కొలంబో: ఇండియా, శ్రీలంక మధ్య కాసేపట్లో తొలి వన్డే ప్రారంభం కాబోతోంది. ఈ టూర్కు కెప్టెన్గా వ్యవహరించే అరుదైన అవకాశం ఓపెనర్ శిఖర్ ధావన్కు దక్కింది. కోహ్లి సారథ్యంలోని టీమ్ ఇంగ్లండ్లో ఉండటంతో మరో టీమ్ను ధావన్ కెప్టెన్సీలో శ్రీలంక వెళ్లిన విషయం తెలిసిందే. తొలిసారి ఇండియన్ టీమ్కు కెప్టెన్గా ఉండే అవకాశం రావడంతో దానిని సద్వినియోగం చేసుకోవాలని ధావన్ చూస్తున్నాడు.
ఇక అటు బ్యాట్స్మన్గా కూడా ఈ శ్రీలంక సిరీస్లో కొన్ని అరుదైన రికార్డులను ధావన్ అందుకునే అవకాశం ఉంది. అంతర్జాతీయ క్రికెట్లో 10 వేల పరుగుల మైలురాయిని అందుకోవడానికి ధావన్ మరో 35 పరుగుల దూరంలో ఉన్నాడు. ఆదివారం జరిగే తొలి వన్డేలోనే ఆ 35 పరుగులు చేస్తే.. ఈ ఘనత సాధించిన 14వ ఇండియన్ బ్యాట్స్మన్గా అతడు నిలుస్తాడు. ప్రస్తుతం ధావన్ 142 వన్డేల్లో 5977 పరుగులు చేశాడు. అందులో 17 సెంచరీలు, 32 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
ఇక 34 టెస్టుల్లో 2315, 65 టీ20 మ్యాచ్లలో 1673 పరుగులు చేశాడు. ఇక ఆ 10 వేల పరుగులను అతడు అందుకుంటే.. ఇంటర్నేషనల్ క్రికెట్లో 10 వేల పరుగుల మైలురాయిని వేగంగా అందుకున్న ఆరో బ్యాట్స్మన్గా నిలుస్తాడు. కోహ్లి 232 ఇన్నింగ్స్తో అందరి కన్నా ముందు ఉండగా.. గవాస్కర్ (243), గంగూలీ (253), టెండూల్కర్ (256), ద్రవిడ్ (257) టాప్ 5లో ఉన్నారు.
ధావన్ ఇప్పటి వరకూ 260 ఇన్నింగ్స్ ఆడాడు. ఆదివారంలో లంకతో మ్యాచ్ అతనికి 261వ ఇన్నింగ్స్ అవుతుంది. ఇక మరో 23 పరుగులు చేస్తే వన్డేల్లో 6 వేల పరుగుల మైలురాయిని అందుకున్న 10వ ఇండియన్ ప్లేయర్గా నిలుస్తాడు. ఆదివారం మ్యాచ్లోనే ఆ పరుగులు చేస్తే.. అత్యంత వేగంగా ఈ మార్క్ దాటిన రెండో ఇండియన్గా నిలుస్తాడు. కోహ్లి 136 ఇన్నింగ్స్తో టాప్లో ఉండగా.. ధావన్కు ఇది 140వ ఇన్నింగ్స్ కానుంది.