మెల్బోర్న్: కెరీర్లో చివరి గ్రాండ్స్లామ్ ఆడుతున్న భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా.. ఆస్ట్రేలియా ఓపెన్ సెమీఫైనల్కు దూసుకెళ్లింది. మిక్స్డ్ డబుల్స్లో భారత సీనియర్ ఆటగాడు రోహాన్ బోపన్నతో జట్టు కట్టిన ఈ హైదరాబాదీ.. మెల్బోర్న్లో వరుస విజయాలతో విజృంభిస్తున్నది. ఈ టోర్నీలో ఇప్పటి వరకు ఒక్క సెట్ కూడా ఓడిపోని భారత జోడీకి.. మంగళవారం క్వార్టర్ ఫైనల్లో ప్రత్యర్థి నుంచి వాకోవర్ లభించింది.
జెలెనా ఓస్టపెంకా-డేవిడ్ వెగా జోడీ టోర్నీ నుంచి తప్పుకోవడంతో సానియా-బోపన్న ద్వయం నేరుగా సెమీస్లో అడుగుపెట్టింది. బుధవారం జరుగనున్న సెమీస్లో మూడో సీడ్ నీల్ సుస్కీ-డిసైరే క్రాజిక్ జంటతో భారత జోడీ అమీతుమీ తేల్చుకోనుంది. పురుషుల సింగిల్స్లో మూడో సీడ్ సిట్సిపాస్ 6-3, 7-6 (7/2), 6-4తో లెహెకాపై.. కచనోవ్ 7-6 (7/5), 6-3, 3-0తో కొర్డాపై నెగ్గి సెమీస్కు చేరారు. మహిళల సింగిల్స్లో మూడో సీడ్ పెగులాను 24వ సీడ్ అజరెంకా మట్టి కరిపించగా.. ఓస్టపెంకాపై విజయంతో రైబాకినా ముందంజ వేసింది.