న్యూఢిల్లీ: బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ చేసిన ట్వీట్ సర్వత్రా ఆసక్తి రేపుతున్నది. క్రికెట్ కాకుండా మరో కొత్త మార్గంలో నడవాలనుకుంటున్నట్లు గంగూలీ ట్విట్టర్లో పేర్కొనడం.. దాదా రాజకీయ రంగ ప్రవేశం వార్తలకు ఊతమిస్తున్నది. ‘1992లో క్రీడా జీవితాన్ని ప్రారంభించాను. క్రికెట్తో అనుబంధానికి ఈ ఏడాదితో 30 ఏండ్లు నిండాయి. క్రికెట్ నాకు ఎంతో ఇచ్చింది. ముఖ్యంగా మీ అందరి ఆదరాభిమానాలు పొందగలిగాను. అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ప్రజలకు సహాయపడేలా ఇకపై ఏదైనా చేయాలని భావిస్తున్నా. ఈ కొత్త ప్రయాణంలో కూడా నాకు మద్దతు ఇస్తారని భావిస్తున్నా’ అని గంగూలీ ట్వీట్ చేశాడు. దీంతో ఒక్కసారిగా దాదా బీసీసీఐ అధ్యక్ష పదవిని వీడి రాజకీయాల్లో చేరుతున్నారనే వార్తలు గుప్పుమన్నాయి. దీనిపై బోర్డు కార్యదర్శి జై షా స్పందిస్తూ.. గంగూలీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయలేదని స్పష్టతనిచ్చారు.