మొహాలీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 16వ సీజన్లో జరిగిన తొలి డబుల్ హెడర్ మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించింది. మొహాలీ వేదికగా.. పంజాబ్, కోల్కతా మధ్య జరిగిన మ్యాచ్కు వరుణుడు విచ్చేయడంతో డక్వర్త్ లూయిస్ పద్ధతిలో పంజాబ్ను విజేతగా ప్రకటించారు. మొదట పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. భానుక రాజపక్స (32 బంతుల్లో 50; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధశతకంతో ఆకట్టుకోగా.. కెప్టెన్ శిఖర్ ధవన్ (40; 6 ఫోర్లు) రాణించాడు.
ప్రభ్సిమ్రన్ సింగ్ (23), జితేశ్ శర్మ (21), సామ్ కరన్ (26 నాటౌట్), సికందర్ రజా (16) తలా కొన్ని పరుగులు చేశారు. కోల్కతా బౌలర్లలో టిమ్ సౌథీ రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో కోల్కతా 16 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 146 పరుగులతో నిలిచిన సమయంలో భారీ వర్షం పడింది. తిరిగి మ్యాచ్ కొనసాగే పరిస్థితి లేకపోవడంతో డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం విజేతను నిర్ణయించారు. 16 ఓవర్లలో కోల్కతా 154 పరుగులు చేయాల్సి ఉండగా.. ఆ జట్టు మరో 7 పరుగుల దూరంలో నిలిచిపోయింది. రస్సెల్ (19 బంతుల్లో 35; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. అర్ష్దీప్ సింగ్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ దక్కింది.
పంజాబ్: 191/5 (భానుక 50, ధవన్ 40; సౌథీ 2/54, ఉమేశ్ 1/27), కోల్కతా: లక్ష్యం (16 ఓవర్లలో 154) 146/7 (రస్సెల్ 35, వెంకటేశ్ 34; అర్ష్దీప్ 3/19, కరన్ 1/38).