పరిమిత ఓవర్ల క్రికెట్లో మెరుపులు మెరిపించి ఆలస్యంగా టెస్టు జట్టులో స్థానం సుస్థిరం చేసుకున్న హిట్మ్యాన్ రోహిత్ శర్మ.. సుదీర్ఘ ఫార్మాట్కు సారథిగా ఎంపికయ్యాడు. సఫారీ గడ్డపై టీమ్ఇండియా పేలవ ప్రదర్శనతో భారత విజయవంతమైన కెప్టెన్ విరాట్ కోహ్లీ జట్టు పగ్గాలు వదిలేయగా.. వచ్చే నెలలో శ్రీలంకతో జరుగనున్న టెస్టు సిరీస్ కోసం సెలెక్షన్ కమిటీ రోహిత్ను నాయకుడిగా నియమించింది. ఇప్పటికే వన్డే, టీ20లకు కెప్టెన్గా వ్యవహరిస్తున్న హిట్మ్యాన్.. ఇకపై మూడు ఫార్మాట్లలో జట్టును ముందుకు నడిపించనున్నాడు.
న్యూఢిల్లీ: అంతా ఊహించినట్లే స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ.. భారత టెస్టు సారథిగా ఎంపికయ్యాడు. సఫారీ పర్యటన అనంతరం విరాట్ కోహ్లీ జట్టు పగ్గాలు వదిలేయగా.. శనివారం ఆల్ఇండియా సీనియర్ సెలెక్షన్ కమిటీ రోహిత్ను నాయకుడిగా నియమించింది. సుదీర్ఘ టెస్టు క్రికెట్ చరిత్రలో రోహిత్ శర్మ భారత 35వ సారథిగా సేవలందించనున్నాడు. సభ్యులంతా రోహిత్ను ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్లు సెలెక్షన్ కమిటీ చైర్మన్ చేతన్ శర్మ పేర్కొన్నాడు. మార్చి 4 నుంచి శ్రీలంకతో జరుగనున్న రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్తో పాటు టీ20 సిరీస్ కోసం సెలెక్షన్ కమిటీ జట్లను ప్రకటించింది. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, వికెట్ కీపర్ రిషబ్ పంత్తో పాటు పేస్ ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్కు పనిభారం కారణంగా పొట్టి ఫార్మాట్ నుంచి విరామం ఇచ్చిన సెలెక్టర్లు.. సీనియర్లు అజింక్యా రహానే, చతేశ్వర్ పుజారా, ఇషాంత్ శర్మ, వృద్ధిమాన్ సాహాను టెస్టు జట్టుకు ఎంపిక చేయలేదు. దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని యువ ఆటగాళ్లకు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలనుకుంటున్న బీసీసీఐ.. ఇందులో భాగంగానే కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, జస్ప్రీత్ బుమ్రాను భవిష్యత్తు కెప్టెన్లుగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నది. గాయాల కారణంగా కేఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్ రెండు సిరీస్లకూ దూరం కాగా.. కోలుకున్న ఆల్రౌండర్ రవీంద్ర జడేజాతో పాటు శుభ్మన్ గిల్ తిరిగి జట్టులోకి వచ్చారు. పంత్కు విశ్రాంతినివ్వడంతో పొట్టి సిరీస్ కోసం సంజూ శాంసన్ను ఎంపిక చేయగా.. ఉత్తర ప్రదేశ్కు చెందిన లెఫ్టార్మ్ స్పిన్నర్ సౌరభ్ కుమార్ తొలిసారి టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నాడు.
ఏకగ్రీవ ఎంపిక
మూడు ఫార్మాట్లలో చక్కటి ప్రదర్శన కనబరుస్తున్న రోహిత్శర్మను టెస్టు సారథిగా ఎంపిక చేసిన సెలక్టెర్లు.. కమిటీ ఏకగ్రీవంగా హిట్మ్యాన్కు ఓటేసినట్లు పేర్కొన్నారు. ‘ప్రస్తుతం భారత నంబర్వన్ క్రికెటర్ రోహిత్. మూడు ఫార్మాట్లలోనూ అతడు నిలకడ కనబరుస్తున్నాడు. ఫిట్నెస్ విషయంలోనూ ఎలాంటి సమస్యలు లేవు. దీంతో మరో ఆలోచన లేకుండా అతడినే సారథిగా ఎంపిక చేశాం’ అని సెలెక్షన్ కమిటీ చైర్మన్ చేతన్ శర్మ పేర్కొన్నాడు. యువ ఆటగాళ్లు అనుభవం గడించేందుకు వీలుగా రాహుల్, పంత్, బుమ్రాను వైస్ కెప్టెన్లుగా ఎంపిక చేస్తున్నట్లు ఆయన తెలిపాడు. వీరంతా సమయానుసారంగా రోహిత్తో కలిసి జట్టును ముందుకు నడుపుతారని పేర్కొన్నాడు.
దారులు మూసుకుపోలేదు
దశాబ్దానికి పైగా భారత టెస్టు జట్టులో కీలక సభ్యులుగా కొనసాగుతున్న చతేశ్వర్ పుజారా, అజింక్యా రహానేకు దారులు మూసుకుపోలేదని సెలెక్టర్లు పేర్కొన్నారు. లంకతో సిరీస్కు ముందే వారితో మాట్లాడినట్లు స్పష్టంచేశారు.‘సుదీర్ఘ చర్చల అనంతరం ఈ నిర్ణయానికి వచ్చాం. రహానే, పుజారాకు తలుపులు మూసుకుపోలేదు. వారు ప్రస్తుతం రంజీ ట్రోఫీలో పాల్గొంటున్నారు. భవిష్యత్తు సిరీస్లకు జట్టును ఎంపిక చేసే సమయంలో వారిని పరిగణనలో తీసుకుంటాం. హనుమ విహారి, శుభ్మన్ గిల్ను మిడిలార్డర్ కోసం సిద్ధం చేయాలనుకుంటున్నాం’ అని చేతన్ శర్మ వెల్లడించాడు. సీనియర్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా ఇక టెస్టు జట్టుకు ప్రాతినిధ్యం వహించడం కష్టంగానే కనిపిస్తున్నది. 39 ఏండ్ల సాహాను లంకతో సిరీస్కు ఎంపిక చేయని సెలెక్టర్లు.. ఆంధ్ర ఆటగాడు కేఎస్ భరత్ను పంత్కు రిజర్వ్గా నియమించారు. ఈ విషయం ముందే తెలియడంతో సాహా.. రంజీ ట్రోఫీలో పాల్గొనేందుకు కూడా ఆసక్తి చూపని విషయం తెలిసిందే.
లంకతో సిరీస్లకు..
టెస్టు జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), మయాంక్, ప్రియాంక్ పంచాల్, కోహ్లీ, శ్రేయస్, విహారి, గిల్, పంత్, భరత్, అశ్విన్, జడేజా, జయంత్, కుల్దీప్, బుమ్రా, షమీ, సిరాజ్, ఉమేశ్, సౌరభ్ కుమార్.
టీ20 జట్టు: రోహిత్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్ , వెంకటేశ్ అయ్యర్, దీపక్ హుడా, బుమ్రా, భువనేశ్వర్, హర్షల్, మహమ్మద్ సిరాజ్, సంజూ శాంసన్, చాహల్, కుల్దీప్, జడేజా, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్.