న్యూఢిల్లీ: ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో భారత వర్ధమాన షట్లర్ శంకర్ ముత్తుస్వామి రజత పతకం చేజిక్కించుకున్నాడు. ఆదివారం జరిగిన బాలుర సింగిల్స్ ఫైనల్లో శంకర్ 14-21, 20-22తో కు కోన్ లిన్ (చైనీస్ తైపీ) చేతిలో ఓటమి పాలయ్యాడు. తద్వారా భారత్ తరఫున ఈ టోర్నీలో రజతం నెగ్గిన నాలుగో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. గతంలో అపర్ణ (1996), సైనా నెహ్వాల్ (2006), సిరిల్ వర్మ (2015) ఈ ఘనత సాధించారు. రెండో గేమ్లో ఆరు మ్యాచ్ పాయింట్లు కాచుకున్న శంకర్ ఒక దశలో మ్యాచ్ను నిర్ణయాత్మక మూడో గేమ్కు తీసుకెళ్లేటట్లు కనిపించినా.. చైనీస్తైపీ షట్లర్ పట్టు వీడకపోవడంతో రన్నరప్తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.