ప్రతిష్ఠాత్మక ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్లో పసిడి పతకంతో చరిత్ర సృష్టించిన రాష్ట్ర యువ బాక్సర్ నిఖత్ జరీన్కు శుక్రవారం హైదరాబాద్లో ఘన స్వాగతం లభించింది. శంషాబాద్ విమానాశ్రయంలో వందల మంది క్రీడాభిమానుల సందోహం మధ్య నిఖత్తో పాటు ఇషాసింగ్, సౌమ్యకు మంత్రులు శ్రీనివాస్గౌడ్, ప్రశాంత్రెడ్డి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు.
అంతర్జాతీయ వేదికలపై దేశ ఖ్యాతిని సగర్వంగా ఇనుమడింపజేసిన తెలంగాణ చాంపియన్లు నిఖత్ జరీన్, ఇషాసింగ్, గుగులోతు సౌమ్యకు కనీవినీ ఎరుగని రీతిలో గ్రాండ్వెల్కమ్ లభించింది. టర్కీలో జరిగిన ప్రతిష్ఠాత్మక ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్లో పసిడి పతకంతో చరిత్ర సృష్టించిన స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్తో పాటు జూనియర్ షూటింగ్ ప్రపంచకప్లో హ్యాట్రిక్ స్వర్ణాలు కొల్లగొట్టిన ఇషాసింగ్, ఇండియన్ వుమెన్ ఫుట్బాల్ లీగ్లో అదరగొట్టిన సౌమ్య శుక్రవారం హైదరాబాద్కు చేరుకున్నారు. క్రీడా, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్, రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్రెడ్డి విజేతలకు శంషాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు.
హైదరాబాద్ ఆట ప్రతినిధి/ శంషాబాద్ రూరల్: కిక్కిరిసిన అభిమానుల సందోహం మధ్య నిఖత్, ఇషా, సౌమ్యను మంత్రులు శాలువాలతో సత్కరించి పుష్ప గుచ్చాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ ‘సమైక్య రాష్ట్రంలో నిరాదరణకు గురైన క్రీడలకు స్వరాష్ట్రంలో తగిన గుర్తింపు లభించింది. సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఆటలకు పెద్దపీట వేస్తున్నాం. ఇప్పటికే రాష్ట్రంలో నలభైకి పైగా స్టేడియాల నిర్మాణం పూర్తి చేసుకున్నాం. సీఎం కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేస్తున్నాం. దీని ద్వారా గ్రామ స్థాయి నుంచి మరింత మంది ప్రతిభ కల్గిన ప్లేయర్లు వెలుగులోకి వస్తారు.
అంతర్జాతీయ స్థాయిలో రాణించే ప్రతీ ప్లేయర్ను ప్రభుత్వం సముచిత రీతిలో గౌరవిస్తుంది. త్వరలోనే విజేతలకు ఆర్థికంగా అండగా నిలుస్తాం’ అని అన్నారు. మరోవైపు మంత్రి ప్రశాంత్రెడ్డి మాట్లాడుతూ ‘నిజామాబాద్ నుంచి నిఖత్, ఇషాసింగ్, సౌమ్య అంతర్జాతీయ స్థాయిలో సత్తాచాటడం చాలా గర్వంగా ఉంది. ఇందూరు గౌరవాన్ని ఇనుమడింపజేసిన వీరి ప్రదర్శన అద్భుతం. మాట ప్రకారం నిఖత్కు లక్ష రూపాయల నగదు బహుమతి అందిస్తాను.
సీఎం కేసీఆర్ అందిస్తున్న ప్రోత్సాహంతో ప్లేయర్లు సత్తాచాటుతున్నారు’అని అన్నారు. సాట్స్ ఆధ్వర్యంలో జరిగిన స్వాగత కార్యక్రమంలో క్రీడాభిమానులు భారీగా శంషాబాద్కు తరలివచ్చారు. ఓపెన్ టాప్ జీపులో నిఖత్, ఇషా, సౌమ్యను ప్రధాన రోడ్డు వరకు ఊరేగించారు. ఈ కార్యక్రమంలో సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి, క్రీడాశాఖ కార్యదర్శి సందీప్కుమార్, ఎండీ మనోహర్, సాట్స్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.