Ravichandran Ashwin : ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్లో(WTC Final 2023) సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin)ను ఆడించకపోవడం విమర్శలకు దారి తీసిన విషయం తెలిసిందే. అనుభవజ్ఞుడైన ఈ కుడిచేతివాటం స్పిన్నర్ ఉండి ఉంటే ఫలితం మరోలా ఉండేదని మాజీలు అభిప్రాయపడ్డారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో టెస్టు ఫార్మాట్లో నంబర్ 1 ఆల్రౌండర్ అయిన అశ్విన్ ఈ విషయంపై స్పందించాడు. స్వదేశంలో ఆస్ట్రేలియాతో సిరీస్ తర్వాత అశ్విన్ టెస్టులకు వీడ్కోలు పలకాలని అనుకున్నాడట. అదే తన ఆఖరి టెస్టు సిరీస్ అని తన భార్యతో చెప్పానని అతను తెలిపాడు.
‘గత ఏడాది బంగ్లాదేశ్తో టెస్టు సిరీస్ ముగించుకొని స్వదేశానికి వచ్చాక నా భార్య ప్రీతి నారాయణన్(Prithi Narayanan)తో ఇలా అన్నాను. ఆస్ట్రేలియాతో ఆడే టెస్టు సిరీస్ నేను ఆడబోయే చివరి సిరీస్ అని చెప్పాను’ అని అశ్విన్ వెల్లడించాడు. ఈ స్టార్ స్పిన్నర్ అలా చెప్పడం వెనక ఓ కారణం ఉంది. అతను కొంత కాలంగా మోకాలు(Knee Issues) సంబంధిత సమస్యలతో బాధపడుతున్నాడు.
బోర్డర్ – గావస్కర్ ట్రోఫీలో 25 వికెట్లు తీసిన అశ్విన్
‘బంగ్లాదేశ్తో రెండో టెస్టు సమయంలో మోకాలు నొప్పిగా అనిపించింది. బాగా వాచింది కూడా. దాంతో, నేను ఒక నిర్ణయానికి వచ్చాను. మోకాలిపై బాగా భారం పడుతోంది. అందకుని 2013 -14లో నా బౌలింగ్ యాక్షన్కే కట్టుబడి ఉండాలని అనుకున్నా’ అని ఈ లెజెండరీ స్పిన్నర్ వివరించాడు. ప్రస్తుతం టెస్టు ఆల్రౌండర్ల ర్యాంకింగ్స్లో 1,860 పాయింట్లతో అశ్విన్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
బౌలింగ్ ఆల్రౌండర్గా జట్టులోకి వచ్చిన అశ్విన్ టీమిండియాకు ఎన్నో విజయాలు అందించాడు. ముఖ్యంగా టెస్టుల్లో సంచలన ప్రదర్శనతో ప్రత్యర్థులను హడలెత్తించాడు. సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ – గావస్కర్ ట్రోఫీ(Border – Gavaskar Trophy)లో అశ్విన్ అద్భుతంగా రాణించాడు. నాలుగు టెస్టుల్లో 25 వికెట్లు తీసి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. రవీంద్ర జడేజాతో కలిసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును అందుకున్నాడు. అంతేకాదు టెస్టుల్లో అత్యధికంగా 32 సార్లు 5 వికెట్ల ప్రదర్శన చేసిన బౌలర్గా రికార్డు సృష్టించాడు.