అంతర్జాతీయ వేదికలపై తెలంగాణ విజయపతాక మరోమారు సగర్వంగా ఎగిరింది. ఇస్తాంబుల్లో ఇందూరు బాక్సర్ నిఖత్ జరీన్ ప్రపంచ బాక్సింగ్ చాంపియన్గా అవతరించిన సంతోషంలో ఉండగానే పారిస్లో ఎస్సీ గురుకుల విద్యార్థులు సత్తా చాటారు. ప్రతిభకు పేదరికం అడ్డం కాదని నిరూపిస్తూ ఫ్రాన్స్ గడ్డపై త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించారు. చదువుల్లోనే కాదు ఆటల్లో దేశ ఖ్యాతిని దశదిశలా ఇనుమడింపజేస్తామని చాటిచెబుతూ పసిడి, కాంస్య కాంతులు విరజిమ్మారు. నార్మండీ వేదికగా జరుగుతున్న ప్రతిష్ఠాత్మక వరల్డ్ స్కూల్ అథ్లెటిక్స్ టోర్నీలో పారా అథ్లెట్ రవికిరణ్ పసిడి పతకంతో మెరువగా, మాయావతి కాంస్యం ఖాతాలో వేసుకుంది. శుక్రవారం జరిగిన బాలుర జావెలిన్ త్రో ఫైనల్లో బరిలోకి దిగిన షేక్పేట స్పోర్ట్స్ అకాడమీకి చెందిన రవికిరణ్ 30.74 మీటర్ల దూరం విసిరి అగ్రస్థానంలో నిలిచాడు. బలాన్నంతా కూడదీసుకుంటూ కిరణ్ విసిరిన బల్లెం రివ్వున దూసుకెళ్లింది.
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: పసి ప్రాయంలోనే పోలియో బారిన పడ్డ ఈ యువ అథ్లెట్ బరిలోకి దిగిన తొలి అంతర్జాతీయ టోర్నీలోనే అద్భుత ప్రతిభ చాటాడు. జాతీయ ఎస్జీఎఫ్ఐ టోర్నీలో పసిడి పతకాల ద్వారా వరల్డ్ టోర్నీకి అర్హత సాధించిన రవికిరణ్ అనుకున్న లక్ష్యాన్ని చేరుకుని కల నెరవేర్చుకున్నాడు. మరోవైపు 200 మీటర్ల రేసును 24.68 సెకన్లలో ముగించిన మాయావతి కాంస్య పతకాన్ని దక్కించుకుంది. చిరుతను తలపిస్తూ ప్రత్యర్థులకు దీటైన సవాలు విసిరిన ఈ యువ అథ్లెట్ కెరీర్లో తొలి అంతర్జాతీయ పతకాన్ని కైవసం చేసుకుంది. ట్రిపుల్ జంప్లో కొత్తూరి ప్రణయ్ తృటిలో కాంస్యాన్ని చేజార్చుకున్నాడు. 14.68 మీటర్లు లంఘించి దూకిన ప్రణయ్ నాలుగో స్థానంలో నిలిచి పతకం సాధించే అవకాశాన్ని కోల్పోయాడు.
ఇదే పోటీలో మార్టినెజ్ థామస్(ఫ్రాన్స్) 15.21మీటర్లతో స్వర్ణం దక్కించుకున్నాడు. వరల్డ్ స్కూల్ గేమ్స్లో పతకాలు సాధించిన రవికిరణ్, మాయావతిని ఎస్సీ గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి రొనాల్డ్ రాస్ ప్రత్యేకంగా అభినందించారు. సీఎం కేసీఆర్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రోత్సాహం వల్లనే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. అంతర్జాతీయ అథ్లెట్లుగా తీర్చిదిద్దడంలో కీలకంగా వ్యవహరించిన కోచ్లు నాగపురి రమేశ్, పరుశరాం, షాజీ, నాగరాజు, క్రీడాధికారి రామ్లక్ష్మణ్, ఇతర సిబ్బందిని ఆయన అభినందించారు.