IPL 2026 : ఐపీఎల్ పంతొమ్మిదో సీజన్ ప్లే ఆఫ్స్ రేసు ఉత్కంఠ రేపుతోంది. నాకౌట్ పోటీలో లేని జట్లు పోతూపోతూ టాప్లోని జట్లకు షాకిస్తుండడంతో సమీకరణాలు మారిపోతున్నాయి. నాలుగు బెర్తులకు ఎనిమిది జట్లు పోటీలో నిలవగా.. లీగ్ దశలో 11 మ్యాచులే మిగిలాయి. ఈ పరిస్థితుల్లో ముందంజ వేయాలంటే.. ప్రతి మ్యాచ్ చావోరేవో. ఈ నేపథ్యంలో టాప్-2లోని గుజరాత్ టైటాన్స్(Gujarat Titans), రాయల్ ఛాలెంజర్స్(RCB)కు ఒక్క విజయం చాలు. కానీ, సన్రైజర్స్ హైదారబాద్.. రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ రెండింటా గెలవాల్సి ఉంటుంది. అయితే.. చెన్నై సూపర్ కింగ్స్, కోల్కతా, ఢిల్లీ క్యాపిటల్స్ భారీ తేడాతో గెలవడమే కాకుండా ఇతర మ్యాచ్ల ఫలితాల ఆధారంగా ప్లే ఆఫ్స్ చేరే అవకాశముంది.
పంతొమ్మిదో సీజన్ లీగ్ దశ ఆద్యంతం ఆసక్తిగా సాగుతోంది. వరుసగా ఆరు విజయాలతో టాప్లో కొనసాగిన పంజాబ్ కింగ్స్ ఆశ్చర్యంగా.. ఐదు ఓటములతో ప్లే ఆఫ్స్ అవకాశాల్ని సంక్షిష్టం చేసుకుంది. ఆరంభంలో నిరాశపరిచిన గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) వరసగా ఐదింటా గెలుపొంది టాప్లో కూర్చుంది. ప్రస్తుతం 16 పాయింట్లతో ఉన్న గుజరాత్ మరొక్క మ్యాచ్ గెలిస్తే దర్జాగా ప్లే ఆఫ్స్ చేరుతుంది. శనివారం కోల్కతాను ఓడిస్తే చాలు శుభ్మన్ గిల్ సేన ముందుకెళ్తుంది.
Have a look at the updated IPL 2026 points table after Lucknow Super Giants thumping win Chennai Super Kings 📊#IPL2026 #LucknowSuperGiants #ChennaiSuperKings #InsideSport #Cricket pic.twitter.com/jyfTdw7DUa
— InsideSport (@InsideSportIND) May 15, 2026
ఒకవేళ కోల్కతా చేతిలో, ఆపై మే 21న చెన్నై చేతిలోనూ ఓడితే టోర్నీ నుంచి నిష్క్రమంచే అవకాశమూ ఉంది. అయితే.. రెండింటా ఒక్కటి గెలిచినా 18 పాయింట్లు వస్తాయి. ఒకవేళ గుజరాత్ ఒక మ్యాచ్ ఓడితే ఆర్సీబీ, రాజస్థాన్, సన్రైజర్స్ కూడా 18 పాయింట్లతో ఉండాలి. అప్పుడు రాజస్థాన్ మూడింటా గెలవాలి. ఆర్సీబీ.. పంజాబ్ను ఓడించి సన్రైజర్స్ చేతిలో ఓడాలి. చెన్నైపై కమిన్స్ సేన గెలవాలి. అప్పుడు.. నెట్రన్ రేటు మెరుగ్గా ఉన్న జట్టు క్వాలిఫయర్ 1కు దూసుకెళ్తుంది.
డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)కి ఇంకా రెండు మ్యాచులే మిగిలాయి. ప్రస్తుతం 16 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచిన బెంగళూరు ఒక్క విజయంతో ముందుకెళ్తుంది. పంజాబ్ కింగ్స్, సన్రైజర్స్ హైదరాబాద్పై గెలిస్తే.. 20 పాయింట్లతో టాప్లో ఉంటుంది.

అలాకాకుండా పంజాబ్, సన్రైజర్స్ చేతిలో ఓడితే నెట్రన్రేటుతో సంబంధం లేకుండా ఆర్సీబీ నిష్క్రమిస్తుంది. గుజరాత్, రాజస్థాన్కు 18 పాయింట్లు ఉండి.. సీఎస్కేను హైదరాబాద్ ఓడించినా.. లక్నోకు పంజాబ్ చెక్ పెట్టినా పటిదార్ బృందానికి అవకాశలు సన్నగిల్లుతాయి. అప్పుడు ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడక తప్పదు.
ఐపీఎల్ రికార్డు బ్రేకర్ సన్రైజర్స్ (Sunrisers Hyderabad) ప్లే ఆఫ్స్ అవకాశాలు మెరుగ్గానే ఉన్నాయి. తదుపరి రెండు మ్యాచుల్లో చెన్నై సూపర్ కింగ్స్, ఆర్సీబీపై గెలిస్తే కమిన్స్ సేన ప్లే ఆఫ్స్లో ఉంటుంది. ఒకవేళ చెన్నైపై గెలిచి. బెంగళూరు చేతిలో ఓడితే అప్పుడు పంజాబ్, రాజస్థాన్ తమ తదుపరి మ్యాచుల్లో ఒకే ఒకటి గెలవాలి.

అలాకాకుండా సీఎస్కేపై ఓడి బెంగళూరుపై విజయం సాధిస్తే అప్పుడు పలుజట్లు 16 పాయింట్లతో పోటీలో ఉంటాయి. ప్రస్తుతమున్న 14 పాయింట్లతోనూ సన్రైజర్స్ ప్లే ఆఫ్స్ చేరాలంటే.. పంజాబ్, రాజస్థాన్ అన్నింటా ఓడాలి. ఒకవేళ కోల్కతా చివరి మూడు మ్యాచుల్లో గెలిస్తే అప్పుడు సమీకరణాలు మారుతాయి.
లీగ్ ప్రథమార్థంలో దుమ్మురేపిన పంజాబ్ కింగ్స్ (Punjab Kings) వరస ఓటములతో వెనకబడింది. ఆరంభంలో ఆరు విజయాలు.. ఆపై వరసగా ఐదు ఓటములు శ్రేయస్(Shreyas Iyer) అయ్యర్ బృందం అవకాశాల్ని దెబ్బతీశాయి. అయినా సరే.. రెండు మ్యాచుల్లో భారీ తేడాతో గెలిస్తే ముందంజ వేస్తుంది. ప్రస్తుతమున్న 13 పాయింట్లతోనూ పంజాబ్ ప్లే ఆఫ్స్ చేరే వీలుంది.

కానీ.. రాజస్థాన్, చెన్నై ఒక్కటీ గెలవకూడదు. కోల్కతా మూడు మ్యాచుల్లో ఢిల్లీపై గెలిచి.. గుజరాత్, ముంబై చేతిలో ఓడాలి. అప్పుడు రాజస్థాన్, ఢిల్లీ, సీఎస్కే 12 పాయింట్లతో సమంగా ఉంటాయి. అదే జరిగితే.. ఆర్సీబీ, గుజరాత్, సన్రైజర్స్తో పాటు నాకౌట్కు వెళ్తుంది పంజాబ్. ఒకవేళ ఒక్కటే గెలిచి 15 పాయింట్లు.. సాధిస్తే ఇతర జట్ల ఫలితాలపై పంజాబ్ ఆధారపడక తప్పదు.
లీగ్ దశ ఆరంభంలోఅదరగొట్టిన రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) మూడింటా గెలిస్తేనే ప్లే ఆఫ్స్ చేరుతుంది. తొలుత ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ, యశస్వీ జైస్వీల్ మెరుపులు.. బౌలింగ్లో ఆర్చర్, బర్గర్ విజృంభణతో టాప్లో నిలిచిన రాజస్థాన్ అనూహ్య తడబాటుతో వెనకబడింది. ఢిల్లీ, లక్నో, ముంబై.. ఈ మూడింటిపై విజయం సాధిస్తే పరాగ్ సేన 18 పాయింట్లతో ముందంజ వేస్తుంది.

ఒకవేళ పంజాబ్ ఒక మ్యాచ్ ఓడి 15 పాయింట్లతో ఉంటే అప్పుడు రాజస్థాన్ 16 పాయింట్లతో.. నెట్రన్ రేటులోనూ మెరుగ్గా ఉండాలి. చెన్నై, పంజాబ్ ఒక్కటీ గెలవకుంటే.. ఢిల్లీ, కోల్కతా వీటి కిందే ఉంటే రాజస్థాన్కు ఢోకా ఉండదు.
ఎంఎస్ ధోనీ గైర్హాజరీలో తడబడిన చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) ఆఖర్లో గొప్పగా పుంజుకొని ప్లే ఆఫ్స్ రేసులోకి వచ్చింది. శుక్రవారం లక్నో సూపర్ జెయింట్స్ ఇచ్చిన షాక్తో సీఎస్కే రన్రేటు తగ్గింది. తదుపరి రెండు మ్యాచుల్లో సన్రైజర్స్, గుజరాత్పై గెలిస్తే చెన్నై 16 పాయింట్లతో ప్లే ఆఫ్స్ చేరుతుంది.

ఆర్సీబీ చేతిలో సన్రైజర్స్ ఓడినా.. పంజాబ్, రాజస్థాన్ ఒకేఒక విజయంతో సరిపెట్టుకున్నా గైక్వాడ్ సేనకు అవకాశాలుంటాయి. 14 పాయింట్లతోనే సీఎస్కే నాకౌట్కు వెళ్లాలంటే.. పంజాబ్, రాజస్థాన్ అన్నింటా ఓడాలి. ఢిల్లీని కోల్కతా ఓడిచండంతో పాటు మిగతా రెండు మ్యాచుల్లో విజయం సాధించకూడదు.
ఆరంభం నుంచి నిరాశపరిచినా.. ఆఖర్లో అదరగొట్టిన కోల్కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders)కు ప్లే ఆఫ్స్ అవకాశముంది. 11 మ్యాచుల్లో ఆరు ఓటములతో ప్రస్తుతం 9 పాయింట్లతో ఎనిమిదో స్థానంలో కొనసాగుతున్న కోల్కతా తదుపరి మూడు మ్యాచులు ఈడెన్ గార్డెన్లోనే ఆడనుంది. గుజరాత్, ముంబై, ఢిల్లీపై గెలిస్తే కేకేఆర్ ఖాతాలో 15 పాయింట్లు చేరుతాయి.

గుజరాత్, ఆర్సీబీ మినహా పంజాబ్, రాజస్థాన్, సన్రైజర్స్ సైతం 16 పాయింట్లతో ఉంటే.. రహానే బృందం నిష్క్రమిస్తుంది. అలాకాకుండా చెన్నై, పంజాబ్, రాజస్థాన్లు అన్నింటా ఓడిపోతే.. ఢిల్లీపై కోల్కతా గెలిస్తే ముందంజ వేసే అవకాశముంది. అప్పుడు నెట్ రన్రేటు మెరుగ్గా ఉన్న పంజాబ్, కోల్కతాలో ఒకటి నాలుగో స్థానం దక్కించుకుంటుంది.
పంతొమ్మిదో సీజన్లో నిలకడలేమికి కేరాఫ్గా మారిన ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) నాకౌట్పై ఆశలు పెట్టుకుంది. ప్రస్తుతం 10 పాయింట్లతో ప్లే ఆఫ్స్కు పోటీగా మారిన ఢిల్లీ చివరి రెండు మ్యాచుల్లో రాజస్థాన్, కోల్కతాపై గెలవాల్సిందే. అయినా నెట్ రన్రేటు మైనస్లో ఉండడం ఆ జట్టుకు ప్రతికూలం కానుంది.

గుజరాత్, ఆర్సీబీ, సన్రైజర్స్ గెలవడంతో పాటు.. లక్నో, ముంబై చేతిలో పంజాబ్, రాజస్థాన్ ఓడితే ఢిల్లీకి అవకాశముంటుంది. అప్పుడు నెట్ రన్రేటుతో సంబంధం లేకుండా అక్షర్ పటేల్ సేన నాకౌట్కు దూసుకెళ్తుంది. కానీ, రెండు మూడు జట్లు కూడా14 పాయింట్లతో ఉంటే మాత్రం ఢిల్లీ ఇంటిదారి పట్టాల్సిందే.