Jaya Senapati katha | జరిగిన కథ : పృథ్వీశ్వరుని తలను ఒక్కవేటుతో తెగనరికాడు గణపతిదేవుడు. అదే సమయంలో.. పినచోడుడు పరుగున వెళ్లి జాయపను హత్తుకున్నాడు. అది చూసిన గణపతిదేవుడికి వారి బంధుత్వం స్పష్టమైంది. మరోవైపు తెగిపడ్డ పృథ్వీశ్వరుని తలతో కందుక క్రీడలాడారు కాకతీయ యుద్ధవీరులు. ఇంకోవైపున.. ఆ మరుభూమిలో కత్తిగాట్లతో.. రక్తసిక్తమైన దేహాలతో నిండిన శవాలపై ఎగిరి నర్తించాడు జాయప. ఆ రుద్రదేవుడే పూనినట్లు.. యుద్ధభూమే నాట్యరంగమైనట్లు ఆనందతాండవం చేశాడు
వెలనాడు రాజ్యమంతటా యుద్ధ విజయ సంబరాలు జరుగుతున్నా.. రాజధాని దనదప్రోలులోని రాజప్రాసాదం మాత్రం ఉత్తేజంగా లేదు. చక్రవర్తి వల్ల కొంత గంభీరంగా ఉంది.
పిష్టపుర యుద్ధవిజయం.. కాకతీయ రాజ్యంలోనే కాక, అన్ని సామంత రాజ్యాల్లోనూ పండుగ శోభను తెచ్చింది. చక్రవర్తిగా గణపతిదేవుని పాలనలో కాకతీయ సామ్రాజ్యపు సామంత రాజ్యాలన్నీ, ఎంతో ప్రశాంతంగా అబ్బురపరచే అభివృద్ధికి నోచుకుంటున్నాయి.
నిజానికి పిష్టపుర ప్రజలు కూడా పృథ్వీశ్వరుని మరణానికి సంతోషించారని చారులు తెచ్చిన వార్త. ఈ విశ్లేషణ ప్రముఖులందరిలో మధురిమ చేకూరుస్తుండగా.. చక్రవర్తి మాత్రం విజయ మందహాసాల మధ్య కొండొక విచార వీచికలతో సతమతం అవుతున్నట్లు నిరంతరం స్థిరగంభీరంగా కనిపిస్తున్నాడు. కారణం.. ఆయనకు పినచోడుడు, జాయపుడు మహోపకారం చేస్తే, ఆ కుటుంబానికి అపకారం చేసినట్లు ఆయన భావించడం! ఏడేళ్లుగా పిల్లలను తల్లిదండ్రులకు దూరం చేశాడు. వాళ్లు ఆ బాధను నిశ్శబ్దంగా పళ్లబిగువున భరించారు.
‘జాయపుడు! వాడు.. ఆ కుర్రవాడు. ద్వీపరాజ్య వారసుడు. క్షత్రియ పుత్రుడు..
అంత చిన్నవయసులో బంగారు ఊయలలో పుట్టి, వీధి ఎలా ఉంటుందో తెలియని రాజనగరులో పెరిగినవాడు. ఒక్కరోజు కాదు.. ఒక్క ఏడాది కాదు.. ఏడేళ్లు అనుమకొండ వీధులలో బతికాడట. ఎవరు ఏది
పెడితే.. అదే తిన్నాడట. మూగగా ఏడ్చాడట. మురికి బట్టలతో ముడుచుకు పడుకున్నాడట.
ఎంత ప్రతిభావంతుడు. అటు నాట్యం.. ఇటు యుద్ధం! రెండిటిలోనూ సమాన ప్రావీణ్యం.. ఆ వీధులలోనే తిరుగుతూ సంపాదించాడంటే.. వాడు సామాన్యుడు కాదు. ఎక్కడా తన ధర్మాన్ని తప్పలేదు. నాట్యం తన ముందు ప్రదర్శించాడు. యుద్ధం తనతో కలిసి చేశాడు. తనను కాపాడాడు. శత్రువు తలను నరకడానికి ఎంత యుద్ధ వైశారద్యం చూపాడు.. ఎంతో నిశితమైన తెలివితేటలు లేకుంటే ఆ దృశ్యంముందే రూపొందించడం, నిర్వహించడం మామూలు యుద్ధవీరులకు సాధ్యంకాదు. అది జాయపుని అత్యద్భుత ప్రతిభకు దర్పణం.
దానిని తన చేతులతో పూర్తిచేయడం.. ఓహ్!
ఎంత అబ్బురంగా ఉంది!’..
ఆయన ఆలోచనలు ఇలా సాగిపోతున్నాయి.
అనుమకొండలో సంబరాలు.. దనదప్రోలులో సంబరాలు.. పాకనాడులో సంబరాలు.. కమ్మనాడులో సంబరాలు.. కొండపటమటి రాజ్యంలో, చాగి రాజ్యంలో, ధరణికోటలో సంబరాలు.. చివరికి ఓడిన పిష్టపురంలోనూ సంబరాలు..
అవన్నీ గణపతిదేవుణ్ని సంతోష పరచలేక పోతున్నాయి. సామ్రాజ్యం నలుమూలల నుంచి వస్తున్న విజయ సంబరాల వార్తలు వింటున్నాడు.. కేవలం తల పంకిస్తున్నాడు. అంతే! మరేమీ మాట్లాడటంలేదు. అదే గతంలో ఇలాంటి వార్తలు వింటే.. ఎగిరి గంతులు వేసేంత అల్పసంతోషి గణపతిదేవుడు.
యుద్ధ వార్తలు, చక్రవర్తి అనారోగ్యం విన్నవెంటనే రుద్రసేనాని, గంగాధరుడు కొందరు అధికారులతో
దనదప్రోలు వచ్చేశారు. పట్టమహిషి సోమలదేవి బాలింత కావడంతో రాలేకపోయింది. శ్రీవారిని
అభినందిస్తూ లేఖ రాసి పంపింది. పినచోడుడు కాస్త చొరవ తీసుకున్నాడు.
“మహారాజా! తమరు ఇంత మహదానంద సంబరాల సమయంలో కూడా కొంత అన్యమస్తిష్కంగా కనిపిస్తున్నారు. మావైపు ఏదన్నా తప్పు జరిగి ఉంటే.. క్ష..”.. చెయ్యెత్తాడు.. ఆపమన్నట్లు చక్రవర్తి గణపతిదేవుడు.
“మా ముఖభావాలు అలా కనిపిస్తున్నాయా పినచోడా! అలా అయితే క్షమించండి. మేమే మీకు చేసిన ద్రోహం పట్ల ప్రాయశ్చిత్తం ఎట్లా చేసుకోవాలో తెలియక ఇన్నిరోజుల నుంచీ సతమతమవుతున్నాం..”
ఆయన స్థిరంగా అన్న వాక్యాలు అక్కడి వారి నందరినీ చకితులను చేశాయి.
“మనం చరిత్రాత్మకమైన విజయం సాధించాం. ఏడేళ్లనాడు వెలనాడును ద్వీపంతో సహా గెలిచి పినచోడునికి పాలనాపగ్గాలు అప్పగించాం. ఆయన పృథ్వీశ్వరునికి బంధువు అని తెలిశాక.. ఆయన విధేయతపై మాకు కొంత అపనమ్మకం కలిగింది. కానీ, ఈ మలి యుద్ధంలో ఎలాంటి సందేహానికి తావివ్వకుండా పినచోడుడు, ఆయన కుమారుడు జాయపుడు అసమాన ప్రతిభ చూపారు. కాహళి పూరించి యుద్ధ ప్రారంభం పినచోడుడు చేస్తే, పృథ్వీశ్వరుని శిరః కందుక క్రీడ ఆడే అదృష్టం.. జాయప మాకు కల్పించాడు. కానీ.. కానీ”.. అర్ధోక్తిలో ఆయన ఆగిపోయాడు.
చౌండ కదిలి ఏదో చెప్పబోయాడు. చెయ్యెత్తి వారించాడు చక్రవర్తి.
“మమ్మల్ని చెప్పనివ్వండి. ఇది చరిత్రలో ఏ సామంత రాజకుటుంబం చూపని విధేయత. కానీ కానీ.. మేము వారికి ద్రోహం చేశాం. ఆ తల్లిదండ్రుల నుంచి పిల్లలను విడదీశాం. వాళ్ల జీవితంలో విషాదాన్ని సృష్టించాం. కానీ వాళ్లు తమ అనితరసాధ్యమైన విధేయపాలనతో.. అప్రతిహత యుద్ధ విజయంతో.. మేము తల వంచుకునేలా చేశారు. మా తప్పును మేమే గుర్తించేలా చేశారు. మా తప్పు నిప్పుకణికలా మా గుండెలను మండిస్తున్నది. వారిని క్షమించమని క్షణకాలంలో అడగగలను. కానీ, వాళ్లది ఏడేళ్ల దుఖం. అది కేవలం క్షమించమనడంతో ఆరదు. మాకు తగిన శిక్ష పడాలి. మా తప్పునకు ప్రాయశ్చిత్తం జరగాలి. అందుకు పరిష్కారం చెప్పాల్సిందిగా పితృసమానులైన గురుదేవులను కోరుతున్నాం”..
ఆ దశలో కల్పించుకున్నాడు చౌండ సేనాని.
“నన్ను క్షమించండి మహారాజా! నన్ను ఆపొద్దు. చెప్పనివ్వండి. ఆ ఘోరం మీ మీద వేసుకుంటున్నారు గానీ, నిజానికి ఆ ఆడపిల్లలను మీ అనుజ్ఞ లేకుండా తెచ్చింది నేను. శిక్ష నాకు పడాలి. ‘గెలిచిన రాజులు సామంత రాజకుటుంబాల ఆడపిల్లలను వివాహాలు చేసుకున్నారు!’ అని చెప్పుకొంటారు. కానీ, అవి వివాహాలు కాదు. బంధించి ఉంచుకోవడమే! అసహాయ ఆడపిల్లలను ఉంచుకోవడం అంటే.. బయటికి చెప్పని శృంగార బంధం. ఉంపుడుగత్తెలతో సమానం! ఆ సామంత రాజు ఏమాత్రం తల ఎగరేసినా.. ఆ కూతుళ్ల బతుక్కు అది ఆఖరి రోజు. ఆ పరిస్థితి ఎవ్వరికీ కల్పించవద్దని తమరు సిద్ధాంతీకరణ చేసినా.. నేను ఆ తప్పుచేశాను. ఇప్పుడు మీరు ఈ మహోన్నత విజయోత్సవాన్ని ఆస్వాదించకుండా నివారించింది ఆనాడు నేను చేసిన ఆ తప్పే! ఆ అక్కల వెంట ముక్కుపచ్చలారని తమ్ముడు అమాయకంగా వెంటపడ్డాడు. అనుమకొండ వచ్చాడు. అక్కడ ఎన్నో బాధలుపడ్డాడు. ఇక్కడ ఈ తల్లితండ్రులు చెప్పుకోలేని మానసిక వేదన అనుభవించారు. అందుకు కారణం నేను! నన్ను ఇప్పుడే.. ఇక్కడే నరికివేయండి. అదే నాకు తగిన శిక్ష. ఈ సమస్యకు పరిష్కారం!”.. ఆవేశంగా అంటూ సర్రున ఒర నుంచి ఖడ్గాన్ని లాగి తన మెడపై ఉంచాడు చౌండ.
అందరూ దిగ్భ్రమతో తటాలున లేచి ఆయన దగ్గరికి పరుగున వెళ్లారు.
మహాప్రధాని గంగాధరుడు ఆ ఖడ్గాన్ని తీసి ఒరలో ఉంచి.. చౌండను తిరిగి ఆసనంపై కూర్చోబెట్టాడు. గంభీరమైన నిశ్శబ్దం రాజ్యమేలుతున్నది.
ఎందరు ఎన్నిచెప్పినా అన్ని తప్పులకూ, పినచోడునికి చేసిన అన్యాయానికి తనదే బాధ్యతగా గణపతి దేవుడు భావిస్తున్నాడు. దానితోనే కుమిలిపోతున్నాడు. ఇదంతా అందరూ గుర్తించారు. గణపతిదేవుని మనస్తత్వం సంపూర్ణంగా తెలిసిన ముగ్గురు.. రుద్ర
సేనాని, చౌండ సేనాని, మహాప్రధాని గంగాధరుడు. ఇప్పుడు ఇక్కడే ఉన్నారు. ముగ్గురూ కాకతీయ రాజ్యపు మహామహా సమస్యలను ప్రశాంతంగా పరిష్కరించిన వారే! ఈ సమస్యకు పరిష్కారం చెప్పాల్సిందిగా చక్రవర్తి కోరిన ఈ ముగ్గురి మధ్య కళ్లతో సంభాషణ
నడుస్తున్నది.
తల వంచుకున్న పినచోడుని కళ్లవెంట ధారాపాతంగా నీరు.. అతని తమ్ముళ్లు, కుమారుడు జాయప కూడా అతని దుఃఖంలో భాగమై, కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు నిశ్శబ్దంగా!
“మీ తప్పు మీరు గుర్తించారు మహారాజా!
ప్రాయశ్చిత్తం మీరూ, చౌండ సేనానుల వారూ అడుగుతున్నారు. కానీ, మా ఆడపిల్లల భవిష్యత్తు ఏమిటి మహారాజా?”..
ఖంగున మోగిన గొంతు.. బ్రహ్మయ నాయకుడిది. పినచోడుని తమ్ముడతను.
కటిక నిశ్శబ్దం. ఎవ్వరూ ఏమీ మాట్లాడలేని వాతావరణం. దానిని ఛేదిస్తూ ద్వారంవద్ద కొంచెం కదలిక.
అప్పుడే ఎవరో పవళించిన పట్టెమంచాన్ని నలుగురు అంతఃపుర పరిచారికలు మోసుకువచ్చారు. అందరి మధ్యలో ఉంచారు. పవ్వళించిన వారు బాయమ. పినచోడుని భార్య. జాయప, నారాంబ, పేరాంబల తల్లి!
పిల్లలపై దిగులుతో మంచంపట్టిన శుష్క శరీరురాలు. పత్రహరితం కోల్పోయిన పండుటాకు ముఖాన కుంకుమ పెట్టినట్లుంది. కారుతున్న కన్నీటిని కూడా తుడుచుకునే ఓపిక కూడా లేని ఆమె.. అలాగే చేతులెత్తి చక్రవర్తికి మొక్కింది.
ఆయన మరింత ముడుచుకుపోయాడు. కావడానికి చక్రవర్తి కావచ్చుకానీ, వయసు రీత్యా చిన్నవాడు కావడంతో స్పందన ఎక్కువగా ఉన్నవాడు గణపతిదేవుడు.
“నా కూతుళ్లను, నా కొడుకును ఇప్పుడైనా బంధ విముక్తులను చేయండి ప్రభూ!”.. అన్నదామె మెల్లగా.
కదిలిపోయాడు గణపతిదేవుడు. లేచాడు.. పినచోడుని దగ్గరికి నడిచాడు. అతణ్ని తీసుకుని ఆమె మంచం వరకు కొనిపోయాడు. వంగి మోకాళ్లపై కూర్చున్నాడు.
“మా తప్పులను క్షమించండి. మా కన్నీటితో మీ కాళ్లు”.. అంటూ మరేదో చెప్పబోతుండగా.. దగ్గరగా వచ్చి గణపతిదేవుడి మాట పూర్తి
కాకుండా ఆపి..
“మీరేమీ వాళ్ల కాళ్లు కడగవద్దు ప్రభూ! వాళ్లే పన్నీటితో మీ కాళ్లు కడిగి నెత్తిన చల్లుకుంటారు” అన్నాడు రుద్రసేనాని.
అంతా నిశ్శబ్దం.
“ఎలా..??”.
“మీరొక నిర్ణయం తీసుకుంటే!”.
“అదే! ఏమిటి?”.
“ఆ జంట పిల్లలను మీరు వివాహం చేసుకుంటే.. పినచోడుని కుటుంబమే మీ కాళ్లు కడుగుతారు. అది మా సలహా! నిర్ణయం మీదే. ఆలోచించి చెప్పండి”.
రుద్రసేనాని నిర్ణయం అక్కడ కాహళ ధ్వనులను సృష్టించింది. రెండులిప్తల కాలానికి తేరుకున్నాడు గణపతిదేవుడు. తర్వాత అందరూ.. రుద్రసేనాని ముఖంలోకి తీక్షణంగా చూశాడు గణపతిదేవుడు. అదే చూపు.. ఇరవై ఏళ్ల క్రితం దేవగిరి రాజప్రాసాదంలో జైతుగి సమక్షంలో.. ఆనాడు అక్కడున్నవారు రుద్రసేనాని, మహా ప్రధాని గంగాధరమంత్రి, మల్యాల చౌండ..
ఈ రోజూ ఇక్కడా వాళ్లే! అదే సన్నివేశం. అదే సమస్య.. ఇదే ప్రశ్న.. ఇప్పుడూ అదే పరిష్కారమా..??
ఆ పరిష్కారమే ఆరోజు కాకతీయ సామ్రాజ్యపు భవితకు పునాది అయ్యింది. మరి ఇప్పుడూ..??
గణపతిదేవుడు తలతిప్పి సకల సేనాధిపతి రుద్రయనూ, మహాప్రధాని గంగాధర మంత్రినీ, చౌండ సేనానినీ నిశితంగా చూశాడు. ముగ్గురూ క్షణకాలం ముఖముఖాలు చూసుకుని సంపూర్తిగా అంగీకరిస్తున్నట్లుగా వంగి తల ఊపారు. అప్పుడు మరోసారి స్థిరంగానూ, నిర్ణయాత్మకంగానూ అన్నాడు రుద్రసేనాని.
“నీ అభిప్రాయం చెప్పు నాయనా! గణపా!”..
కేవలం రుద్రసేనాని మాత్రమే గణపతిదేవుణ్ని ‘గణపా!’ అని తండ్రిలా, పెద్ద తండ్రిలా పిలుస్తాడు. కేవలం తండ్రిలా చెప్పాల్సిన తరుణంలో మాత్రమే ఆ పిలుపు శోభిస్తుంది. స్థిర నిర్ణయుడయ్యాడు గణపతిదేవుడు. లేచి నిలబడ్డాడు. లేవబోయినవారిని కంటి చూపుతో కూర్చోబెట్టాడు. మాట్లాడటం ప్రారంభించాడు.
(సశేషం)
– మత్తి భానుమూర్తి 99893 71284