హైదరాబాద్, ఆట ప్రతినిధి: విజేతలకు తెలంగాణ క్రీడా అకాడమీలు వేదికలుగా మారాయని సాట్స్ చైర్మన్ ఆంజనేయగౌడ్ పేర్కొన్నారు. ఇటీవల హన్మకొండలో జరిగిన 67వ రాష్ట్ర స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడల్లో ఆర్ట్స్ కాలేజీ వెలోడ్రమ్ స్టేడియం రెజ్లర్లు ఆకాశ్(51కి), శివసంపత్(110కి), సతీశ్(65కి) స్వర్ణ పతకాలు సాధించారు. ఈ సందర్భంగా మంగళవారం సాట్స్ చైర్మన్ వీరిని ప్రత్యేకంగా అభినందించారు. ‘రాష్ట్ర ప్రభుత్వం గత దశాబ్ద కాలం నుంచి అన్ని రంగాలను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నది. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రానున్న రోజుల్లో క్రీడలకు, ప్లేయర్లకు మరిన్ని మెరుగైన అవకాశాలు లభిస్తాయి’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో సాట్స్ డీడీలు చంద్రారెడ్డి, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.