90వ దశకంలో భారత క్రికెట్లో సచిన్తో పాటు ఆడిన అతడి చిన్ననాటి స్నేహితుడు వినోద్ కాంబ్లీ ఆర్థిక కష్టాలతో సతమతమవుతున్నాడు. తనకు బీసీసీఐ నుంచి వచ్చే పింఛన్ తప్ప మరే విధమైన ఆదాయమూ లేదని, తనను ఆదుకోవాలని వేడుకున్నాడు. తాజాగా ఓ మీడియా ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కాంబ్లీ.. తాను ఎదుర్కుంటున్న కష్టాల గురించి చెప్పుకొచ్చాడు.
‘నేను రిటైర్డ్ క్రికెటర్ను. పూర్తిగా బీసీసీఐ అందజేసే పింఛన్ మీద ఆధారపడి బతుకుతున్నా. బోర్డు నుంచి వచ్చే పింఛన్ తప్ప నాకు మరో ఆదాయం లేదు. దాంతోనే నా కుటుంబాన్ని పోషించుకుంటున్నా. నా కుటుంబాన్ని పోషిస్తున్నందుకు బోర్డుకు ధన్యవాదాలు…’ అని తెలిపాడు. రిటైరైన క్రికెటర్లకు బీసీసీఐ రూ. 30 వేలు పింఛన్గా అందిస్తున్నది.
తనకు ఏదైనా పని ఉంటే ఇప్పించాలని ముంబై క్రికెట్ అధికారులను కాంబ్లీ కోరాడు. ‘నాకు ముంబై క్రికెట్ ఎంతో ఇచ్చింది. ఈరోజు నేనిక్కడున్నానంటే ముంబై క్రికెటే కారణం. బీసీసీఐ అందజేసే పింఛన్ నాకు సరిపోవడం లేదు. ముంబై వంటి నగరంలో జీవించాలంటే ఆ ఆదాయంతో కష్టం. నాకేదైనా పనుంటే ఇప్పించాలని చాలాకాలంగా ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఎ) ను అడుగుతూనే ఉన్నా.. క్రికెట్కు సంబంధించిన పని ఏదైనా నేను చేయగలను. నన్ను ఎంసీఎలో క్రికెట్ ఇంప్రూవ్మెంట్ కమిటీ (సీఐసీ)లోకి తీసుకున్నారు. కానీ అది గౌరవప్రదమైన పోస్టు తప్ప జీతం రాదు..’ అని అన్నాడు.
తన కష్టాల గురించి సచిన్కు తెలుసా..? ఆయనను సాయం అడిగారా అన్న ప్రశ్నకు కాంబ్లీ సమాధానం చెబుతూ.. ‘సచిన్కు అన్నీ తెలుసు. నా ఆర్థిక పరిస్థితులపై సచిన్కు అవగాహన ఉంది. అతడు నాకు ఇప్పటికే చాలా సాయం చేశాడు. తన క్రికెట్ అకాడమీలో నాకు ఉద్యోగం ఇప్పించాడు. కానీ నేనుండే ప్రాంతానికి అది చాలా దూరంలో ఉంది. అందుకే అక్కడ ఉద్యోగం మానేశా. నా బాగు కోరేవాళ్లలో సచిన్ ఎప్పుడూ ముందుంటాడు. కానీ నేను సచిన్ను సాయం అడగదలుచుకోలేదు..’ అని కాంబ్లీ చెప్పాడు.
భారత్ తరఫున 17 టెస్టులు, 104 వన్డేలు ఆడిన కాంబ్లీ.. టెస్టులలో 1,084 పరుగులు చేయగా వన్డేలలో 2,477 రన్స్ సాధించాడు. టెస్టుల్లో 4 సెంచరీలు, వన్డేలలో రెండు సెంచరీలు చేశాడు.