భారత జట్టు బ్యాటింగ్ వైఫల్యం వల్ల సఫారీలతో జరుగుతున్న మూడో టెస్టులో విజయావకాశాలు సంక్లిష్టంగా మారాయి. సెంచరీ హీరో పంత్, కోహ్లీ తప్ప మిగతా బ్యాటర్లెవరూ నామమాత్రపు స్కోర్లు కూడా చేయలేదు. దీంతో సఫారీల ముందు 212 పరుగుల స్వల్పలక్ష్యమే మిగిలింది.
మూడో రోజు ఆట ముగిసే సమయానికే సౌతాఫ్రికా బ్యాటర్లు 100 పరుగులు సాధించారు. దీంతో నాలుగో రోజు ఆట చాలా కీలకంగా మారింది. భారత జట్టు విజయం సాధించాలంటే సఫారీ బ్యాటర్లను మరో వంద పరుగులు చేయకుండానే ఆలౌట్ చేయాల్సిన పరిస్థితి. సౌతాఫ్రికా ముందు స్వల్ప లక్ష్యం నిలవడానికి ప్రధాన కారణం భారత మిడిలార్డర్ వైఫల్యమే.
ముఖ్యంగా పుజారా, రహానే తీవ్రంగా నిరాశపరచడంతో భారత జట్టు కోలుకోలేకపోయింది. ఈ క్రమంలోనే భారత మాజీ కెప్టెన్ సునల్ గవాస్కర్ స్పందించాడు. స్వదేశంలో శ్రీలంకతో జరిగే టూర్లో రహానేకు చాన్స్ దొరుకుతుందా? అని గవాస్కర్ను ప్రశ్నించారు. దీనిపై మాట్లాడిన సన్నీ.. శ్రీలంక టూర్లో భారత జట్టులో రెండు స్థానాలు ఖాళీ అవుతాయని అభిప్రాయడ్డాడు.
పుజారా, రహానేకు ఈ టూర్లో స్థానం దక్కకపోవచ్చని, వీరి స్థానంలో విహారి, అయ్యర్కు అవకాశాలివ్వాలని అభిప్రాయపడ్డాడు. కొత్త ఆటగాళ్లకు స్వదేశీ పిచ్లపై ఎక్కువ అవకాశాలు ఇవ్వడం ముఖ్యమని చెప్పాడు. సఫారీ గడ్డపై విహారి ఆకట్టుకున్నప్పటికీ అతన కూడా సెంచూరియన్, న్యూలాండ్స్ మైదానాల్లో ఇబ్బంది పడి ఉండేవాడని పేర్కొన్నాడు. మరి సన్నీ అభిప్రాయం నిజమై శ్రీలంక టూర్లో వెటరన్లు ఇద్దరికీ విశ్రాంతి ఇస్తారేమో చూడాలి.