శివాలయం పాడుబడిపోయింది. గుడి అంతా పావురాలకు, బిచ్చగాళ్ల విశ్రాంతికి నెలవయింది. లోపలి నేలంతా గచ్చు ఊడిపోయి, మట్టి బయటపడిన చోటల్లా.. రావి మొక్కలు మొలుచుకు వచ్చాయి. గుడి తలుపులు వేసి ఉన్నా.. పందికొక్కుల స్వైరవిహారంతో ఆ గది నుంచి ఈ గదికి, ఈ గదినుంచి ఆ గదికి కన్నాలు చేసి మరీ కాపురం ఉంటున్నాయి.
చుట్టుకుపోయిన జుట్టుతో, గడ్డం పెరిగిపోయి, తైలసంస్కారంలేక మట్టి కొట్టుకుపోయినట్లున్న అవతారంతో, మోకాలు దాటిన మురికి పంచెతో, స్నానమే మరిచిపోయిన ఒంటితో.. అక్కడున్న వాటన్నిటినీ దాటుకుని వెళ్లాడు రాజయ్య. ఎంతో ఓపికతో ఒక మూలన తుడుచుకుని కూర్చుని.. అడుక్కోగా వచ్చిన అన్నాన్ని, రొట్టెముక్కలను తెరిచాడు. వాటిని తినాలని అతను ఎంత ఆత్రంగా ఉన్నాడో.. అంతకంటే ఆత్రంగా పావురాలు, వీధికుక్కలు, కాకులు అన్నీ అతణ్ని చుట్టు ముట్టాయి. అయినా సరే, మరింత ఓపిక తెచ్చుకుని
‘హుయ్!’ అంటూ రొట్టెను ముక్కలు చేసి, కుక్కల వైపు వేశాడు దూరంగా.. అంతలో మునెమ్మ రానే వచ్చింది.
“రాజయ్యా! తింటున్నావా? తిను. ఈరోజు చాలామంది దయతలిచినట్లు ఉన్నారే!?” అంటూ.. ఆ పక్కనే ఉన్న చెత్తను కాలితో తోసి, పక్కనే కూర్చుంది. అవునన్నట్లు తలూపి, ఒక బోసినవ్వు నవ్వి.. నీళ్లు తాగుతూ తింటున్నాడు రాజయ్య. కడుపు నిండా తిన్న తర్వాత.. మిగిలిన రొట్టెముక్కల్ని మళ్లీ అదే కాగితంలో చుట్టి, కవర్లో ఉంచి.. వెనుకగా పెట్టుకుని కూర్చున్నాడు ధైర్యంగా! ఇక రాత్రికి కూడా ఢోకా లేదన్నట్లు.. చేతులు కడుక్కొచ్చి మునెమ్మ పక్కనే కూర్చుని.
“ఆ.. ఆ తిన్నాలే! నాకేంటి? తిరపతమ్మ రోజూ ముద్ద పెడుతుందిగా! ఇప్పుడే నేను తిని పార్వతమ్మకు పెట్టి.. మెల్లగా తింటుంది కదాని వచ్చినా!” అని చెప్పింది. “కిట్టయ్య బాగున్నాడా?”.. భుజంపై వేసుకునే తుండుతో అక్కడున్న చెత్తను చెల్లాచెదురు చేసి, దానినే ఉండచుట్టి పడుకుంటూ అడిగాడు రాజయ్య. “వాడికేం! కూలి చేసుకుంటాడు. ఆ వచ్చిన డబ్బులన్నీ సగం తాగుడుకూ, సగం ఆ ముండకూ తగలపెట్టి బువ్వకు మాత్రం గూటికి చేరుకుంటాడు. ఆడు అట్టుంటే నేనెట్లా బాగుంటాను?” అన్నది విసుగ్గా. ఆ మాటలన్నీ తనకు మామూలే అన్నట్లు నవ్వి.. “మగోళ్లు అంతే మునెమ్మా! ఆడకూతురివి.. నువ్వే సర్దుకుపోవాల!” అన్నాడు రాజయ్య నెమ్మదిగా. “ఇప్పుడు అదేగదా చేసేది. ఆడు సావడు.. నన్ను సంపడు. ఇగో రాజయ్యా.. నాకు గనక పార్వతమ్మ లేకుంటే ఎన్నడో సచ్చేదాన్ని” అన్నది కోపంగా! “బతకడానికి దేవుడు ఏదో ఒక ఆశ చూపుతాడు లేమ్మా! నన్ను చూడు.. నాకేమున్నదని బతుకుతున్నా? నాకోసం ఎవరూ లేరు.
ఎందుకు బతుకుతున్నా? ఏదో ఒకనాటికి ఆ శివయ్య కరుణించకపోతాడా? నా ఒక్కగానొక్క కొడుకు శివయ్య నన్ను వెతుక్కుంటూ రాక పోతాడా!? అని ఆశ అంతే!” అన్నాడు కళ్లకు అడ్డం పడిన నీటిని తుండుతో తుడుచుకుంటూ.. “అవును రాజయ్యా! ఆలయం పాడుబడ్డదికదా!? లోన శివుడు ఉంటాడా!?”.. ఆ మాట వినగానే ఫెళ్లున నవ్వాడు రాజయ్య.. “అట్టా నవ్వుతావేంది?”. “నవ్వక ఏం చెయ్యమంటావు మునెమ్మా! ఈ మేడలు, ఆస్తులు, డబ్బు అన్నీ మనుషులకే కానీ.. ఆ పరమాత్మునికి కాదుకదా?” అన్నాడు వేదాంతిలా! “మరి నీకు ఆ పరమాత్మునిపై అంత నమ్మకం ఉందికదా! మరి నీకు ఈ బిచ్చమెత్తుకునే రాత ఇచ్చాడు కదా? నీకు కోపం లేదా?”. “ఎట్లోగట్లా.. ఎవరో ఒక అమ్మ అన్నం పెడుతున్నది. నా కడుపు నిండుతున్నది. ఈ గుడి కట్టంగానే ఆ నాయుడమ్మ సచ్చిపోయిందని ఆపేశారు. మళ్లా రాజారెడ్డి పనులు మొదలు పెట్టగానే.. ఆయన కూడా సచ్చిపోయిండని ఇట్లే వదిలేశారు. ఈ గుడిలో ఆళ్లిద్దరూ తిరుగుతున్నరని ఊరంతా పుకారు లేవదీశారు. ఇక పదేళ్లసంది ఈ గుడి ఇట్లే ఉన్నది. కాకుంటే.. నాలాంటి దిక్కులేని బిచ్చపోళ్లకు, పక్షులకు, కుక్కలకు
“అవును రాజన్నా! అందరంటారు కదా! ఈ గుడిలో దెయ్యాలు ఉన్నాయని.. రాత్రివేళ చప్పుడు చేస్తాయని. నీకెప్పుడైనా కనిపించాయా? లోన చప్పుడు వినిపించిందా?”. “బయటి మనసు లేని మనుషుల కన్నా ఈ దెయ్యాలే మంచివి అనుకుంటే ఏ దిగులూ ఉండదు. ఒకేల సంపిందనుకో.. సస్త! బతికుండి ఏమి చేయాల?” అన్నాడు నవ్వుతూ.
“నాకైతే ఏ దెయ్యమూ కనిపించలేదు. ఇక గుడిలోన పందికొక్కులు మస్తుగా ఉన్నయి. ఆటి పరుగుల్లో శబ్దాలైతే వినిపిస్తాయి. ఇందులో కుక్కలున్నాయి. పిల్లులు, బల్లులు, పాములు కూడా ఉన్నయి. అయితే పానం మీద ఆశ ఉన్నోనికి భయం. నాకేమిటికి మునెమ్మా! ఆ సామి ఎప్పుడు పిలిస్తే అప్పుడే పోతా!”. “రాజయ్యా! దేవుడు నిజంగా ఉన్నాడా?” అడిగింది అమాయకంగా.
“ఉన్నాడంటే ఉన్నాడు. లేడంటే లేడు అంతే!” అన్నాడు రాజయ్య. “అట్టకాదులే రాజయ్యా! నువ్వన్నట్లు దేవుడనేవాడుంటే తన ఇంటిని తానే ఇట్టా పాడుచేసుకుంటాడా? పదేళ్లనుంచి ఇలా పాడుపడిపోయిన గుడిని బాగుచేసుకోకుండా ఉంటాడా? అని!” పెద్దగా ఆరా తీస్తున్నట్లు అన్నది మునెమ్మ. “అంతమాట అనకు మునెమ్మా! ఈ గుడి బాగుచేస్తే నాలాటోళ్లకు చోటు దొరుకుద్దా? మొన్నటికి మొన్న పడిన గాలివానకు మేం ఇంకా ఉన్నామంటే ఆ దేవుని దయే కదా? నాలాంటోళ్లకు, ఈ పక్షులకు, ఈ జంతువులకు ఆసరా ఉంటదా? ఆ సామి తలుచుకుంటే ఈ గుడి ఏంది? లోకాన్నే బాగుచేస్తాడు. ఏదో మాబోటోళ్లకు ఆసరా అని ఇట్టా వదిలేసినాడేమో!?” అన్నాడు
ఆ మాటలకు ఇంకేం సమాధానం ఇవ్వలేక మునెమ్మ బయటికి కదిలింది.. “పార్వతమ్మ ఏం చేస్తున్నదో!? మళ్లీ కలుస్తాలే!” అంటూ.. * * * రాజయ్య, మునెమ్మ పరిచయం విచిత్రంగా కుదిరింది. ఏ ఊరునుంచి వచ్చాడో.. ఒకరోజు తన ఇంటి ముందు కళ్లు తిరిగి పడిపోవడం చూసింది మునెమ్మ. వెంటనే ఆమెతోపాటు మరికొందరు ఆడవాళ్లు అతని ముఖంపై నీళ్లు చల్లి లేపారు. లేచిన తర్వాత అతను అన్న మొదటి మాట.. ‘ఆకలి’! అప్పుడే మునెమ్మ పనిచేసేచోట అన్నం, పప్పు తెచ్చుకున్నది. వెంటనే ఆ అన్నాన్ని ఒక ఆకులో పెట్టింది. దాంతో మునెమ్మ అంటే ఎంతో ఆత్మీయత ఏర్పడింది రాజయ్యకు. ఆ తర్వాతే రాజయ్య జీవితం
రాజయ్యకు పెళ్లయి కొడుకు శివయ్య పుట్టగానే భార్య చనిపోవడం.. అప్పటినుంచి రెండో పెళ్లి చేసుకోకుండా పిల్లవాణ్ని రెక్కలు ముక్కలు చేసుకొని చదివించడం, పెద్దయ్యాక అందరు పిల్లల్లానే శివయ్య పనికోసం దూర ప్రాంతానికి వెళ్లిపోవడం, తండ్రిని తీసుకెళ్దామంటే కోడలు వద్దనడం, ఆమె మాటను కొడుకు తు.చ. తప్పకుండా పాటించడం, దాంతో రాజయ్య దిక్కులేనివాడు కావడం.. ఈ విషయాలన్నీ తెలుసుకున్న మునెమ్మకు ‘పాపం!’ అనిపించింది. అప్పట్నుంచి ఉన్నదాంట్లో ఏం చేసుకున్నా తనకూ పెడుతూ.. రాజయ్యను ఓ ఆత్మీయుడిలా చూసుకుంటున్నది.
కష్టమైనా, సుఖమైనా, ఆనందమైనా.. తన జీవితంలో ఏం జరిగినా రాజయ్యకు చెప్పడం అలవాటుగా చేసుకున్నది. కాకుంటే ఈ దేళ్లలో రాజయ్య తోబుట్టువు కంటే ఎక్కువే అయ్యాడు. లోకం ఎన్ని అన్నా, తాగివచ్చి మొగుడు నానా మాటలు అన్నా.. పెద్దగా పట్టించుకునేది కాదు. ఏ జన్మలో బంధమో అనుకునేది. పేదవాడైనా వేదాంతిలా రాజయ్య చెప్పే విషయాలు మునెమ్మను ఎంతో ఆలోచింపజేసేవి. గుడినే అంటిపెట్టుకుని జీవిస్తున్న రాజయ్య.. ఆమె కంటికి ఒక బాబాలా కనిపించేవాడు.
“మునెమ్మక్కా.. మునెమ్మక్కా!” అనే అరుపు వినేసరికి ఒక్క ఉదుటున లేచింది. ఎదురుగా రామును చూసి.. “ఏమైందిరా!?” అని అడిగింది. “నీకు ఈ విషయం తెలుసా అక్కా? మరి ఆ గుడిని పడగొట్టేస్తారంట.. అదేదో ఆపీసోళ్లు శివాలయాన్ని పడగొట్టి మల్లా కడతారని అంటున్నారు. కొందరేమో.. ‘లేదు గుడి కట్టరు! అపార్ట్మెంట్ లేపుతారంట!?’ అంటున్నారు” అని చెప్పాడు ఆయాసపడుతూ.
ఆమాట వినగానే తన ఇంటినే ఎవరో కొట్టేస్తున్నట్లుగా గుండెను పిండినట్లయింది మునెమ్మకు.. ‘అదేంటిది? ఇందాక నేనన్న మాటలు ఆ దేవుని చెవిలో పడినయా ఏంది? మరి ఈ గుడిని పడగొడితే రాజయ్య ఏమైతడు?’ అనుకుంటూ ఒక్క పరుగున గుడికి చేరుకుంది మునెమ్మ. నిద్రపోతున్న రాజయ్యను లేపి.. “ఓ రాజయ్యా! నేను పాపిష్టిదాన్ని! ఇందాక నేను అన్న మాటలు ఆ దేవుడు ఇన్నడో ఏమో కానీ.. రేపు ఉదయమే ఈ గుడిని ఎవరో ఆపీసోళ్లు పడగొడతారంట. మల్లా కడతారంట!?” అన్నది ఏడుస్తూనే! ఆ మాటలకు ఒకింత కంగారుపడ్డ రాజయ్య..
“ఊరుకో మునెమ్మా! ఇప్పుడేమైందని? ఏది జరిగినా ఆ సామి సంకల్పమే కదా? మనమెంత? ఆయనకు తెలవదా? ఈడ ఎంతమంది ఆసరాగా ఉన్నమో అని.. రేపు గుడి కళకళలాడుతూ తయారైందనుకుందాం. నేను ఏడికి పోతా? బయటనే కుర్చుంటా! ఏడికి పోకుండ ఈడ్నే బిచ్చం ఎత్తుకుంటా. ఇక పావురాలు గుడిలోనే ఉంటాయి. జంతువులంటావా? ఆటికీ ఎక్కడో ఒకతాన జాగ ఆ సామి చూపుతాడులే! దానికోసం అంత దిగులు పడమాకు. అంతా ఆ సామి లీల!” అన్నాడు ఆకాశానికేసి చూసి.. దండం పెడుతూ!
“ఏమో రాజయ్యా! నాకైతే చాన బాధగా ఉంది” అన్నది కళ్లు తుడుచుకుంటూ.. అందుకూ.. రాజయ్య నుంచి చిరునవ్వే సమాధానంగా వచ్చింది.
ఇక ఆపై ఏమీ మాట్లాడలేక, మునెమ్మ అక్కణ్నుంచి వెళ్లిపోతూ.. వెనక్కి తిరిగి చూస్తూ దేవునికి నమస్కరిస్తూ.. ‘సామీ! అన్నీ తెలిసినోడివి. నువ్వే వీళ్లందర్నీ కాపుగాయాల’ అనుకుంటూ వెళ్లిపోయింది. తెల్లవార్లూ మునెమ్మకు నిద్రలేదు. ‘రాజయ్యంటే మనిషి. ఎక్కడికైనా పోయి తల దాచుకుంటాడు. ఆ పక్షులు, జంతువులు ఏం గావాల? పాపం! నాదగ్గర డబ్బుంటే.. నేనే ఒక గుడి కట్టించి వాటన్నింటినీ అందులోనే ఉంచేదాన్ని గదా?’ అనుకుంది. తెల్లవారి సరిగ్గా పదిగంటలకల్లా బుల్డోజర్లతో గుడిని కూలకొట్టేందుకు అధికారులు వచ్చారు. అక్కడున్న ముష్టివాళ్లందర్నీ వెళ్లగొట్టారు. కుక్కల్ని, పిల్లుల్ని తరిమేశారు. గర్భగుడి తలుపు బలవంతంగా తెరిచారు.
ఎదురుగా శివలింగం. ఆ అధికారులతో వచ్చిన ఓ బ్రాహ్మణుడు.. ఆ లింగాన్ని శాస్త్రోక్తంగా తీయడానికి ముందుకు కదిలాడు. అయితే, గర్భగుడి గచ్చుకింద పందికొక్కులన్నీ రంధ్రాలు చేశాయేమో.. నేలపై కాలు పెట్టగానే కసక్ కసక్ మంటూ దిగిపోవడం ప్రారంభించింది. దుమ్ము కొట్టుకుపోయిన శివలింగాన్ని ఒక దుప్పటిలో చుట్టాడు బ్రాహ్మణుడు. అక్కడున్న పూజాసామగ్రిని, పారల్ని, కొన్ని అవసరమైన సామగ్రిని తీసుకుని బయటికి తీసుకువచ్చాడు. ఇక అక్కడేం అవసరమైనవి లేవని గుర్తించాక.. బుల్డోజర్లతో గుడిని కూల్చేశారు. కొన్ని గోడల్ని మాత్రం సుత్తితో కొట్టడం మొదలుపెట్టారు.
ఆ చప్పుడుకు వందల సంఖ్యలో పావురాలు, పక్షులు అన్నీ ఎగిరి పారిపోతున్నాయి. ఎలుకలు, పందికొక్కులు పరుగు ప్రారంభించాయి. ఇంకా ఎవరూ గమనించని క్రిములు, సాలీళ్లు అన్నీ నామరూపాలు లేకుండా పోయాయి. రాజయ్య, తనతోపాటు ఉన్న మరికొందరు ముష్టివాళ్లంతా ఎదురుగా ఉన్న ఒక బస్స్టాప్లో కూర్చున్నారు. అందరికీ మనసులో తెలియని బాధే! అందరి మదిలో ‘ఇక ఎక్కడుండాలి?’ అనే ప్రశ్నే! ఒక్కొక్కరూ ఒక్కో దిక్కుకు వెళ్లడానికి ప్రయత్నించకుండా తిండికి వేట ప్రారంభించారు.
అనుకున్న తీరులో రెండు రోజుల్లో గుడినంతా నేలకూల్చారు. ‘కట్టడానికైతే కాలం పడుతుంది కానీ.. కూల్చడానికి కాలమెందుకు?’ అనుకుని నవ్వుకున్నాడు రాజయ్య! దాదాపు ఆరునెలల కాలంలోనే.. ఆ ప్రాంగణంలోనే దివ్యమైన మందిరం కొలువుదీరింది. రాజయ్య అనుచరులు అందరూ బస్స్టాప్లలోనూ, ఒక్కోచోట ఉండటానికి అలవాటు పడ్డారు. ఎవరికి వారు ఒక్కోదిక్కుకు చేరిపోయారు. కడుపు నింపుకొనేందుకు ఒక్కొక్కరూ ఒక్కో ప్రదేశాన్ని, ప్రాంతాన్ని ఎంచుకున్నారు. రాజయ్య మాత్రం అదే వీధిలో ఉంటూ.. ఆ గుడి ముందే ఉన్న బస్స్టాప్లోనే ఉండిపోయాడు. పగలంతా అడుక్కున్నా రాత్రయ్యేసరికి అక్కడే నిద్రపోవడం అలవాటుగా మార్చుకున్నాడు.
“గుడి ఇప్పుడు భలేగా ఉందిరా!” అన్నాడు ఒక ఆసామి మరొక ఆసామితో. “అవునురా! ఒకప్పుడు ఈ వైపు చూస్తేనే భయం వేసేది. ఆ కట్టినవాళ్లు ఇద్దరూ చనిపోవడంతో.. గుడిని అలానే వదిలేశారు. పోనీలే.. ఇప్పటికైనా ఒక ప్రయత్నం చేశారు!” అన్నాడు మరో ఆసామి. అది విన్న రాజయ్యకు కూడా నిజమే అనిపించింది. శివలింగ ప్రతిష్ఠాపన చేశారు. శాస్త్రోక్తంగా పూజలు జరిపారు. అన్నదానం చేశారు. ఆ దానంలో రాజయ్య కూడా తిన్నాడు.. అక్కడే ఒక కొత్త బోరింగు.
నిత్యం నీళ్లు వచ్చేలా కుళాయిలు. ఒక్కటేమిటి? ఆ గుడి స్వరూపమే మారిపోయింది. రాజయ్య కడుపునిండా తిని.. ఒక్కసారి వెనక్కి తిరిగి.. ‘శివయ్యా! ఎంత అదృష్టవంతుడివయ్యా! నీకు కావాల్సినట్టు కట్టించుకున్నావు. అన్ని ఏర్పాట్లు చేసుకున్నావు. ఇంకేం? నీకు పూజలు, అభిషేకాలు ఒక్కటేమిటి? ఇక పండగలే పండగలు.. నేను మాత్రం నీ దగ్గరే ఉంటానయ్యా! నీ గుడి మెట్లమీదే అడుక్కుంటూ ఉంటాను. నిన్ను వదుల్తాననుకున్నావా? అది
“ఏది నిజం? ఏది అబద్ధం? ఏది ఎంతవరకు మన సొంతం? ఏ నిమిషంలో ఏం జరుగుతుందో ఎవరికి ఎరుక” అని పైకి అన్నాడు నవ్వుతూ.. ఆ మాటలు విన్న ఇద్దరు వ్యక్తులు.. “ఈ ముసలాడికి తలదాచుకునేందుకు చోటు పోయేసరికి దెబ్బకు వేదాంతం వస్తంది!” అనుకుంటూ నవ్వుకున్నారు. అంతలో ఏమైందో ఏమో.. ఎదురుగా ఉన్న గుడిలో కుడివైపు ఉన్న గోడ కూలిపోవడం.. అక్కడి జనాలు, గుడి పూజారులతో సహా హాహాకారాలతో బయటికి పరుగులు తీయడం క్షణాల్లో జరిగిపోయింది. కళ్లముందే అలా జరగడంతో రాజయ్య ఆశ్చర్యపోయాడు. కొందరు దెబ్బలతో హాస్పిటల్కు పరుగులు తీశారు. అప్పటిదాకా రాజయ్య మాటలు విన్న ఇద్దరూ.. లోపలికి వెళ్లి రాజయ్యను చూపెడుతూ ఏదో చెప్పారు. అంతే.. అక్కడివారంతా ‘స్వామీ!’ అంటూ రాజయ్యను వెంటపెట్టుకుని లోపలికి తీసుకువెళ్లారు.
రాజయ్యకు ఆశ్చర్యంగా ఉంది. ‘ఇదేంటి? వీళ్లంతా నన్ను స్వామి అంటారేమిటి?’ అనుకుంటూ.. అదేమాట వారిని అడిగాడు కూడా! “స్వామీ! మీరు ఇన్నాళ్లూ ఈ గుడిలోనే ఉన్నారు. కట్టినన్ని రోజులూ ఎదురుగా కూర్చుని.. అన్నీ గమనిస్తూనే ఉన్నారు. ఈరోజు మేం పెట్టిన భోజనం చేశారు. అలాగే ఏదో జరగబోతున్నదని మీరు అనడం వీరిద్దరూ వినడం.. వెంటనే గోడ కూలిపోవడం జరిగింది. మీరు అందరిలాంటి వారే అయితే.. అందరిలానే మరో నీడకోసం వెళ్లిపోయేవారు. కానీ, మీరు రాత్రంతా ఈ గుడి ఆవరణలోనే ఉన్నారు. ఉదయమైతే గుడి ముందే ఉంటున్నారు. మీరు మామూలు మనుషులు కారు. కారణ జన్ములు!” అంటూ ఒకరి తర్వాత ఒకరు రాజయ్యకు నమస్కరించారు.
కడుతూనే.. రాజయ్యకు అదే ఆవరణలో ఒక కుటీరం కట్టారు. రాజయ్యకు అంతా అయోమయంగా ఉంది. తనకేంటి ఇంత రాజభోగం అనేది అర్థం కావడంలేదు. ఎంత వారిద్దామనుకున్నా.. ఎవరూ వినే స్థితిలో లేరు.
ఇప్పుడు రాజయ్య కాస్తా.. రాజయ్య స్వామిగా మారిపోయాడు. ఉదయం నుంచి రాత్రి వరకూ భక్తుల ప్రశ్నల కోలాహలం. అతని దీవెన తీసుకుంటే జీవితాలన్నీ సుఖమయం అవుతాయని.. పురిటికందు నుంచి వృద్ధుల దాకా అందరూ తమతమ ఆవేదనలు చెప్పుకొంటూ.. అతని దీవెనలు తీసుకునేవారే! అతని చేతి స్పర్శ సర్వరోగ నివారిణి అని.. చిన్నా పెద్దా రోగుల దాకా అందరూ తనను తాకేందుకు త్వరపడేవారే! ఒకప్పుడు తినడానికి తిండిలేదు. నేడు తినలేనంత తిండి. పండ్లు, డబ్బులు ఒకటేమిటి? సర్వ సుఖాలు, సంపద రాజయ్య దగ్గరే!
‘రాజయ్యా!’ అంటూ రోజూ ఆత్మీయంగా వచ్చే మునెమ్మ కూడా క్యూలో నిల్చోవాల్సిందే! తెలియని ఆత్మీయతను పెంచుకున్న మునెమ్మ ఒంటరిదైంది. ప్రశాంతంగా మాట్లాడదామన్నా లోనికి రానీయరు. స్వామిని కలవాలంటే ఉదయం ఎనిమిది నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు. ఆ తర్వాత స్వామి నిద్రించేవేళ. మళ్లీ సాయంత్రం ఆరు నుంచి ఎనిమిది దాకా అనే సమయాన్ని కుదించారు. వద్దంటే నిద్ర. వద్దంటే తిండి. వద్దంటే గాలి, నీరు. అన్నీ అన్నీ.. ఇప్పుడు ఆప్యాయంగా ఏ జంతువూ దరికి రాదు. ఏ పక్షీ తనను పలకరించదు. స్నేహితులు లేరు. సన్నిహితులు అసలే లేరు.
ఏ కష్టం లేకుండా ఏడాది గడిచిపోయింది. ఒకరోజు రాత్రి పన్నెండైంది. రాజయ్యకు ఎంతో అసహనంగా ఉంది. ఒక పట్టాన నిద్ర రావడం లేదు. ఇదివరకే నయం.. అడుక్కుని తినేరోజుల్లోనే మంచినిద్ర పోయేవాడు. ఇప్పుడు తిండి ఎక్కువై నిద్ర రావడంలేదు. ఒక్కసారి ఆ శివుని కేసి చూశాడు. ‘ఎంత పని చేశావయ్యా? నీలాగే నన్ను కూడా కట్టి పడేశావా? ఒక్కసారి నిన్ను హేళన చేశానని.. నీ జీవితం ఇలా ఉంటుందని నాకు చూపావా? అయ్యా! నువ్వు దేవుడివి. పైగా శిలవి. నేను మనిషిని. డబ్బు, విలాసం నేనెప్పుడూ కోరుకోలేదు. కాసింత నీడ కోరుకున్నా.
ఏదో బతికినంత కాలం ఒక ముద్ద అన్నం కోరుకున్నా. నువ్వేమో ఏకంగా సుఖమంటే భయపడేలా చేస్తున్నావు. నాకెందుకయ్యా?’ అని అనుకుంటూండగానే.. తలుపు చప్పుడైంది. ‘ఎవరా!?’ అని దీపకాంతిలో చూశాడు. ‘ఎక్కడో చూసినట్లుందే!’ అనుకోగానే.. ఒక్కసారిగా ఆనందం కట్టలు తెంచుకున్నది. శివయ్య! నా శివయ్య! నా కొడుకు వచ్చాడు!’ అనుకుని మెల్లగా వెనుక తలుపుగుండా బయటికి వెళ్లాడు. తన కొడుకు, కోడలు, మనవలతో సహా! “నాన్నా! ఎలా ఉన్నారు?” అడిగాడు కొడుకు.
ఆ మాటకోసం ఎన్ని సంవత్సరాలు ఎదురు చూశాడో? ఎన్ని క్షణాలు ఉబికి వచ్చే కన్నీటిని గుండెల్లో దాచుకున్నాడో ఎవరికీ తెలియదు. మనవల్ని ఆప్యాయంగా తడిమాడు. “రండి!” అని పిలుస్తూ.. ఒక వారగా అందర్నీ చాపపై కూర్చోపెట్టాడు రాజయ్య! “మీరెలా ఉన్నావురా?” అంటూ.. దగ్గరగా ఉన్న పండ్లను చిన్నారులకు అందించాడు.“మాకేం నాన్నా! హాయిగా ఉన్నాం. నేను నీ కోడలు హేమ కలిసి నెలకు రెండులక్షలకు పైగా సంపాదిస్తున్నాం. కొత్త ఇల్లు కొన్నాం. పిల్లలు చదువుకుంటున్నారు. నిన్ను రోజూ హేమ తలుస్తూ ఉంటుంది నాన్నా! నిజం! తను ఇప్పుడు పూర్తిగా మారిపోయింది.
ఎప్పుడూ.. ‘మావయ్యగారు ఎక్కడున్నారో! ఏంటో!?’ అనని రోజు లేదనుకో! అందుకే ఇలా ఈ రోజు. మళ్లీ ఉదయమైతే నీ హడావుడిలో మాట్లాడటం కుదరుతుందో లేదో అని ఇప్పుడు వచ్చాం. నీ గురించి పేపర్లో చాలా చదివాం. నువ్వు స్వామిగా మారడం నాకు చాలా సంతోషం అనిపించింది. సరే! మీ ఉనికి మీరు బాగానే పెంచుకున్నారు. ఈరోజు ఇలా ఉన్నారు. కానీ రేపు చూడండి.. పెద్దపెద్ద మంత్రులు కూడా మీ ఆశీస్సుల కోసం వస్తారు. అప్పుడు నాకు ఇంకా గర్వంగా ఉంటుంది. అందుకని..” అంటూ ఆగిపోయాడు.
“మీరు కూడా మాతోపాటు ఢిల్లీ వచ్చేస్తే.. మీకు ఇక్కడున్నట్లే కుటీరానికేం ఖర్మ! ఏకంగా బిల్డింగే కట్టిస్తాను. దాంతో మీ విలువ ఇంకా పెరుగుతుంది. ఇప్పటికన్నా ఆదాయం బావుంటుంది. నాకున్న డబ్బుకు మీ పరపతి తోడైందనుకో.. నాకు నేను ఎప్పట్నుంచో కలలు కన్న రాజకీయ జీవితం వస్తుంది. పిల్లల విలువ పెరుగుతుంది. మీకు తెలియనిదేముంది? ఇది పోటీ ప్రపంచం కదా? ఎవరైనా పైకి రావడం ముఖ్యం కానీ,
కొడుకు మాటలతో రాజయ్య మనసు ముక్కలైంది.
‘నా అంతట నేను ఈ స్థితిని కలిగించుకోలేదురా!’ అని చెబుదామనుకున్నా.. మాట బయటికి రాలేదు.
“మీరు వెళ్లండి! నేను రేపు సమాధానం చెబుతాను” అని వారిని బయటికి పంపి.. గడియ పెట్టేసుకున్నాడు.
ఒక్కసారిగా వెక్కివెక్కి ఏడ్చాడు రాజయ్య! తన ఆవేదనంతా కన్నీటితో కడిగేసుకున్నాడు.
‘వద్దంటే ఈ జీవితాన్ని నాకు అందించి.. నీ పక్కనే ఉంచుకున్నావు కదయ్యా! ఏనాటికైనా నన్ను తన వెంట తీసుకెళ్తాడనుకున్న నా కొడుకు ఇక ఎప్పటికీ మారడనీ, వాడికోసం ఇంకా ఆవేదన పడొద్దనీ ఈ రకంగా తెలియజేశావు. ఏమాత్రం మనస్సాక్షి లేని కొడుకును నాకిచ్చావు కదయ్యా! నేనిక ఎవరికోసం బతకాలి? ఎందుకు బతకాలి? ఈ జీవితం ఇలాగే చాలిస్తే మేలేమో!’ అనుకుంటూ శివయ్యను వేడుకున్నాడు.
ఉదయం అయ్యేసరికి రాజయ్య చనిపోయాడనే వార్త ఊరంతా పాకింది. గుడి వీధంతా జనం నిండిపోయారు.
“స్వామీ! మమ్మల్ని వదిలి వెళ్లిపోయావా?” అని వలవలా ఏడ్చారు కొందరు. “స్వామి సమాధిలోకి వెళ్లిపోయాడు. ఆత్మ మాత్రం అక్కడే ఉంటుంది!” అని తేల్చి చెప్పారు మరికొందరు. ఏడాదిన్నర క్రితం రోడ్డుమీద అడుక్కుని బతికిన రాజయ్య.. నేడు రాజయ్య స్వామిగా మారి, అందరినీ కంట తడి పెట్టిస్తున్నాడు. విధి ఎంత విడ్డూరమైనది? మునెమ్మ మాత్రం ఏకధాటిగా రోదిస్తూనే ఉంది. మునెమ్మతోపాటు కిట్టయ్య కూడా ఏడవటం విశేషం కాలం ఎవరికోసం ఆగదు.
ఆ స్థానంలో రాజయ్య రాతి విగ్రహం వెలిసింది. ‘శివుని గుడికి రాజయ్య కాపలాగా ఉండేవాడట!?’ అనే కథలు ప్రచారంలోకి వచ్చేశాయి. ఏవైనా తీరని కోరికలు ఉంటే.. రాజయ్య శిలకు మొక్కితే తీరిపోతాయని నమ్మకం ప్రజల్లో ఏర్పడింది. అప్పుడు రాజయ్యను. ఇప్పుడు ఆ శిలను మొక్కడమైతే మానలేదు ప్రజలు. రానురానూ ఈ గుడికి ప్రచారం ఎక్కువైంది. ఆ గుడి ఎంతో మహిమ కలిగిందని నమ్మి.. విదేశాలనుంచీ జనాలు రావడం పెరిగింది. ఒక గొప్ప క్షేత్రంగా నిలిచిపోయింది ఆ గుడి.