాది కాలం గడిచి ఉంటుంది. నువ్వు బతికి ఉంటావనే ఆశ వదిలేసుకుని మేమందరం పాటలీపుత్రం వెళ్లిపోయాం. నీ మరణవార్త విని, మీ అమ్మ గుండెలు బాదుకుని ఏడ్చింది. మేం వెళ్లిన కొద్దిరోజులకు మహారాజుగారు మరణించారు. రుక్మవర్మ రాజయ్యాడు. మేమింక ఆ నగరంలో ఉండలేకపోయాం. మన సుప్రహస్తుడు, వజ్రకాయుడు ఉజ్జయినిలో ఉంటున్నారు. నేను మాత్రం నీ జ్ఞాపకాలను మరిచిపోలేక, ఎప్పటికైనా తిరిగివస్తావని ఏదో ఒక గుడ్డినమ్మకంతో ఇక్కడికి వచ్చాను. నా అదృష్టం కొద్దీ నువ్వు కంటపడ్డావు” అని చెప్పాడు సుబాహుడు.
“అబ్బా! అంతకాలమైందా? సరే.. పద. మనం వేగంగా ఇంటికి పోదాం. వెంటనే అమ్మను చూడాలి. పాపం నాకోసం ఎంత బెంగపెట్టుకుందో” అన్నాడు ఫణిదత్తుడు బయల్దేరదీస్తూ. వాళ్లిద్దరూ ఆనాడే ప్రయాణం కట్టారు. పాటలీపుత్రం అక్కడికి ఇరవైరోజుల ప్రయాణ దూరం. మార్గమధ్యంలో వారికి తమ ఊరి వర్తకుడొకడు కనిపించాడు.
“ఊళ్లో విశేషాలేమిటి? రుక్మవర్మ కుదురుగా ఉంటున్నాడా?” అని అడిగాడు సుబాహుడు.
“బాగానే ఉన్నాడు. చచ్చి బతికిన తరువాత బుద్ధి తెచ్చుకున్నాడు. ఇప్పుడు మంత్రులమాట పాటిస్తూ రాజ్యాన్ని చక్కగా పాలిస్తున్నాడు” అని సమాధానమిచ్చాడు వర్తకుడు.
“చచ్చి బతకడం ఏమిటి? సరిగా వివరంగా చెప్పు” అని అడిగాడు ఫణిదత్తుడు.
“రుక్మవర్మ రాజు కాగానే మీ తల్లిగారిపై అభియోగం తెచ్చిన కామందకుణ్ని విడుదల చేశాడు. తన నిజాయతీని నిరూపించుకోమని అవకాశం ఇచ్చాడు. వాడు కాస్తా ధారానగరం వెళ్లి, దొంగ సాక్ష్యాలు సంపాదించుకుని వచ్చాడు. వాటి ఆధారంగా మీ అమ్మగారు కామందకుని భార్యే అని తీర్పునిచ్చాడు రుక్మవర్మ. ఇంతలోనే అక్కడికి మరోవ్యక్తి వచ్చి, తానే పితృదత్త భర్తనని ధ్రువీకరిస్తూ భోజరాజిచ్చిన పత్రాన్ని చూపించాడు. కానీ రుక్మవర్మ తన తీర్పు మార్చలేనని చెప్పాడు. దాంతో పత్రాన్ని తీసుకొచ్చిన వ్యక్తి ఒక పాములా మారి రుక్మవర్మను, కామందకుణ్ని కాటేశాడు. మీ తల్లిగారిని తీసుకుని ఎటో వెళ్లిపోయాడు. కామందకుడు చచ్చిపోయాడు. కానీ రుక్మవర్మను వైద్యులు బతికించ
గలిగారు. ఆనాటినుంచి అతని బుద్ధి కుదురుకుంది. ఇదీ జరిగిన కథ” అని చెప్పాడు వర్తకుడు.అంతా విన్న తరువాత ఫణిదత్తుడు నిట్టూర్చి..
“అయితే ఎట్టకేలకు మా తండ్రిగారు తిరిగివచ్చారన్నమాట. సంతోషం. సుబాహూ! అమ్మలేని ఊరికి వెళ్లడం ఎందుకు?! వాళ్లెక్కడికి వెళ్లారని వెతకగలం? ముందు మనం ఉజ్జయినికి పోయి మిత్రులను కలుసుకుందాం” అన్నాడు. వాళ్లు ఉజ్జయిని దిశగా అరణ్యాల మధ్యనుంచి ప్రయాణం కొనసాగించారు. ఒకచోట వారికి ఒక నిస్సహాయురాలైన యువతి జుట్టు విరబోసుకుని దుఃఖిస్తూ కనిపించింది. మిత్రులిద్దరూ ఆమె వద్దకు వెళ్లి శోకకారణం ఏమిటని అడిగారు. తాను, తన భర్త మాళవదేశం నుంచి ఈ మార్గంలో వెళ్తుండగా, పులి మీద పడిందని.. తన మగడు ఆ పులిని తరుముతూ వెళ్లాడని, వారం రోజులైనా తిరిగి రాలేదని.. చెప్పిందామె. ఫణిదత్తుడు ఆమెను ఊరడించాడు. తమతో రమ్మని, ఉజ్జయిని చేరుస్తామని చెప్పాడు. ముగ్గురూ కలిసి పగలంతా ప్రయాణించారు. చీకటి పడేవేళకు వాళ్లకు ఓ కుగ్రామం కనిపించింది. ఆ ఊరిలో చాలా ఇళ్లున్నాయి. కానీ మనుషులెవ్వరూ లేరు. పశుపక్షి మృగాదులు కూడా లేవు. ఓ ఇంటిలోకి వెళ్లిచూడగా గృహోపకరణాలన్నీ మాసి దుమ్ముపట్టి ఉన్నాయి.
ఒక వీధిలో మనుషుల అస్థిపంజరాలు రాసులుగా పోగుపడి ఉన్నాయి. అక్కడ రాత్రంతా గడపడం క్షేమకరమో కాదో తెలియదు. కానీ, అప్పటికే చీకటి పడిపోవడంతో చేసేది లేక ఒక ఇంటి అరుగుమీద మిత్రులిద్దరూ నిద్రకు ఉపక్రమించారు. వారికి దూరంగా యువతి నిద్రించింది. మధ్యరాత్రివేళకు ఫణిదత్తుడికి మెలకువ వచ్చిచూసేసరికి.. కరకరమని చప్పుడు వినిపించసాగింది. ఆ యువతి రాక్షసి రూపం దాల్చి, సుబాహుణ్ని నమిలి మింగేస్తున్నది. అతని అవయవాలను నోటిలోకి తోసివేసుకుంటూ నములుతున్నది. ఆ దృశ్యాన్ని చూసిన ఫణిదత్తుడికి రౌద్రం కట్టలు తెంచుకుంది. హనుమంతుడు లంకిణిమీద విజృంభించినట్లుగా ఫణిదత్తుడు చప్పుడు చేయకుండా వెళ్లి ఆ రాక్షసి బ్రహ్మరంధ్రం పగిలేలా ఒక్క గుద్దు గుద్దాడు. ఆ దెబ్బకు దాని ముక్కురంధ్రాల నుంచి రక్తం కారసాగింది. అది కుయ్యోమని అరుస్తూ పైకి లేవబోయింది. ఫణిదత్తుడు దానికి ఆ అవకాశం లేకుండా మరో పిడికిలి పోటు పొడిచాడు. అది వికృతంగా అరుస్తూ నేలమీద వాలిపోయింది. అంతలో దాని శరీరంనుంచి ఒక దేవకాంత బయటికి వచ్చింది.
“మహాత్మా! నేనొక దేవకాంతను. రుషి శాపానికి గురై ఈ రాక్షసిగా మారాను. నీ దయవల్ల నాకిప్పటికి శాప విమోచనం కలిగింది. నీకేదైనా కోరిక ఉంటే చెప్పు. తీర్చి నా స్థానానికి వెళ్తాను” అని చెప్పిందామె.
“నువ్వు పొట్టన పెట్టుకున్న నా మిత్రుణ్ని తిరిగి బతికించు!్ద” అన్నాడు ఫణిదత్తుడు. ఆమె ప్రభావం వల్ల సుబాహుని అస్థిపంజరం తిరిగి ప్రాణం పోసుకుంది. అతను నిద్రనుంచి మేల్కొన్నట్లుగా లేచి కూర్చున్నాడు.
“మిత్రమా! మనం ఇక్కడున్నామేమిటి? అక్కడ కదా పడుకున్నాం. మనతో వచ్చిన ఆ అమ్మాయేది?” అని అడిగాడు.
“అదంతా దారిలో చెబుతాను. పదముందు. ఇక్కణ్నుంచి వెళ్లిపోదాం” అంటూ దారితీశాడు ఫణిదత్తుడు. వేగంగా నడక సాగిస్తూ పదిరోజుల వ్యవధిలోనే వారు ఉజ్జయినికి చేరుకున్నారు. మిత్రులైన సుప్రహస్తుడు, వజ్రకాయులను కలుసుకుని వారిని ఆనందింప చేశారు. కొంతకాలం మిత్రులందరూ హాయిగా కాలం గడిపారు. అక్కడ ఉన్న రోజుల్లో మిత్రుల ఇళ్లలో తాండవిస్తున్న దారిద్య్రాన్ని చూసి, ఫణిదత్తుడు కలత చెందాడు. వారి కుటుంబాలకు ఏదో ఒకవిధంగా ఆర్థిక సహాయం చేయాలని తలచాడు. కానీ అందుకు మార్గమేమీ స్ఫురించలేదు. ఆ విషయంలో సుబాహుణ్ని సంప్రదిస్తే..
“మనం నలుగురం పాటలీపుత్రం పోదాం. రుక్మవర్మ తల చితగ్గొట్టి, సొమ్ము లాక్కుందాం” అన్నాడు.
“అవును. అతనికి తగిన బుద్ధి చెప్పాల్సిందే! పదండి పాటలీపుత్రానికి” అన్నాడు ఫణిదత్తుడు.నలుగురూ తిరిగి ప్రయాణం కట్టారు. వారికి దారిమధ్యలో సురప్రస్థమనే నగరం తారసపడింది. భూరిశ్రవుడనే రాజు పాలించే నగరమది. ఫణిదత్తుడు ఆ నగరంలో కూలి అయినా చేసి, ధనం సంపాదించి మిత్రుల తల్లిదండ్రులకు పంపాలని.. కొన్ని దినాలు ఆ ఊరిలోనే ఉండిపోయాడు.కానీ, ధన సంపాదనకు ఎటువంటి ఉపాయంతోచలేదు. చివరికి దొంగతనం చేసైనా సరే, ధనం సంపాదించాలని మిత్రులందరూ నిశ్చయం చేసుకున్నారు. అయితే అలవాటు లేని దొంగతనం ఎలా చేయాలి? ఎక్కడ చేయాలనే మీమాంస వచ్చింది. చివరికి రాజుగారి ధనాగారానికే కన్నం వేయాలని నిర్ణయించుకున్నారు. వింతలు చూసే నెపంతో కోటలోకి వెళ్లి, ధనాగారం ఆనుపానులు తెలుసుకొచ్చారు. ఆ నగరానికి ఉత్తరంగా క్రోసు దూరంలో చిన్న మెట్ట ఉంది. దానివద్దనున్న పల్లపునేల నుంచి సొరంగం తవ్వడం ప్రారంభించారు. వజ్రకాయుడు మట్టి తవ్వుతుండగా.. మిగిలినవారు సహకరించారు. నెలరోజుల వ్యవధిలో తవ్వకం పూర్తయింది.చివరిరోజున వజ్రకాయుడు బయటికి వచ్చి..
“ఫణిదత్తా! సొరంగం పూర్తయింది. దీనికి చివరనున్న ‘కుట్టిమ శిల’ను పైకి లేపితే నేరుగా ధనాగారంలో తేలతాం” అన్నాడు. మిత్రులందరూ సంతోషించారు. మరునాడు సొరంగం మొదట సుబాహుణ్ని, మధ్యలో సుప్రహస్తుణ్ని, వజ్రకాయుణ్ని కాపలా ఉంచి ఫణిదత్తుడు ఒక్కడే చివరివరకూ వెళ్లాడు. శిలను తొలగించి.. పైకి వెళ్లాడు. అది భాండాగారం కాదు. ఒక సుందరమైన అంతఃపురం. లోపల పట్టపగలులాగా విద్యుద్దీపాలు వెలుగుతున్నాయి. బంగారుతీగలతో, అద్దాలతో కూర్చిన చిత్రపటాలు కుడ్యాలపై వేలాడగట్టి ఉన్నాయి. విశాలమైన ఆ గదిలో హంసతూలికా తల్పంలో ఒక చిన్నది శయనించి ఉన్నది.
‘ఔరా! మా వజ్రకాయుడు పొరబాటు చేశాడు. ఈమె రాజపుత్రిక కాబోలు. ఈమె ఒంటిపై విలువైన ఆభరణాలు ఉన్నాయి. వీటిని దొంగిలించుకుని పోతే చాలా సొమ్ము వస్తుంది. కానీ అది చాలా ప్రమాదకరం కదా!’ అనుకున్నాడు ఫణిదత్తుడు. అంతలోనే.. ‘అయ్యో! ఉత్తమకులంలో పుట్టిన నేను ఇటువంటి నికృష్టమైన చౌర్యవృత్తికి దిగానేమిటి? ఇంత తుచ్ఛమైన పనికోసం ఎంత ప్రయత్నం చేశాను! మావంటి వీరులు చేయదగిన పనేనా ఇది?! ఇంతకంటే యాచించడం మంచిది’ అని తనలో తాను తర్కించుకున్నాడు. వెంటనే తొలగించిన రాతిబండలను మళ్లీ మూసివేసి బిలమార్గం వెంట వెనక్కి పోయాడు. మిత్రులకు జరిగింది చెప్పాడు.
“ఆ గదిలోకి వెళ్లగానే నా మనసు నాకు ఎదురు తిరిగింది. మనం ఈ మార్గం విడిచిపెట్టి, మరోరకంగా ధనార్జన చేద్దాం” అని చెప్పాడు. మిత్రులందరూ సరేనని అంగీకరించి, బిలమర్గానికి ఒక పాషాణాన్ని అడ్డుపెట్టి, నగరంలోకి ప్రవేశించారు. ఆ మరునాడు ఒక వీధిలో హాహాకారాలు చేస్తూ జనాలు మహాప్రవాహంలాగా పరుగెత్తుకు పోతుండటం మిత్రుల కంటపడింది. ఎవరో ఒకరిని ఆపి, ఏం జరిగిందని ఆరాతీశారు.“అయ్యా! మా రాజుగారికి ఒక్కతే కుమార్తె. ఆమె పాముకాటుకు గురైందట. వైద్యులు బతకదని చెబుతున్నారు” అని చెప్పాడతను.
(వచ్చేవారం.. ప్రణయ కలాపం)
-అనుసృజన: నేతి సూర్యనారాయణ శర్మ