ముంబై : భారత క్రికెట్ నయా సంచలనం, 15 ఏండ్ల వండర్కిడ్ వైభవ్ సూర్యవంశీ బ్రాండ్ వాల్యూ ఐపీఎల్19వ సీజన్ తర్వాత ఆకాశాన్ని తాకింది. మెగా టోర్నీలో రాజస్థాన్ రాయల్స్ తరఫున పవర్ హిట్టింగ్తో చెలరేగిన సూర్యవంశీ ఆరెంజ్ క్యాప్తో పాటు సీజన్ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డును కైవసం చేసుకున్నాడు. ఈ అద్భుత ప్రదర్శనతో మైదానంలోనే కాకుండా ఎండార్స్మెంట్ల మార్కెట్లోనూ అతడు సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాడు. ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి ముందు కాంప్లాన్, రెడ్బుల్ వంటి ప్రముఖ బ్రాండ్లతో ఒక్కో ఒప్పందానికి దాదాపు రూ. 1 కోటి వరకు చార్జ్ చేసిన సూర్యవంశీ.. తాజా సీజన్ సక్సెస్ తర్వాత తన ఎండార్స్మెంట్ ఫీజును రెట్టింపు చేసినట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం కొత్తగా ఒప్పందాలు చేసుకోవడానికి క్యూ కడుతున్న కంపెనీలకు ఒక్కో డీల్కు రూ. 1.5 కోట్ల నుంచి రూ. 2 కోట్ల వరకు ధరను నిర్ణయించినట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. వైభవ్కు లాంగ్ టర్మ్ బ్యాట్ స్పాన్సర్షిప్ కోసం ప్రముఖ కంపెనీ ఏకంగా రూ. 12 కోట్లను ఆఫర్ చేసినట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సూర్యవంశీ ప్రస్తుత బ్యాట్ స్పాన్సర్షిప్ ధర రూ. 50 లక్షలు మాత్రమే కావడం గమనార్హం. అన్ని వర్గాల్లో ప్రస్తుతం వైభవ్ క్రేజ్ దృష్ట్యా అతనితో తమ బ్రాండ్లను ప్రమోట్ చేసుకొని లబ్ది పొందడానికి చాలా కంపెనీలు ఆసక్తిగా ఉన్నాయి.
ప్రముఖ మేనేజ్మెంట్ విద్యాసంస్థ ‘ఐఐఎమ్ ఇండోర్’ సూర్యవంశీపై ఒక ప్రత్యేక అధ్యయనాన్ని నిర్వహించనుంది. చిన్న వయసులోనే లభించే విపరీతమైన కీర్తి, సోషల్ మీడియా ప్రభావం, ప్రజల నుంచి వచ్చే అంచనాల ఒత్తిడి వంటివి బాల మేధావుల భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతాయో, వాటిని ఎలా అధిగమించాలో తెలుసుకోవడమే ఈ పరిశోధన ఉద్దేశమని ఐఐఎమ్ ఇండోర్ డైరెక్టర్ హిమాన్షు రాయ్ తెలిపారు. దీని తుది నివేదికను అంతర్జాతీయ జర్నల్స్తో పాటు బీసీసీఐకి కూడా అందజేస్తామని వెల్లడించారు.