MI vs RCB : మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) 19వ మ్యాచ్లోముంబై ఇండియన్స్(Mumbai Indians), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(Royal Challegers Bangalore)ను చిత్తు చేసింది. నాలుగు వికెట్ల తేడాతో ఆర్సీబీని ఓడించింది. దాంతో ముంబై పాయిట్ల పట్టికలో మళ్లీ అగ్రస్థానానికి చేరింది. అయితే.. ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) కంటే నెట్రన్ రేటు తక్కువ ఉండడంతో నేరుగా ఫైనల్ చేరలేదు. 11.3 ఓవర్లలో ఆ జట్టు మ్యాచ్ ముగించి ఉంటే ఢిల్లీని వెనక్కి నెట్టి ఫైనల్ చేరేది. కానీ ఆర్సీబీ బౌలర్లు వెంట వెంటనే వికెట్లు తీయడంతో ముంబై బ్యాటర్లు ఆచితూచి ఆడారు. కేవలం రెండు మ్యాచ్లే గెలిచిన ఆర్సీబీ ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించింది.
డబ్ల్యూపీఎల్లో ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొడుతున్న ముంబై ఇండియన్స్ మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. వరుసగా రెండు ఓటములు ఎదురైనా కూడా ఆ జట్టు ఆర్సీబీపై సత్తా చాటింది. బౌలర్లు చెలరేగడంతో ఆర్సీబీని 125 పరుగులకే కట్టడి చేసింది. ఆతర్వాత 16.4వ ఓవర్లో టార్గెట్ను ఛేదించింది. ఓపెనర్లు యస్తిక భాటియా(30), హేలీ మాథ్యూస్(24), అమేలియా కేర్ (31), పూజా వస్త్రాకర్ (19) రాణించారు.
16.4వ ఓవర్లో అమేలియా బౌండరీ కొట్టడంతో విజయానికి రెండు పరుగులు అవసరమయ్యాయి. అయితే.. మంధాన వైడ్ వేయడంతో బౌండరీ వచ్చింది. దాంతో, ముంబై నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆర్సీబీ బౌలర్లలో కనికా ఆహుజా రెండు వికెట్లు తీసింది. శ్రేయాంక పాటిల్, మేగన్ షట్, అలిసే పెర్రీ, ఆశా శోభన తలా ఒక వికెట్ పడగొట్టారు. బ్యాటింగ్, బౌలింగ్లో రాణించిన అమేలియా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా ఎంపికైంది.
స్వల్ప లక్ష్య ఛేదనలో ముంబై ఇండియన్స్కు ఓపెనర్లు యస్తిక భాటియా(30), హేలీ మాథ్యూస్(24) శుభారంభం ఇచ్చారు. అలిసా పెర్రీ వేసిన ఐదో ఓవర్లో యస్తిక మూడు బౌండరీలు కొట్టింది. దాంతో స్కోర్ బోర్డు వేగం అందుకుంది. 53 పరుగుల వద్ద యస్తిక ఔట్ కావడంతో ఆ జట్టు తొలి వికెట్ పడింది. మరో 20 పరుగుల వ్యవధిలో ముంబై నాలుగు వికెట్లు కోల్పోయింది. నాట్ సీవర్ బ్రంట్(13) విఫలమైంది. అలిసా పెర్రీ ఓవర్లో హర్మన్ప్రీత్ కౌర్(2) బౌల్డ్ అయింది. దాంతో, 74 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. అప్పటికీ ముంబై విజయానికి 52 రన్స్ కావాలి. కష్టాల్లో పడిన ముంబైని అమేలియా కేర్ (31), పూజా వస్త్రాకర్ (19) ఆదుకున్నారు. వీళ్లిద్దరు ఐదో వికెట్కు 47 రన్స్ జోడించారు. 120 స్కోర్ వద్ద పూజ ఔటయ్యింది. అయితే.. అప్పటికే ముంబై విజయం ఖాయమైంది. అమేలియా నాటౌట్గా నిలిచి జట్టును గెలిపించింది.
మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 9 వికెట్ల నష్టానికి 125 రన్స్ చేసింది. ఆ జట్టుకు తొలి ఓవర్లోనే షాక్ తగిలింది. గత మ్యాచ్లో అర్ధ శతకంతో చెలరేగిన ఓపెనర్ సోఫీ డెవినే (0) ఖాతా తెరవకుండానే రనౌట్ అయింది. ఆ తర్వాత నిదానంగా ఆడిన మంధాన (24) భారీ స్కోర్ చేయలేకపోయింది. ఆమె 33 పరుగుల వద్ద ఔట్ కావడంతో ఆర్సీబీ వికెట్ల పతనం మొదలైంది. హీథర్ నైట్(12)ను అమేలియా కేర్ ఔట్ చేసింది. అలిసా పెర్రీతో కలిసి ధాటిగా ఆడుతున్న కనికా ఆహుజా(12)ను యస్తిక స్టంపౌట్ చేసింది. ఆఖర్లో రీచా ఘోష్(29), అలిసా పెర్రీ (29) రాణించడంతో ఆర్సీబీ ఆమాత్రం స్కోర్ చేయగలిగింది. ముంబై బౌలర్లలో అమేలియా కేర్ మూడు వికెట్లు పడగొట్టింది. నాట్ సీవర్ బ్రంట్, ఇసీ వాంగ్ చెరో రెండు వికెట్లు తీశారు. సైకా ఇషాక్కు ఒక వికెట్ దక్కింది.