సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటిన టీమ్ఇండియా.. సిరీస్ సమం చేసింది. టాపార్డర్ విఫలమైనా.. మిడిలార్డర్లో దినేశ్ కార్తీక్, హార్దిక్ పాండ్యా మెరుపులు మెరిపించడంతో భారీ స్కోరు చేసిన భారత్.. ఆనక బౌలింగ్లో అవేశ్ ఖాన్, హర్షల్ పటేల్, యుజ్వేంద్ర చాహల్ సత్తాచాటడంతో నాలుగో టీ20లో ఘనవిజయం సాధించింది. తొలి రెండు మ్యాచ్ల్లో ఆకట్టుకోలేకపోయిన పంత్ సేన.. మలి రెండు టీ20ల్లో విజృంభించింది. సిరీస్ నిర్ణయాత్మక పోరు ఆదివారం బెంగళూరులో జరుగనుంది.
రాజ్కోట్: మిడిలార్డర్ పోరాటానికి.. బౌలర్ల జోరు తోడవడంతో భారత జట్టు పోటీలో నిలిచింది. ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా శుక్రవారం దక్షిణాఫ్రికాతో జరిగిన నాలుగో టీ20లో 82 పరుగుల తేడాతో విజయఢంకా మోగించింది. వరుసగా నాలుగో మ్యాచ్లోనూ టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. దినేశ్ కార్తీక్ (27 బంతుల్లో 55; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) హాఫ్ సెంచరీతో ఆకట్టుకోగా.. హార్దిక్ పాండ్యా (31 బంతుల్లో 46; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించాడు. భారత జట్టు ఆడిన మొదటి టీ20లో సభ్యుడైన దినేశ్ కార్తీక్.. పదహారేండ్ల సుదీర్ఘ కెరీర్లో తొలి అర్ధశతకం నమోదు చేసుకోవడం గమనార్హం. 10 ఓవర్లు ముగిసేసరికి 56/3తో నిలిచిన భారత్.. ఆ తర్వాత ధాటిగా ఆడింది.
కార్తీక్, పాండ్యా దెబ్బకు చివరి ఐదు ఓవర్లలో టీమ్ఇండియా 73 పరుగులు రాబట్టింది. యువ ఓపెనర్ ఇషాన్ కిషన్ (27) ఫర్వాలేదనిపించగా.. రుతురాజ్ గైక్వాడ్ (5), శ్రేయస్ అయ్యర్ (4), కెప్టెన్ రిషబ్ పంత్ (17) విఫలమయ్యారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఎంగ్డీ రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం ఓ మాదిరి లక్ష్యఛేదనకు దిగిన సఫారీ జట్టు.. 16.5 ఓవర్లలో 87 పరుగులకు ఆలౌటైంది. డసెన్ (20) టాప్ స్కోరర్ కాగా.. మిల్లర్ (9), క్లాసెన్ (8), ప్రిటోరియస్ (0), డికాక్ (14) ప్రభావం చూపలేకపోయారు. కెప్టెన్ టెంబా బవుమా (8) రిటైర్డ్హర్ట్గా వెనుదిరిగాడు. భారత బౌలర్లలో అవేశ్ ఖాన్ 4 వికెట్లు పడగొట్టగా.. హర్షల్ పటేల్ 2 ఓవర్లలో మూడు పరుగులే ఇచ్చి ఓ వికెట్ పడగొట్టడంతో పాటు డికాక్ను రనౌట్ చేశాడు.
దినేశ్ కార్తీక్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. 56/3 నుంచి.. 169/6 మొదట బ్యాటింగ్కు దిగిన టీమ్ఇండియాకు శుభారంభం దక్కలేదు. రెండో ఓవర్లోనే రుతురాజ్ గైక్వాడ్ కీపర్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరగగా.. మరుసటి ఓవర్లో శ్రేయస్ అయ్యర్ వికెట్ల ముందు దొరికిపోయాడు. చక్కటి షాట్లతో అలరించిన ఇన్ఫామ్ బ్యాటర్ ఇషాన్ కిషన్ కూడా ఎక్కువసేపు నిలువలేకపోవడంతో.. పంత్ సేన 40 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో పంత్, పాండ్యా ఇన్నింగ్స్ను నిలబెట్టే ప్రయత్నం చేశారు. సఫారీ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తుండటంతో ఈ జంట వేగంగా పరుగులు రాబట్టేందుకు ఇబ్బంది పడింది.
షంసీ బౌలింగ్లో రెండు సిక్సర్లతో హార్దిక్ కాస్త జోరు పెంచగా.. ఆఫ్వికెట్కు దూరంగా వెళ్తున్న బంతిని వెంటాడి పంత్ వికెట్ సమర్పించుకున్నాడు. ఈ దశలో పాండ్యాకు కార్తీక్ తోడవడంతో భారత ఇన్నింగ్స్ స్వభావం మారిపోయింది. వీలు చిక్కినప్పుడల్లా బౌండ్రీలు బాదిన ఈ జంట.. స్కోరుబోర్డును పరుగులు పెట్టించింది. నోర్జే బౌలింగ్లో రెండు ఫోర్లు అరుసుకున్న కార్తీక్.. మహారాజ్ ఓవర్లో 6,4,4.. ప్రిటోరియస్ వేసిన 18వ ఓవర్లో 6,4,4 దంచడంతో భారత్ మంచి స్కోరు చేయగలిగింది.
భారత్: 20 ఓవర్లలో 169/6 (దినేశ్ కార్తీక్ 55, హార్దిక్ 46; ఎంగ్డీ 2/20), దక్షిణాఫ్రికా: 16.5 ఓవర్లలో 87 ఆలౌట్ (డసెన్ 20; అవేశ్ 4/18, చాహల్ 2/21).