అంతర్జాతీయ క్రీడాకారులకు హైదరాబాద్ అడ్డాగా మారుతున్నది. సైనా నెహ్వాల్, సానియా మీర్జా, పీవీ సింధు లాంటి అత్యుత్తుమ ప్లేయర్లు దేశ క్రీడా చరిత్రలో తమకంటూ ఓ పేజీని లిఖించుకుంటే..ఇప్పుడు యువ ప్లేయర్లు వారి వారసత్వాన్ని పుణికిపుచ్చుకుంటున్నారు. పదేండ్ల ప్రాయంలో కుస్తీని కెరీర్గా ఎంచుకున్న హైదరాబాద్ యువ రెజ్లర్ నిఖిల్ యాదవ్.. బరిలోకి దిగిన తొలి అంతర్జాతీయ టోర్నీలోనే సత్తాచాటాడు. ప్రత్యర్థులను మట్టికరిపిస్తూ కంచు మోత మోగించాడు. మధ్య తరగతి కుటుంబానికి చెందిన తనకు ఆర్థికంగా మద్దతుగా నిలిస్తే మరిన్ని అద్భుతాలు సాధిస్తానని చెబుతున్న నిఖిల్పై ‘నమస్తే తెలంగాణ’ప్రత్యేక కథనం.
పహిల్వాన్లకు హైదరాబాద్ పాతబస్తీ పెట్టింది పేరు. బరిగీసి పోటీకి దిగారంటే… ప్రత్యర్థులు పరారే. ఉక్కునరాలతో కొండల్ని పిండి చేసే మన పహిల్వాన్లు అంటే ఒకరకంగా హడల్. అంతలా కుస్తీ మన హైదరాబాద్ సంస్కృతిలో భాగమైపోయింది. పౌష్టిక ఆహారం అంతకుమించిన కసరత్తులతో హైదరాబాద్ పహిల్వాన్లు దేశంలో ఎవరికీ తీసిపోరు అనడంలో అతిశయోక్తి లేదు.
ఇప్పుడు ఇదే కోవలో పురానాపూల్కు చెందిన 17 ఏండ్ల యువ రెజ్లర్ నిఖిల్ యాదవ్ అంతర్జాతీయ స్థాయిలో తళుక్కుమన్నాడు. తాజాగా రోమ్(ఇటలీ) వేదికగా జరిగిన అండర్-17 ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్షిప్లో ఈ పాతబస్తీ కుర్రాడు కాంస్య పతకంతో మెరిశాడు. 60కిలోల ఫ్రీైస్టెల్ విభాగంలో బరిలోకి దిగిన నిఖిల్ కాంస్యం ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటికే జాతీయస్థాయిలో లెక్కకు మిక్కిలి పతకాలు సాధించిన ఈ యువ రెజ్లర్కు తొలి అంతర్జాతీయ పతకం దక్కడం విశేషం.
తన ప్రదర్శనపై నిఖిల్ మాట్లాడుతూ ‘కాంస్యం గెలువడంపై చాలా సంతోషంగా ఉన్నాను. కెరీర్లో తొలి అంతర్జాతీయ టోర్నీలో పతకం గెలువడం మరిచిపోలేని అనుభూతి. విదేశీ రెజ్లర్లు టెక్నిక్ పరంగా మెరుగ్గా ఉండి తీవ్ర పోటీనిచ్చారు. కానీ దేశం తరఫున కచ్చితంగా పతకం గెలువాలన్న పట్టుదలతో చెలరేగి అనుకున్నది సాధించాను. కాంస్య పోరులో శాయశక్తులా పోరాడి పతకం ఖాతాలో వేసుకున్నాను’ అని అన్నాడు.
ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న తనకు ప్రభుత్వం అండగా నిలిస్తే..భవిష్యత్లో మరిన్ని విజయాలు సాధిస్తానని నిఖిల్ ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశాడు. రెజ్లర్ అయిన తన తండ్రి సురేశ్ యాదవ్ను స్ఫూర్తిగా తీసుకోని కెరీర్ ఎంచుకున్నానని నిఖిల్ చెప్పుకొచ్చాడు. చిన్నప్పటి నుంచి తండ్రి చూస్తూ పెరిగిన తనకు రెజ్లింగ్తో విడదీయలేని అనుబంధం ఉందని గుర్తుచేసుకున్నాడు.
పదేండ్ల వయసు నుంచే రెజ్లింగ్ మొదలుపెట్టాను. ఓవైపు చదువుతూనే పోటీల్లో పాల్గొనేవాడిని. దిగ్గజ రెజ్లర్ సుశీల్కుమార్ స్ఫూర్తిగా తీసుకున్న తాను మెరుగైన శిక్షణ కోసం ఢిల్లీలోని ఛత్రసాల్ స్టేడియంలో మెళకువలు నేర్చుకున్నాను. సుశీల్ మార్గదర్శకత్వంలో వరుసగా రెండుసార్లు జాతీయ స్కూల్ గేమ్స్లో పసిడి పతకాలు సొంతం చేసుకున్నాను.
ఇదిలా ఉంటే గత నాలుగేండ్ల నుంచి వేర్వేరు టోర్నీల్లో తెలంగాణ తరఫున ప్రాతినిధ్యం వహించి పతకాలు కొల్లగొట్టాడు. అయితే మధ్య తరగతి కుటుంబానికి చెందిన తాను రాష్ట్ర ఖ్యాతిని మరింత ఇనుమడింపజేసేందుకు సిద్ధంగా ఉన్నానని నిఖిల్ పేర్కొన్నాడు. పాలు అమ్మడం ద్వారా తన తండ్రి కుటుంబాన్ని పోషిస్తున్నాడని వివరించాడు.