Virat Kohli : టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ఇన్స్టాలో ఆసక్తికర పోస్ట్ పెట్టాడు. ఫేమ్ (గుర్తింపు) అనేది ఒక జబ్బు. దాని నుంచి బయటపడాలి అనుకుంటున్నా అని దివంగత బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ చెప్పిన పోస్ట్ను అతను షేర్ చేశాడు. ‘గుర్తింపు రావాలనునుకోవడం అనేది ఒక జబ్బు.. ఏదో ఒకరోజు నేను ఈ జబ్బు, ఈ కోరిక నుంచి బయటపడాలి అనుకుంటున్నా. గుర్తింపు, పేరు అనే వాటికి విలువ లేని చోట జీవితాన్ని ఎంచక్కా ఆస్వాదించగలం. ఈ జీవితానికి అది చాలు’ అని అర్థం వచ్చే పదాలు ఉన్న పోస్ట్ను కోహ్లీ ఇన్స్టాలో పెట్టాడు. దాంతో ఈ పోస్టు పెట్టడం వెనక కోహ్లీ ఉద్దేశం ఏంటని? చర్చించుకుంటున్నారు. విలక్షణ నటుడిగా పేరొందని ఇర్ఫాన్ ఖాన్ క్యాన్సర్తో 2022 ఏప్రిల్ 29న కన్నుమూశాడు. లైఫ్ ఆఫ్ పై, లంచ్ బాక్స్, పీకూ, అంగ్రేజీ మీడియం వంటి సినిమాలతో ఇర్ఫాన్ పాపులర్ అయ్యాడు.
శ్రీలంకతో స్వదేశంలో జరుగుతున్న టీ20 సిరీస్కు కోహ్లీ విరామం తీసుకున్నాడు. సెలవులు దొరకడంతో ఫ్యామిలీతో కలిసి దుబాయ్ వెళ్లాడు. అక్కడే కొత్త ఏడాది సంబురాలు చేసుకున్నాడు. శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్కు ఎంపికైన అతను త్వరలోనే జట్టుతో కలవనున్నాడు. ఇరుజట్లు జనవరి 10న గువహటిలో మొదటి వన్డేలో తలపడనున్నాయి. గత ఏడాది ఫామ్లేమితో సతమతమైన కోహ్లీ ఆసియా కప్లో సెంచరీతో సత్తా చాటాడు. టీ20 వరల్డ్ కప్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ సిరీస్లో కూడా రాణించాడు. స్వదేశంలో అక్టోబర్ – నవంబర్లో జరగనున్న వన్డే వరల్డ్ కప్లో కోహ్లీ కీలకం కానున్నాడు.