Ranji Trophy 2024 | రంజీ ట్రోఫీలో భాగంగా మూడు రోజులకే ముగిసిన తమిళనాడు – ముంబై సెమీస్ మ్యాచ్ ఓటమి.. తమిళ జట్టులో కలకలం రేపింది. టాస్ గెలవగానే తాము మ్యాచ్ ఓడిపోయామని తమిళనాడు హెడ్కోచ్ సులక్షణ కులకర్ణి ఘాటు వ్యాఖ్యలు చేశాడు. టాస్ నెగ్గాక తమిళ కెప్టెన్ సాయి కిషోర్ మొదట బ్యాటింగ్ తీసుకుని తప్పు చేశాడని, తమ జట్టు ఆటగాళ్లంతా మొదట ఫీల్డింగ్ చేయాలని మానసికంగా ఫిక్స్ అయినా సాయి మాత్రం అందుకు విరుద్ధంగా బ్యాటింగ్ ఎంచుకున్నాడని కులకర్ణి కామెంట్స్ చేశాడు. కులకర్ణి వ్యాఖ్యలపై తమిళనాడు సీనియర్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
ముంబైలోని శరద్ పవార్ క్రికెట్ అకాడమీ వేదికగా ముగిసిన ఈ మ్యాచ్లో తమిళనాడు తొలుత టాస్ నెగ్గినా మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి ఓవర్లోనే ఆ జట్టు ఓపెనర్ సాయి సుదర్శన్ వికెట్ను కోల్పోయింది. 42 పరుగులకే తమిళనాడు 5 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఇదే విషయమై మ్యాచ్ ముగిశాక కులకర్ణి మాట్లాడుతూ… ‘నేనెప్పుడూ ముక్కుసూటిగానే మాట్లాడతా. మేం రంజీ సెమీస్ మ్యాచ్ తొలి రోజు మొదటి గంటలోనే ఓడిపోయాం. వికెట్ను నేను పరిశీలించినప్పుడు అది పూర్తిగా బౌలింగ్కు అనుకూలంగా ఉంటుందని అనిపించింది. ముంబైలోని వాతావరణం పరిస్థితులు కూడా అందుకు అనుకూలంగా ఉన్నాయి…
టాస్ గెలిస్తే మొదట ఫీల్డింగ్ చేయాలని ఆటగాళ్లంతా ఫిక్స్ అయ్యారు. కానీ సాయికిషోర్ మాత్రం ఆశ్చర్యకరంగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తొలి ఓవర్లోనే తమిళనాడుకు ఆడే అంతర్జాతీయ ప్లేయర్ (సాయి సుదర్శన్) ఔట్ అయ్యాడంటే ఇక్కడి వికెట్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏదేమైనా కెప్టెనే బాస్. నేను కేవలం ఫీడ్బ్యాక్, ఇన్పుట్స్ మాత్రమే ఇవ్వగలను..’ అని వ్యాఖ్యానించాడు. ముంబైకే చెందిన కులకర్ణి.. ప్లేయర్గానే గాక కోచ్గా కూడా ముంబైకి రంజీ ట్రోఫీలు అందించినవారిలో ఉన్నాడు.
“We lost the match at 9’o clock on Day 1 itself says TN coach Sulakshan Kulkarni after losing Ranji semi-final.#RanjiTrophy2024 pic.twitter.com/ElmoTykPWI
— OneCricket (@OneCricketApp) March 5, 2024
కార్తీక్ ఆగ్రహం..
కులకర్ణి వ్యాఖ్యలపై సీనియర్ వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తీక్ స్పందించాడు. ట్విటర్ (ఎక్స్) వేదికగా అతడు స్పందిస్తూ… ‘కులకర్ణి వ్యాఖ్యలు నిరాశ కలిగించాయి. ఇది చాలా తప్పు. ఇలాంటి సమయాల్లో కెప్టెన్కు అండగా నిలవాల్సింది పోయి తప్పులను అతడి మీద నెట్టేయడం సరికాదు. సాయి నేతృత్వంలో తమిళనాడు ఏడేండ్ల తర్వాత రంజీ సెమీస్లోకి వచ్చింది. ఆ విషయాన్ని మరిచిపోకూడదు. దానిని పాజిటివ్ కోణంలో చూడాలి గానీ ఇలా కెప్టెన్ను బలిపశువును చేయడం సరికాదు…’ అని అన్నాడు.
This is soo WRONG
This is so disappointing from the coach ..instead of backing the captain who has brought the team to the semis after 7 yrs and thinking it’s a start for good things to happen, the coach has absolutely thrown his captain and team under the bus
👎🏽👎🏽👎🏽👎🏽👎🏽 https://t.co/Ii61X7Ajqs
— DK (@DineshKarthik) March 5, 2024
కాగా, తొలి ఇన్నింగ్స్లో తమిళనాడు 146 పరుగులకు ఆలౌట్ అవగా ముంబై జట్టు శార్దూల్ ఠాకూర్ (109) సెంచరీకి తోడు తనుష్ కొటియాన్ (89) రాణించడంతో 378 రన్స్ చేసింది. తమిళనాడు రెండో ఇన్నింగ్స్లో 162 పరుగులకే ఆలౌట్ అయింది. ఫలితంగా ముంబై 70 పరుగుల తేడాతో గెలిచింది.