Namibia: వచ్చే ఏడాది అమెరికా, వెస్టిండీస్ వేదికగా జరుగబోయే ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్కు ఆఫ్రికా దేశం నమీబియా అర్హత సాధించింది. నమీబియా రాజధాని విండ్హోక్ వేదికగా జరుగుతున్న ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ ఆఫ్రికా రీజియన్ క్వాలిఫయర్స్ పోటీలలో భాగంగా ఆడిన ఐదు మ్యాచ్లకు గాను ఐదింటినీ గెలిచిన నమీబియా.. వరల్డ్ కప్ బెర్త్ను ఖాయం చేసుకుంది. మంగళవారం టాంజానియాతో జరిగిన మ్యాచ్లో 58 పరుగుల తేడాతో ఘన విజయం సాధించడంతో నమీబియా వరల్డ్ కప్కు అర్హత సాధించింది.
టాంజానియాతో జరిగిన మ్యాచ్లో టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన నమీబియా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసింది. స్మిత్.. 25 బంతుల్లో ఒక ఫోర్, నాలుగు సిక్సర్ల సాయంతో 40 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు. అనంతరం టాంజానియా.. 20 ఓవర్లు ఆడినా ఆరు వికెట్లు కోల్పోయి 99 పరుగులే చేయగలిగింది.
𝑸𝑼𝑨𝑳𝑰𝑭𝑰𝑬𝑫 👍
Namibia have booked their berth for Men’s #T20WorldCup 2024 👏https://t.co/2VxDgDrCWJ
— ICC (@ICC) November 28, 2023
రెండో జట్టు ఏది..?
ఏడు దేశాలు తలపడుతున్న ఈ టోర్నీలో పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాలలో నిలిచిన జట్లు వరల్డ్ కప్కు అర్హత సాధిస్తాయి. ఐదు మ్యాచ్లలో ఐదు గెలిచిన నమీబియా.. పది పాయింట్లు సాధించిన ఆ జట్టు మరో మ్యాచ్ కూడా ఆడాల్సి ఉంది. రెండో స్థానం కోసం ఉగాండా, కెన్యాల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఉగాండా, కెన్యాలు తలా నాలుగు మ్యాచ్లు ఆడి మూడు గెలిచి ఆరు పాయింట్లతో రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. ఈ జట్లు మరో రెండు మ్యాచ్లు ఆడాల్సి ఉండటంతో మెరుగైన ప్రదర్శన చేసిన జట్టు అత్యధిక పాయింట్లతో క్వాలిఫై అయ్యే ఛాన్సుంది. నాలుగో స్థానంలో ఉన్న జింబాబ్వే.. నాలుగు మ్యాచ్లు ఆడి రెండు మాత్రమే గెలిచి నాలుగు పాయింట్లతో ఉంది. ఆ జట్టు కూడా రెండు మ్యాచ్లో ఆడాల్సి ఉండగా రెండు గెలిచినా ఆ జట్టు ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. కాగా టీ20 వరల్డ్ కప్కు క్వాలిఫై అవడం నమీబియాకు వరుసగా ఇది మూడోసారి. 2021తో పాటు గతేడాది కూడా ఆ జట్టు పొట్టి ప్రపంచకప్ ఆడింది.