IPL Auction 2024: మంగళవారం దుబాయ్ వేదికగా జరగాల్సి ఉన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వేలంలో పాల్గొనేందుకు గాను ఫ్రాంచైజీలతో కలిసిన ఆసీస్ దిగ్గజాలు రికీ పాంటింగ్, ట్రెవర్ బెలిస్లపై అక్కడి మీడియా దుమ్మెత్తిపోస్తున్నది. ఆ ఇద్దరికీ దేశం కంటే ఐపీఎలే ఎక్కువైందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. ఆస్ట్రేలియా స్వదేశంలో ప్రస్తుతం పాకిస్తాన్తో టెస్టు సిరీస్ ఆడుతుండగా మరోవైపు బిగ్బాష్ లీగ్ కూడా సాగుతోంది. పాంటింగ్.. టెస్టు సిరీస్లో కామెంటరీ బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉండగా వాటిని మధ్యలోనే వదిలి దుబాయ్ చేరాడు. బెలిస్ కూడా బిగ్ బాష్ లీగ్లో సిడ్నీ థండర్స్ కోచింగ్ డ్యూటీస్ వదిలేసి వేలంలో పాల్గొనేందుకు దుబాయ్కు వచ్చాడు.
పాంటింగ్ ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటిల్స్కు హెడ్ కోచ్గా వ్యవహరిస్తుండగా బెలిస్.. పంజాబ్కు కోచ్గా ఉన్నాడు. ఈ ఇద్దరూ రేపు తమ జట్ల తరఫున వేలంలో ప్రాతినిథ్యం వహించే అవకాశముంది. పాంటింగ్, బెలిస్లు దుబాయ్ చేరుకోవడంపై అక్కడి మీడియా స్పందిస్తూ.. ‘వాళ్లకు దేశం కంటే ఐపీఎలే ఎక్కువైంది’ అని కామెంట్స్ చేసింది.
ఇదే విషయమై ఆస్ట్రేలియా క్రికెటర్స్ అసోసియేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ టాడ్ గ్రీన్బర్గ్ స్పందిస్తూ.. ఇప్పటికే రెండు నెలల పాటు జరుగుతున్న ఐపీఎల్లో సెకండ్ విండో (సెప్టెంబర్లో నిర్వహించాలని ప్రతిపాదనలున్నాయి) నిర్వహిస్తే అది టీ20 క్రికెట్తో పాటు లీగ్లపైనా తీవ్రమైన ప్రభావం చూపే అవకాశమున్నదని ఆందోళన వ్యక్తం చేశాడు. స్థానికంగా జరిగే ద్వైపాక్షిక సిరీస్లను, లీగ్లను వదిలేసుకుని ఆస్ట్రేలియా ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బంది విదేశీ లీగ్లకు ప్రాతినిథ్యమివ్వడం ఆందోళనకమరని ఆసీస్ మాజీలు కొంతకాలంగా వాపోతున్నారు.