‘నమస్తే తెలంగాణ, ముల్కనూరు ప్రజాగ్రంథాలయం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2022’లో రూ.3 వేల బహుమతి పొందిన కథ.
ఖరీదైన ఆడీ కారు ఆ పల్లెటూరి గతుకుల రోడ్లపై ప్రసవవేదన పడుతున్నది. సిటీ రోడ్లపై తిరగడం అలవాటున్న డ్రైవర్.. యజమానితో తిట్లు తినకుండా బండి నడిపేందుకు నానా అవస్థ పడుతున్నాడు. ఆ ఖరీదైన కారులో కూర్చున్నది చలపతి.
ఒకప్పుడు ఓ యాభై ఎకరాల మోతుబరి రైతు కొడుకు. ఇప్పుడు కోట్లకు పడగలెత్తిన చలపతి సంస్థల అధిపతి. చదువు అయ్యిందనిపించాక సొంతూరికి సుదూరంలో ఉన్న నగరానికి ఉపాధి వెతుక్కుంటూ వెళ్లాడు. కొన్నాళ్లు ఉద్యోగం చేశాక.. తనే ఓ సంస్థను ఏర్పాటుచేశాడు. కాలం కలిసొచ్చింది. అతని వ్యాపార సామ్రాజ్యం విస్తరించింది.
అప్పుడప్పుడూ సొంతూరికి వస్తుంటాడు. ఊరిపై అభిమానం కాదు. ఊరిలో తన దర్జా, దర్పం ప్రదర్శనకు. పేదలంటే అతనికి చిన్నచూపు. బడుగు జనం అంటే అయిష్టం. ఊర్లో మూడో వంతుమంది చలపతి ఈడువారే. కానీ, వారిని పలకరించడం నామోషీ అతనికి. ఉవ్వెత్తున ఎగసిపడే అల ఎప్పటికీ ఒడ్డుకు చేరనట్టే.. వారి జీవితాలు కూడా అంతే అని అతని అభిప్రాయం. కాలం కలిసొచ్చి కోటీశ్వరుడైనా, అదంతా తన స్వశక్తి, తెలివితేటలవల్లే అంటాడు.
కారు ఊరి జంక్షన్కు సమీపంలోకి వచ్చింది. రోడ్డుకు అటూఇటూ బడ్డీల్లో బతుకు పోరాటం చేసే వృత్తి, వ్యాపారులు. వారిని చూస్తూ మీసంపై చెయ్యేసి నవ్వుకుంటున్నాడు చలపతి. తాను ఆకాశంలో ఉంటే వారు పాతాళంలో ఉన్నారన్న అహం. అతని ముఖంలో హఠాత్తుగా నవ్వు మాయమయ్యింది. ఓ బడ్డీ (దుకాణం)లో టేబుల్ ముందు నిల్చుని తదేక ధ్యాసతో దుస్తులు కట్ చేస్తున్నాడు దర్జీ సూరీడు. బక్కచిక్కిన శరీరం. దానిపై చిరుగుల బనీను. మెడలో టేపు, కళ్లకు అద్దాలు, చెవిలో మార్కింగ్ పెన్సిల్.. ప్రపంచంతో సంబంధం లేదన్నట్టు పనిలో నిమగ్నమై ఉన్నాడతను. అతణ్ని చూడగానే కారులో అసహనంగా కదిలాడు. వెంటనే తల తిప్పేశాడు.
సూరీడు కొట్టిన దెబ్బకు క్లాత్ కటింగ్ టేబుల్ ‘దడ్’ అంటూ శబ్దం చేసింది. అక్కడివారు ఉలిక్కిపడ్డారు. టేబుల్కు కుడివైపున మూడు మిషన్లలో చివరి దానిపై కూర్చున్న నాగేశు ఆశ్చర్యంగా నోరెళ్లబెట్టి చూస్తున్నాడు. అతను కొత్తగా పనిలో చేరాడు. మిగిలిన ఇద్దరూ.. ‘అది షరామామూలే!’ అన్నట్టు తలకూడా ఎత్తలేదు.
కాసేపు తలవంచి కళ్లు మూసుకున్నాడు సూరీడు. కళ్లద్దాలు సరిచేసుకున్నాడు. కొలతల పుస్తకం వైపు చూస్తూ టేబుల్పై ఉన్న క్లాత్మీద మార్కింగ్ చేస్తున్నాడు. ప్రశాంతంగా ఉండాలన్న అతని ప్రయత్నం ఫలించడం లేదు. అతని ముఖం కందగడ్డలా ఉంది.
“ఏటయ్యిందన్నా.. ఆ చలపతి గురించేనా!? వాడు ఊర్లోకి వచ్చినప్పుడల్లా ఎందుకన్నా అలా అయిపోతావు” ప్రశ్నించాడు ముందు మిషన్పై కూర్చున్న నూకాలు. వాడు సూరీడుకు చిన్నాయన కొడుకు. పదేళ్లుగా అక్కడ పనిచేస్తున్నాడు.
నూకాలు వైపు కోపంగా చూశాడు సూరీడు.
“కోపగించుకోకన్నా! ఈ వయసులో బీపీ పెంచుకోవడం దేనికి. అది ఆడి అదృష్టం. ఇది మన దరిద్రం. రగిలిపోతే మాత్రం ఆడి అదృష్టం మనకొస్తుందా!? మన దరిద్రం ఆడికి పడుతుందా!?” వేదాంత ధోరణిలో చెప్పాడు నూకాలు.
“నోర్ముయ్యిరా! అదృష్టమా.. వంకాయా!? ఆడికి డబ్బుంది, వ్యాపారం చేసి అంతకు వెయ్యిరెట్లు పోగేసుకున్నాడు. మనకు కానీకి టికానా లేదు. అందుకే ఇలా మిగిలాం. ఇందులో అదృష్టమేటుందిరా” మరోసారి దమ్ములాగి అన్నాడు.
“అలా తీసేయకన్నా. ఆడూ నువ్వూ కలిసే చదివారా!? ఆడు కార్ల తిరుగుతున్నాడు. నువ్వేమో కుట్టుమిషన్ తిప్పుకొంటున్నావు. ఇది అదృష్టం కాదా?”.
“అదీ నిజమేరా! మనుషుల్లోనే అనుకుంటాం.. ఆ దేవుడు కూడా పక్షపాతే! ఆడికంటే తెలివైనవాణ్ని. చలపతిగోడికి పుస్తకమంటే తెలీదు. రెండో ఎక్కాం చెప్పలేక పోయేవోడు. ఆడికి అందలం ఇచ్చి, ఎప్పుడూ ఫస్టొచ్చే నాకీ బతుకిచ్చాడంటే.. దేవుడు పక్షపాతి కాకపోతే మరేటిరా” అసహనంగా అన్నాడు సూరీడు.
“తెలిసీ ఎందుకన్నా ఉడుక్కుంటావు. దానివల్ల ఊష్టం (జ్వరం) తప్ప ఏటొస్తాది చెప్పు. ఇప్పుడేటయినాదీ.. నీ కొడుకు సదువుతున్నాడు. ఆడిలా కాకపోతాడా.. అప్పుడు నువ్వు మీసం మెలెయ్యవా సెప్పు!?”.. సూరీడుకు ఆగ్రహం వచ్చినప్పుడు ఆ మాట చెప్పి శాంతపరుస్తుంటాడు నూకాలు.
“ఉడుక్కోవడం కాదురా.. బాధ. నువ్వు చిన్నోడివి. ఆడి గురించి తెలీదు. నా చదువుతోపాటు ఆడి చదువూ నేనే చదివానంటే నమ్ముతావా!?”.
“అదెలాగన్నా.. ఇద్దరి సదువు నువ్వొక్కడివీ?”.
“అంటే.. నా ఉద్దేశం రెండు క్లాసులని కాదురా. ఆడెప్పుడో స్కూలుకు వచ్చేవాడు. వచ్చినా పాఠం విన్నదీ లేదు, నోట్సు రాసిందీ లేదు. నాకు చదవాలని ఉండేది. అమ్మానాయనా పనిలోకి పొమ్మనేవారు. వారి మాట కాదని బలవంతంగా బడికెళ్లేవాణ్ని. మాకు కడుపునిండా తిండిపెట్టడానికే అగచాట్లు పడుతున్న అమ్మానాయనా చదివించగలరా? నా దరిద్రం ఆడికి వరమయ్యిందిరా. నోట్సులు రాయడంతోపాటు ఆడి చదువు పనులన్నీ నేనే చేసేవాణ్ని. బదులుగా నాకు పుస్తకాలు కొనిచ్చేవాడు, ఫీజులు కట్టేవాడు.
ఆడి అమ్మానాయన కూడా.. ‘ఓరేయ్ సూరీ.. చలపతికి సాయం చేయిరా! నీ సంగతి మేం చూసుకుంటాం’ అనేవారు. ఆడివల్లే నేను పదోక్లాసు వాడినయ్యాను. నాది అవసరం.. వాడిది అవకాశం. పది తర్వాత నా అవసరం వాడికి లేకుండా పోయింది. నా సదువూ ఆగిపోయింది. నా బతుకు ఈ కటింగ్ టేబుల్కు అంకితమైపోయింది”..
గుండెల్లో దుఃఖం ఒక్కసారిగా బయట పడుతుంటే చెమ్మగిల్లిన కళ్లను జేబురుమాలుతో ఒత్తుకున్నాడు సూరీడు.
“అదేటన్నా.. చేసిన సాయం ఆడి అమ్మానాయనకైనా గుర్తులేదా?”.
“అంతేరా! గుర్రం పరిగెత్తగలిగితేనే యజమాని గుగ్గిళ్లు పెట్టేది. ఇదీ అంతే. తర్వాత కథ మరోలా నడిచింది”.
“అదెలాగన్నా!?”.
“పదో తరగతిలో నేను ఫస్ట్క్లాస్లో పాసైతే.. నా పేపర్లు కాపీ కొట్టి ఆడు సెకండ్ క్లాస్లో పాసయ్యాడు. అందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ ఆడి నాయనే చేశాడు. ఆడి మేనమామ పట్నంలో ఉన్నాడు. అక్కడ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ చదివాడు. తర్వాత ఇంజినీరింగ్ కాలేజీలోనూ చదువు‘కొన్నాడు’. ఆ తర్వాత వ్యాపార దార్లు వెతుక్కుంటూ ఇదిగో ఈ రోజు మనముందు ఇలా ఖరీదైన కార్లలో తిరుగుతున్నాడు” సూరీడు ఆవేదనగా నూకాలు వైపు చూశాడు.
“పోనీలే అన్నా! ఆడిగోల మనకెందుకు. కలిసి చదివినా.. ఏనాడైనా నీ బడ్డీ ముందు కారాపి ‘ఏరా సూరీ! బాగున్నావా’ అని పలకరించాడా? ఇంటికి పిలిచి ఓ పూట భోజనం పెట్టాడా! ఆడికి అంత గోరోజనమైతే నీకేటన్నా”.. నూకాలు మాటలతో సూరీడు కూల్ అయిపోయాడు.
“నిజమేలే. ఏరు దాటాక తెప్ప, ఊరు దాటాక గతం మర్చిపోకుండా ఉన్నాడంటే.. వాడు గొప్ప గుణవంతుడై ఉండాలి” అంటూ పనిలో నిమగ్నమైపోయాడు.
ఊరి సామాజిక భవనం కోలాహలంగా ఉంది. సివిల్స్లో ఉత్తమ ర్యాంకు సాధించి ఐఏఎస్ అధికారిగా ఎంపికైన సూరీడు కొడుకు కోటేశు సత్కార సభ అది. కొడుకు ఇంజినీర్ అయితే చాలనుకున్న సూరీడుకి.. ఏకంగా కలెక్టర్ అయ్యాడన్న నిజం ఒక్కచోట నిలువనీయడం లేదు. పదో తరగతిలో మంచిర్యాంకు సాధించడంతో కార్పొరేట్ కళాశాల పిలిచి ఉచిత సీటు ఇచ్చింది. అక్కడివరకూ ఏ ఇబ్బందీ లేకున్నా.. ముంబయి ఐఐటీలో సీటు వచ్చిన సందర్భంలో ఎదురైన ఇబ్బందులు సూరీడుకి గుర్తొచ్చాయి.
“అయ్యా.. ఐదు రోజులనాడు బయల్దేరాలి. గుర్తుంది కదా!?” కోటేశు నెమ్మదిగా అన్నాడు.
“ఆ ప్రయత్నంలోనే ఉన్నానురా. ఏదో చేస్తాలే. నువ్వేటీ బెంగపెట్టుకోకు. నా చేతిలో పని, నా వంట్లో రక్తం ఉండగా నీ చదువుకి ఢోకా ఉండదు. నువ్వు బాగా సదువుకోరా అయ్యా”.. కొడుకు భుజం తడుతూ చెప్పాడు సూరీడు.
మేకపోతు గాంభీర్యం ప్రదర్శించినా డబ్బు వ్యాపకం ఎంత కష్టమో తెలిసివచ్చింది. అప్పటికే తలకుమించి అప్పులు చేశాడు. తనకున్న ఆస్తి అంతా ఆ మూడు మిషన్లు, కటింగ్ టేబుల్, బడ్డీకొట్టు మాత్రమే. అప్పటివరకూ వందలు.. ఇప్పుడు వేలు కావాలి. ఎవరిస్తారు!? ఎవరిని అడిగినా లేవన్నమాటే. నమ్ముకున్నవారంతా ఎడారిలో ఒయాసిస్సుల్లా దగ్గరికి వెళ్లేకొద్దీ దూరమయ్యారు. మూడురోజుల్లో సూరీడుకి విషయం అర్థమయ్యింది. డబ్బు సమకూర్చుకోవడం తనవల్ల కాదన్న బెంగ మొదలయ్యింది. కొడుకు భవిష్యత్తు తల్చుకుని కన్నీళ్లుపెట్టుకున్నాడు. ప్రయాణానికి ముందురోజు రాత్రి కొడుకును పిలిచి విషయం చెప్పాడు.
“నాయినా.. నన్ను క్షమించురా! పేదరికం మనకు శాపం. దానివల్లే నా జీవితం నాశనం అయ్యింది. ఇప్పుడు నీ జీవితం. కూటికి గతిలేని మనలాంటి వారికి పెద్దపెద్ద ఆశలు ఉండకూడదు. నీ చదువు కొనసాగే మార్గం కనిపించడం లేదు. ఇక దాని గురించి మర్చిపో. ఇక్కడే ఏదో కాలేజీలో చేరు. లేకపోతే మన దుకాణానికి వచ్చేయి. ఈ తండ్రి కడుపున పుట్టడమే నువ్వు చేసిన పాపం” అంటూ భోరుమన్నాడు.
తండ్రి మాటలతో హతాశుడయ్యాడు కోటేశు. ఊహలు తలకిందులు కావడంతో కన్నీటి పర్యంతమయ్యాడు. తండ్రి చెప్పిందీ వాస్తవమే! ఆయన మాత్రం ఏం చేయగలడు. పేదవాడిగా పుట్టడమే తన ఖర్మ. ఇక తన జీవితం ఇంతే.. అనుకుంటూ మంచం మీదికి చేరాడు. ప్రయాణ ఏర్పాట్లలో భాగంగా సర్దిపెట్టిన సూట్కేస్ వెక్కిరిస్తున్నట్టు కనిపించింది. ఏడుస్తూ ఎప్పుడు నిద్రలోకి జారుకున్నాడో కోటేశుకి తెలీదు.
ఉదయాన్నే తండ్రి లేపడంతో తెలివి వచ్చింది.
“ఏంటయ్యా!?” దిగులు మనసులోనే దాచుకుంటూ అడిగాడు.
“చూడురా అయ్యా! ఎవరో మనిషి వచ్చి ఈ కవరిచ్చి వెళ్లాడు. మనూరి వాడిలా లేడు. ఎప్పుడూ చూళ్లేదు. బ్యాంకు లోను కిస్తీ కట్టాల్సి ఉంది. ఆ తాఖీదు ఏమో” అన్నాడు.
‘సూరీ.. నీ కొడుకు చదువు ఆగిపోతుందని దిగులు పడకు. అతని చదువుకు నేను సాయం చేస్తాను. ప్రయాణానికి సిద్ధం చెయ్యి. రైల్వేస్టేషన్లో మా మనిషి మిమ్మల్ని కలుస్తాడు. ఇప్పటికి అవసరమైన డబ్బు అందిస్తాడు. ఆ తర్వాత కాలేజీ అకౌంట్కే అవసరమైన డబ్బు జమ చేస్తాను. నేను ఎవరు? ఎక్కడివాణ్ని? అన్న వివరాలు మా మనిషిని అడగవద్దు. ప్రస్తుతానికి నీకు కావాల్సింది నీ కొడుకు చదువు. నీకొడుకు ఉద్యోగస్తుడయ్యే వరకు ఎంత సాయమైనా నేను చేస్తాను. నువ్వేమీ దిగులుపడకు’.. ఒక్కో అక్షరం చదువుతుంటే, తండ్రీ కొడుకులిద్దరి కళ్లనుంచి ఆనందబాష్పాలు రాలాయి.
‘దైవం మానుష రూపేణా’.. అంటారు. ఎవరో ధర్మాత్ముని కరుణ లభించిందనుకున్నారు. చెప్పినట్లే రైల్వే స్టేషన్కు ఓ మనిషి వచ్చి డబ్బుతో ఉన్న కవరు ఇచ్చి వెళ్లిపోయాడు. ఆ తర్వాత కొడుకు ఏ కళాశాలలో చదివితే ఆ కళాశాలకు అవసరమైన డబ్బు జమయ్యేది. ఐఐటీ, పై చదువులు, సివిల్స్ కోచింగ్.. ఇలా అన్నిటికీ ఆయనే దాత. ఆ వ్యక్తి ఎవరో, ఎందుకు సాయం చేశాడో తెలియదు. తన ఊరివాడో.. పొరుగూరి వాడో అర్థం కాలేదు. చేసిన ప్రయత్నాలన్నీ వృథా అయ్యాయి. కొడుకును అడిగినా తెలియదన్నాడు.
ఇప్పుడు కొడుకు కలెక్టరై వచ్చాడు. ఈ సంతోష సమయంలోనైనా దాత ఎవరో తెలిస్తే కృతజ్ఞత పూర్వకంగా తన తలను ఆయన పాదాలపై ఉంచాలనుకున్నాడు. వేదికపై సూరీడు దంపతులు, కోటేశుతోపాటు స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ, ఊరిపెద్ద, చలపతి తండ్రి సుందరయ్య, జిల్లా కలెక్టర్, ఎస్పీ ఆసీనులయ్యారు. వేదిక దిగువన చలపతి దంపతులు, వారిద్దరి కుమార్తెలు, పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు, గ్రామస్థులు కూర్చుని ఉన్నారు.
ఓ సాధారణ దర్జీ కొడుకు సివిల్స్లో ఉత్తమర్యాంకు సాధించి.. ఐఏఎస్కు ఎంపిక కావడంపై వక్తలంతా పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఆ సందర్భంలోనూ తనకు సాయం చేసిన వ్యక్తికోసం సూరీడి కళ్లు వెతుకుతున్నాయి. ఆయన కాళ్లుకడిగి ఆ నీళ్లు తన నెత్తిన వేసుకోవాలన్న తపన. వచ్చినప్పటి నుంచి సూరీడినే గమనిస్తున్నాడు చలపతి. సూరీడు ఎవరికోసమో ఎదురు చూస్తున్నాడని అనుకున్నాడు. పక్కనే కూతుళ్ల వైపు చూస్తూ భవిష్యత్తు ప్రణాళికలు మనసులోనే రాసుకుంటున్నాడు. వేదికపై నుంచే కొడుకు హావభావాలు గమనిస్తున్నాడు సుందరయ్య. ఒకప్పుడు సూరీడుని చలపతి అవమానించిన తీరు అతనికి జ్ఞాపకం వచ్చింది.
కొడుక్కు ఐఐటీలో సీటు రావడం, డబ్బుకోసం చేసిన అన్ని ప్రయత్నాలు విఫలం కావడతో.. ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో చలపతి ఊర్లోకి వచ్చాడని సూరీడుకి తెలిసింది. ఏనాడూ చలపతిని సాయం అడగలేదు. అవసరం చెబితే తప్పకుండా ఆదుకుంటాడని.. కలిసి అవసరం చెప్పాడు. చలపతి వెటకారంగా నవ్వగానే సూరీడు మనసు చివుక్కుమంది.
“చూడొరే సూరీ.. సదువుకున్నప్పుడు ఏదో సాయం చేశావు. నేనూ నీకు సాయం చేశాను. లెక్క సరిపోయింది. మళ్లీ ఇప్పుడు సాయం అడగడం ధర్మం కాదు. బెల్లం అన్నాక ఈగలు వాలుతాయి. పరపతి, పైసలున్నోడన్నాక సాయం అడుగుతారు. ఊరికే సాయం చేసుకుంటూ పోతే చివరికి ఏమవుద్దో తెలియనంత అమాయకుడినా. నా గడప తొక్కావు. నోరిడిచి అడిగావు. ఈ వెయ్యి రూపాయిలుంచు. చేతి ఖర్చుల కొస్తాది. పెద్దపెద్ద ఆలోచనలు చేయకు. నీ స్థాయికి తగినట్టు ఆలోచించు!”.. ముఖం మీద కొట్టినట్టు చెప్పడంతో సూరీడు మనసు విలవిల్లాడిపోయింది.
చలపతి సంగతి తెలిసీ సాయం అడిగినందుకు తనను తానే నిందించుకున్నాడు. దూరం నుంచి వారి మాటలు వింటున్నాడు సుందరయ్య. సూరీడుని కొడుకు అవమానించడం అతనికి నచ్చలేదు. కోపంతో కొడుకు వద్దకు వచ్చాడు.
“ఒరేయ్ చలపతి.. మనిషి ఎప్పుడూ భూమ్మీద నిలబడాలి. కాలం కలిసొచ్చి అందలం దక్కొచ్చు. అంతమాత్రాన కిందివారిని చులకన చేస్తే రేపు తేడా అయితే?” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
“అది కాదు నాన్నా! తాహతుకు మించి వాడికి ఆలోచనలెందుకు! అందుకే వాడి స్థాయిని వాడికి తెలియజేశాను. తప్పేముంది”.. చలపతి విసురుగా సమాధానం ఇచ్చాడు.
“ఓ విషయం గుర్తు పెట్టుకో.. మనిషి స్థాయిని నిర్ణయించేది డబ్బు, పరపతి కాదు. వ్యక్తిత్వం. కారు మబ్బులన్నీ వర్షాన్ని ఇవ్వవు. డబ్బున్న వారంతా గౌరవాన్ని పొందలేరు. కమ్ముకున్న కారుమబ్బులు క్షణాల్లో చెదిరిపోతాయి. డబ్బు, దర్పం కూడా అంతే! వ్యక్తిత్వమే శాశ్వతం”.. తండ్రి ఆగ్రహాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాడు చలపతి.
“ఏ తండ్రయినా కొడుకు ఉన్నత స్థానంలో ఉండాలని కోరుకుంటాడు. ఆ రోజు నేను.. ఈరోజు వాడు. నీ చదువుకోసం నేను అడ్డదారులు తొక్కాను. సూరీడు కష్టాన్ని నమ్ముకున్నాడు. తేడా అర్థం కావడం లేదా?!. నా డబ్బు, పరపతి నిన్నీరోజు ఇలా నిలబెట్టాయి. వాడికి స్తోమత లేక అలా మిగిలిపోయాడు. అంతమాత్రాన నువ్వు గొప్పోడివి అనుకోకు. చేతనైతే సాయం చెయ్యాలి. లేదంటే ‘నావల్ల కాదు!’ అని చెప్పాలి. అవమానించడం మర్యాదస్తుల లక్షణం కాదు. వాడు సాయం కోసం వచ్చాడు తప్ప యాచించడానికి కాదు. అందుకే నువ్విచ్చిన డబ్బు నీ ముఖానే కొట్టి వెళ్లిపోయాడు” కోపంగా అన్నాడు సుందరయ్య.
చలపతిలో పశ్చాత్తాపం మొదలయ్యింది.
“భగవంతుడు మనకు ఆస్తిపాస్తులిచ్చాడు. ఒక్కగానొక్క కొడుకువని నీకోసం దేనికైనా నేను సిద్ధపడ్డాను. నా డబ్బు, పరపతి పెట్టుబడి పెట్టి నీ శ్రమతో ఓ సామ్రాజ్యాన్ని ఏర్పర్చుకున్నావు. కానీ మంచిపేరు సంపాదించుకోలేక పోయావు. అదేరా నా బాధ. కోట్లు కూడబెట్టావు. ప్రముఖుల జాబితాలో చేరావు. కానీ నువ్వంటే ప్రేమగా, అభిమానంతో పలకరించేవారు ఊరిలో ఒక్కరైనా ఉన్నారా? ఊరి కోసం ఒక్క మంచిపనైనా చేశావా? ఆలోచించు”.
“అదేం కాదు.. చనువిస్తే సాయం అడుగుతారనే నేను అలగా జనాన్ని దగ్గరకు రానీయను”.
“నీ ఆలోచనే తప్పురా. వారు అలగా జనం కాదు. వారు మోస్తేనే మన పెద్దరికం నిలబడుతుంది. వారు ఛీ కొడితే మనం పాతాళానికి పడిపోతాం. ముఖంపై నవ్వు పులుముకుని ముఖస్తుతితో మాట్లాడేవారు అవకాశవాదులు.. ఆప్తులు కాదు. వారికి మనపై ప్రేమాభిమానాలు ఉన్నాయనుకోకు. అంతా నా సాయం కోసం ఎదురుచూస్తున్నారన్న నీ ఆలోచనే హీనం. ఎంత సంపాదించినా, ఏ స్థాయిలో ఉన్నా పదిమంది ఆప్తులు లేని మనిషి ఊర్లో ఉన్నా, శ్మశానంలో ఉన్నా ఒక్కటే. ఈ మాట ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకో. ఇప్పటికైనా తీరు మార్చుకో. అదే నిన్ను కాపాడుతుంది” అనునయంగా చెప్పి వెళ్లిపోయాడు సుందరయ్య.
సభలో చప్పట్లు మోగడంతో సుందరయ్య గతం నుంచి బయటికి వచ్చాడు.
“ఇప్పుడు మన గ్రామపెద్ద సుందరయ్య గారు మాట్లాడుతారు” అని నిర్వాహకులు ప్రకటించగానే లేచి మైకు ముందుకు వెళ్లాడు సుందరయ్య.
“ఈ అభినందన సభకు విచ్చేసిన పెద్దలకు, అతిథులకు, ఊరి ప్రజలకు నా శుభాభినందనలు. గ్రామపెద్దగా ఈరోజు నాకు సుదినం. మన సూరీడు కొడుకు కలెక్టర్ అయ్యాడంటే నా మనసు ఉప్పొంగిపోతున్నది. పేదరికంలో కొట్టుమిట్టాడుతున్నా, కొడుకు చదువుకోసం తన రెక్కలు ముక్కలు చేసుకున్న సూరీడు దంపతులను, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రయోజకుడైన మన కోటేశును మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను”.. అనగానే సభలో చప్పట్లు మారుమోగాయి.
“సూరీడు నన్ను కలిసినప్పుడల్లా ఓ మాట చెబుతుండేవాడు. ‘ఇదంతా నా గొప్పకాదయ్యా! కనిపించని ఆ దేవుడి గొప్ప. ఆ దేవుడే లేకుంటే ఈ రోజు నా కొడుకుని ఇలా చూసుకోలేకపోయేవాణ్ని. ఆయన ఎవరో తెలిస్తే తన పాదాలమీదపడి నా కృతజ్ఞత చాటుకోవాలని ఉంది’ అనేవాడు. నిజమే.. సూరీడు కొడుక్కి సాయం చేసిన ఆ వ్యక్తి మనుషుల్లో దేవుడు. అన్నిటికంటే మించింది విద్యాదానం. పేదరికంతో ఓ తెలివైన విద్యార్థి చదువుకు దూరమైతే దేశం ఓ మేధావిని కోల్పోతుంది.
ఒక విద్యావంతుడు ఊరిని బాగు చేయగలడు. వ్యవస్థను సరిదిద్దగలడు. పది మందికీ ఆదర్శంగా నిలిచి మార్పు తేగలడు. డబ్బు సాయం చేస్తే అవతలి వ్యక్తి కష్టాలు తాత్కాలికంగా తీరవచ్చు. కానీ ఓ విద్యార్థి చదువుకు సాయపడితే వ్యవస్థకే సాయం చేసినట్టు. పేదరికం కారణంగా సూరీడు కొడుకు చదువుకు దూరమవుతాడని తెలిసిన క్షణం ఆపన్న హస్తం అందించిన ఆ అజ్ఞాత వ్యక్తికి సూరీడే కాదు.. ఈ గ్రామమే రుణపడి ఉంది.
సూరీడు కొడుకును ఆదర్శంగా తీసుకుని రేపు ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి మరింత మంది కలెక్టర్లు, ఎస్పీలు, ఇంజినీర్లు, డాక్టర్లు అవుతారన్న నమ్మకం నాకుంది. ఆ వ్యక్తి ఇక్కడ ఉంటే ఓ సారి మన ముందుకు రావాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను” అంటూ ప్రసంగం ముగించారు సుందరయ్య.చప్పట్లు చరుస్తూనే వేదికపై ఉన్నవారితోపాటు సభా ప్రాంగణంలో ఉన్న వారంతా.. ‘ఆ మనుషుల్లో దేవుడు లేచి వస్తాడేమో!’ అని అటూ ఇటూ చూస్తున్నారు.
సుందరయ్య చిరునవ్వుతో తన కుర్చీవైపు నడుస్తూ వేదిక దిగువన చప్పట్లు కొడుతున్న కొడుకు చలపతివైపు, వేదికపై ఉన్న సూరీడు వైపు మార్చి మార్చి చూస్తున్నాడు. చేసిన సాయం చెప్పుకోకూడదంటారు. ఆ సందర్భంలో తనను తానే అభినందించుకోవాల్సి రావడం సుందరయ్యకు సిగ్గుగా అనిపించింది. కానీ అది అవసరం. తన మాటలు కొడుకు చలపతిలాంటి వారిలో మార్పుతేవొచ్చు. మరి కొందరికి స్ఫూర్తిగా నిలవచ్చు. ఎందరో భావిభారత పౌరుల భవిష్యత్తుకు ఆసరా కావచ్చు.. తనకు తాను సర్దిచెప్పుకున్నాడు సుందరయ్య.
బత్తుల వెంకట రమణమూర్తి
‘సాహిత్యం మేలుకొలుపు లాంటిది. కథ ఏ ఒక్కరిలోనైనా మార్పునకు కారణమైతే.. ఆ కథకుడి ప్రయత్నం ఫలించినట్టే’ అని నమ్ముతారు రచయిత బత్తుల వెంకట రమణమూర్తి. విశాఖపట్నం నగరంలోని మధురవాడ ఈయన స్వస్థలం. డెస్క్ జర్నలిస్టుగా సుదీర్ఘకాలంపాటు సేవలందించి.. అనంతరం ఉపాధ్యాయుడిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. రచనలపై ఆసక్తితో కథకుడిగా మారారు.
2016లో నవ్యలో ప్రచురితమైన ‘గోమాలచ్చిమి’ కథతో ఈయన రచనా వ్యాసంగం ఆరంభమైంది. నమస్తే తెలంగాణ – ముల్కనూరు ప్రజాగ్రంథాలయం నిర్వహించిన కథల పోటీల్లో హ్యాట్రిక్ బహుమతులు అందుకున్నారు. ఇప్పటివరకు నలభై ఐదు కథలు రాశారు. వీటిలో ఇరవై ఏడు కథలు బహుమతులకు ఎంపికయ్యాయి. వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. ఆలోచింపజేసే కథలు రాయాలని, రాశి తక్కువే అయినా గురజాడలా వాసికెక్కే కథ ఒక్కటైనా రాయాలన్నది తన అభిమతం అని రచయిత చెబుతున్నారు.
బత్తుల వెంకట రమణమూర్తి
98489 87239