Gukesh | రాజుల కాలం నుంచి వస్తున్న చదరంగ క్రీడలో మన దేశానికి ఘన చరిత్ర ఉంది. దేశం నుంచి తొలి గ్రాండ్మాస్టర్ హోదా దక్కించుకున్న విశ్వనాథన్ ఆనంద్.. ఆ తర్వాతి కాలంలో ఐదు సార్లు ప్రపంచ చాంపియన్గా నిలిచాడు. గత 37 ఏండ్లుగా ఆనంద్ భారత నంబర్వన్ చెస్ ప్లేయర్గా కొనసాగుతుండగా.. ఇప్పుడు కొత్త నీరు వస్తున్నది. ఇటీవల ఫిడే చెస్ వరల్డ్ కప్లో రన్నరప్గా నిలిచిన ఆర్.ప్రజ్ఞానంద ప్రపంచ దృష్టిని ఆకర్శిస్తే.. మరో యువ ఆటగాడు గుకేశ్ భారత నయా నంబర్వన్గా అవతరించాడు.
తాజాగా విడుదల చేసిన ఫిడే ర్యాంకింగ్స్లో ప్రపంచంలో ఎనిమిదో స్థానానికి చేరిన గుకేశ్.. ఈ క్రమంలో జాతీయ నంబర్వన్గా నిలిచాడు. గత 37 ఏండ్లుగా ఆనంద్ భారత నంబర్వన్గా కొనసాగుతుండగా.. తాజాగా గుకేశ్ చెస్ మాస్టర్ను అధిగమించాడు. ప్రస్తుతం గుకేశ్ 2758 ఎలో రేటింగ్ పాయింట్స్తో కొనసాగుతుండగా.. విశ్వనాథన్ ఆనంద్ 2754 పాయింట్లతో ప్రపంచ తొమ్మిదో ర్యాంక్లో నిలిచాడు. అంటే 1986 తర్వాత భారత్ కొత్త చెస్ నంబర్వన్ ఆటగాడిని చూసిందన్నమాట.
ప్రజ్ఞానంద, గుకేశ్, అర్జున్, విదిత్ ఇలా యువ చెస్ ఆటగాళ్లు అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తుండటాన్ని ఆనంద్ ఆహ్వానించాడు. రాబోయే కాలంలో చెస్లో భారత్ రారాజుగా ఎదగడం ఖాయమని ధీమా వ్యక్తం చేశాడు. ఇటీవల జరిగిన ఫిడే చెస్ వరల్డ్కప్లో ప్రజ్ఞానందతో సహా నలుగురు భారత గ్రాండ్మాస్టర్లు క్వార్టర్ ఫైనల్కు చేరి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్సన్ 2839 ఫిడే రేటింగ్ పాయింట్స్తో అగ్రస్థానంలో ఉండగా.. వరల్డ్ టాప్-30లో మన దేశం నుంచి ఐదుగురు చోటు దక్కించుకున్నారు. చెస్ వరల్డ్కప్ రన్నరప్ ప్రజ్ఞానంద 19వ స్థానంలో, విదిత్ 27వ ర్యాంక్లో, తెలంగాణ గ్రాండ్మాస్టర్ అర్జున్ 29వ ప్లేస్లో నిలిచారు.