కోల్కతా: భారత ఫుట్బాల్ దిగ్గజం సునీల్ ఛెత్రీకి చేదు అనుభవం ఎదురైంది. తన అద్భుత ఆటతీరుతో జాతీయ జట్టుతో పాటు పలు క్లబ్లకు లెక్కకు మిక్కిలి విజయాలు అందించిన ఛెత్రీ ఖాతాలో మరో టైటిల్ చేరింది. ఆసియాలో అతిపురాతన టోర్నీగా పేరొందిన డ్యురాండ్ కప్లో బెంగళూరు ఎఫ్సీ విజేతగా నిలిచింది. అన్నీతానై జట్టును ముందుండి నడిపిన ఛెత్రీ ..బెంగళూరుకు తొలిసారి టైటిల్ దక్కడంలో కీలక భూమిక పోషించాడు. ఆదివారం ముంబై సిటీ ఎఫ్సీతో జరిగిన మ్యాచ్లో బెంగళూరు 2-1తో విజయం సాధించింది. చిరస్మరణీయ సందర్భాన్ని ఆస్వాదిస్తూ ప్లేయర్లందరూ విజయోత్సవాల్లో మునిగిపోయారు.
ఇక్కడి వరకు బాగానే ఉంది. బహుమతి ప్రదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బెంగాల్ గవర్నర్ లా గణేశన్ అయ్యర్..ఛెత్రీ పట్ల దురుసుగా ప్రవర్తించాడు. కప్ అందుకుంటున్న సమయంలో ఛెత్రీని పక్కకు తోసేస్తూ ఫొటోలకు ఫోజిచ్చే ప్రయత్నం చేశాడు. ఇది వీడియోలో స్పష్టంగా కనిపించింది. దీనిపై పలువురు ప్లేయర్లతో పాటు క్రీడాభిమానుల..గవర్నర్ వైఖరిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ సోషల్మీడియాలో తమదైన శైలిలో విరుచుకుపడ్డారు. విజేత ఛెత్రీ కాదు గవర్నర్ గణేశన్ అంటూ సెటైర్లు వేశారు. ఇది ఇక్కడితో ఆగిపోలేదు బెంగళూరు జట్టుకే చెందిన శివశక్తి నారాయణన్ను బెంగాల్ క్రీడా మంత్రి ఆరూప్ బిశ్వాస్ పక్కకు తోసేస్తూ ఫొటో దిగే ప్రయత్నం చేశాడు. మొత్తంగా ప్రచార యావతో ప్లేయర్లను అగౌరవపర్చడంపై రాజకీయ నాయకుల వైఖరిని అందరూ తీవ్రంగా తప్పుబడుతున్నారు.