Amir : పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మాజీ ఛైర్మన్ రమీజ్ రాజాపై మాజీ పేసర్ మొహమ్మద్ అమిర్ విరుచుకుపడ్డాడు. చేసిందేమి లేదు.. కానీ చాలా మాట్లాడావు అంటూ విమర్శించాడు. మ్యాచ్ ఫిక్సింగ్కు పాల్పడిన వాళ్లు మళ్లీ పాకిస్థాన్ జట్టుకు ఆడే అవకాశమే లేదు అంటూ ఈమధ్యే రమీజ్ రాజీ, అమిర్ను ఉద్దేశించి అన్నాడు. దాంతో, చిర్రెత్తుకొచ్చిన అమిర్ నువ్వు పీసీబీ అధ్యక్షుడిగా చేసిందేం లేదు. కానీ.. చాలా మాట్లాడావు. నువ్వు పాక్ క్రికెట్కు చేసిన నష్టాన్ని పూడ్చేందుకు, ప్రస్తుతం పీసీబీ ఛైర్మన్ నజం సేథీకు ఎక్కువ సమయం పడుతుంది అని అమిర్ వ్యాఖ్యానించాడు. 2010లో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొన్న అమిర్ జట్టులో చోటు కోల్పోయాడు. ఆ తర్వాత క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే.. అమిర్ మళ్లీ పునరాగమనం చేస్తాడనే వార్తలు వినిపిస్తున్నాయి.
పోయిన ఏడాది పాక్ జట్టు స్వదేశంలో ఇంగ్లండ్తో జరిగిన మూడు టెస్టుల సిరీస్లో దారుణంగా ఓడిపోయింది. దాంతో, పీసీబీ ఛైర్మన్ రమీజ్ రాజాపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. అతడిని మార్చాలంటూ మాజీలు సోషల్మీడియాలో పోస్టులు పెట్టారు. నజం సేథీ కొత్త ఛైర్మన్గా నియమితుడయ్యాడు. దాంతో, తనను దౌర్జన్యంగా తనను పదవిలోంచి తొలగిస్తున్నారని రమీజ్ అన్నాడు. ‘గతంలో ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా ఉన్నప్పుడు నజం సేథీని కూడా అన్యాయంగా పీసీబీ చీఫ్ పదవి నుంచి తప్పించారు. అయన మౌనంగా వెళ్లిపోయారు. కానీ, నీలా రాద్దాంతం చేయలేదు’ అంటూ అమిర్ రాజాను విమర్శించాడు. పదవి పోయిన అక్కసుతో కొత్త పీసీబీ ఛైర్మన్ను నిందిస్తున్న రమీజ్ తీరును మాజీ క్రికెటర్లు కూడా తప్పుపడుతున్నారు.