హైదరాబాద్, ఆట ప్రతినిధి: జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ జట్టు చీఫ్ కోచ్గా రాష్ర్టానికి చెందిన నాగపురి రమేశ్ నియమితుడయ్యాడు. గత కొన్నేండ్లుగా జాతీయ స్థాయిలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రమేశ్ ఇక నుంచి జాతీయ జూనియర్ జట్టును తీర్చిదిద్దనున్నాడు. ఇటీవల కొరియా వేదికగా జరిగిన ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో భారత్ మెరుగైన ప్రదర్శన కనబర్చడంలో రమేశ్ కీలకంగా వ్యవహరించాడు.
ప్రస్తుతం సీనియర్ అథ్లెటిక్స్ కోచ్గా వ్యవహరిస్తున్న ఈ వరంగల్ వాసి..కమల్అలీఖాన్ స్థానంలో జూనియర్ అథ్లెటిక్స్ టీమ్ ప్రధాన కోచ్గా బాధ్యతలు స్వీకరించనున్నాడు. తన సుదీర్ఘ కోచింగ్ ప్రయాణంలో రమేశ్ ఎంతో మంది అథ్లెట్లను తీర్చిదిద్దాడు. వీరిలో ద్యుతీచంద్, సత్తిగీత, పూవమ్మ, దీప్తి లాంటి మెరికల్లాంటి అథ్లెట్లు ఉన్నారు. 1999లో కోచ్గా కెరీర్గా ప్రారంభించిన రమేశ్ అంచలంచెలుగా ఎదిగాడు. ఆయన ప్రతిభను గుర్తించిన కేంద్రం 2016లో ద్రోణాచార్య అవార్డుతో సత్కరించింది. ఈ ఘనత సాధించిన తొలి తెలంగాణ వాసిగా రమేశ్ అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు.