Srilanka Cricket : మొట్టమొదటి మహిళల చాంపియన్స్ ట్రోఫీ (Womens Champions Trophy 2027) వేదికపై అనిశ్చితి కొనసాగుతుంది. శ్రీలంక(Srilanka) నుంచి టోర్నీని తరలించేందుకు ఐసీసీ(ICC) సిద్ధమైన నేపథ్యంలో మరి ఎక్కడ నిర్వహిస్తారు? అనేది ఆసక్తికరంగా మారింది. ఈ పరిస్థితుల్లో లంక తాత్కాలిక ట్రాన్స్ఫర్మేషన్ కమిటీ మాత్రం అరంగేట్రం సీజన్ ఆతిథ్య హక్కులను ఎట్టిపరిస్థితుల్లోనే వదులుకునేందుకు సిద్ధంగా లేమని అంటోంది.. ఎలాగైనా సరే ఈ మెగా ఈవెంట్ను తమ దేశంలో జరిపించేందుకు అవసరమైన చర్యలు తీసుకోనుందీ కమిటీ.
శ్రీలంక క్రికెట్పై అసంతృప్తితో మహిళల ఛాంపియన్స్ ట్రోఫీని వేరే దేశంలో నిర్వహించేందుకు ఐసీసీ ఆలోచిస్తోంది. వేదిక తరలింపు అంశం తెరపైకి రావడంతో అప్రమత్తమైంది లంక క్రికెట్. ఇది అరంగేట్రం సీజన్ కావడంతో ఎలాగైనా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తాత్కాలిక ట్రాన్స్ఫర్మేషన్ కమిటీ గట్టిగా ప్రయత్నిస్తోంది. అందుకోసం అత్యవసరంగా సంస్కరణలకు సిద్ధమవుతోంది. తాము ఐసీసీని ఒప్పించి మహిళల ఛాంపియన్స్ ట్రోఫీ అరంభ సీజన్ను లంకలోనే జరిగేలా చూస్తామని మధ్యంతర కమిటీ చైర్మన్ ఎరాన్ విక్రేమరత్నా తెలిపాడు.
‘శ్రీలంక క్రికెట్లోని లోపాలను పునాది నుంచి సరి చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. ఈ విషయంలో మేము వెనక్కి తగ్గం. శ్రీలంక క్రికెట్లో ప్రభుత్వ జోక్యం చేసుకుంటున్న అంశాలను ఐసీసీ మా దృష్టికి తీసుకురాలేదు. కాబట్టి.. మేము తీసుకుంటున్న చర్యలను వివరించి.. మా దేశంలోనే టోర్నీ జరిపేలా ఐసీసీని ఒప్పిస్తాం’ అని మధ్యంతర కమిటీ సభ్యుడు ప్రకాశ్ షఫ్తెర్ వెల్లడించాడు. ఇదే కమిటీలో సభ్యుడైన కుమార సంగక్కర(Kumara Sangakkara) మాట్లాడుతూ.. ఐసీసీతో బలమైన అనుబంధం కొనసాగించాలని అభిప్రాయపడ్డాడు. ‘శ్రీలంక క్రికెట్కు కొత్త రాజ్యాంగం తీసుకొస్తున్నాం. ఆ తర్వాత ఎన్నికలు నిర్వహించి కార్యవర్గాన్ని ఎన్నుకుంటాం’ అని సంగక్కర పేర్కొన్నాడు.
శ్రీలంకలో 2023-24 మధ్య ఏర్పడిన రాజకీయ అనిశ్చితి.. ఆ దేశ క్రికెట్ బోర్డులో అవినీతిని బట్టబయలు చేసింది. పరిపాలనా వ్యవహారాల్లో అవకతవకల కారణంగా కొన్నిరోజుల పాటు ఎస్ఎల్సీని ఐసీసీ సస్పెండ్ చేసింది. నాటి నుంచి ఎస్ఎల్సీకి పూర్తిస్థాయిలో పాలక మండలి లేదు. ప్రభుత్వం నియమించిన తాత్కాలిక ట్రాన్స్ఫర్మేషన్ కమిటీ అధికారులతో వ్యవహారాలు సాగుతున్నాయి. అయితే బోర్డు కార్యకలాపాల్లో ప్రభుత్వ జోక్యాన్ని అనుమతించని ఐసీసీ.. ఎన్నికలు నిర్వహించాలని సూచించినా ఆ దేశ క్రీడాశాఖ పెడచెవిన పెట్టింది.
The inaugural Women’s Champions Trophy, scheduled for February 2027, will be moved out of Sri Lanka, with SLC set to be stripped of hosting rights.
Cricinfo has confirmed that the six-team event will be played in a different country in the same window – likely to be India
Full… pic.twitter.com/z6WeqOYn0N
— Cricinfo (@cricinfo) August 30, 2026
దాంతో మహిళల చాంపియన్స్ ట్రోఫీ హక్కులను శ్రీలంక కోల్పోనున్నట్టు సమాచారం. ఇదే విషయమై ట్రాన్స్ఫర్మేషన్ కమిటీ కార్యదర్శి ప్రకాశ్ షఫ్తెర్ మాట్లాడుతూ.. ‘అవును, ఆ టోర్నీ శ్రీలంక నుంచి తరిలిపోయినట్టే. మరో వేదికలో ఆ టోర్నీ జరుగనుంది. కానీ అదెక్కడనేది మాత్రం ఇప్పుడే చెప్పలేము’ అని తెలిపాడు. షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ జరుగనుంది. టీ20 ఫార్మాట్లో.. ఆరుజట్లతో ఫిబ్రవరి 14 నుంచి 28వ తేదీ వరకూ ఈ మెగా టోర్నీని నిర్వహించనుంది ఐసీసీ.