ICC : ఈ ఏడాది టీ20 క్రికెట్లో అద్భుత ఫామ్ కొనసాగించిన ఆటగాళ్లను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) పురస్కారంతో గౌరవించనుంది. తాజాగా మెన్స్ 2022 టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు నామినేట్ ఆటగాళ్ల జాబితాను ఐసీసీ గురువారం ప్రకటించింది. అవార్డు రేసులో నలుగురు ఆటగాళ్లు ఉన్నారు. ఈ జాబితాలో టీమిండియా నయా సంచలనం సూర్యకుమార్ కూడా చోటు సంపాదించాడు. ఇంగ్లండ్ యువ ఆల్రౌండర్ సామ్ కరన్, పాకిస్థాన్ ఓపెనర్ మొహమ్మద్ రిజ్వాన్, జింబాబ్వే ఆల్రౌండర్ సికిందర్ రజా ఈ అవార్డు కోసం పోటీపడుతున్నారు.
టీ20 వరల్డ్ కప్లో ఈ నలుగురు ప్లేయర్స్ తమ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించారు. ఈ ఏడాది టీ 20ల్లో సూర్యకుమార్ అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచాడు. అతను 187.43 స్ట్రైక్ రేటుతో 1,164 పరుగులు చేశాడు. అంతేకాదు పొట్టి క్రికెట్లో సూర్య అత్యధికంగా 68 సిక్స్లు కొట్టాడు. భీకర ఫామ్ కొనసాగించిన అతను రిజ్వాన్ను వెనక్కి నెట్టి వరల్డ్ నంబర్ 1 ర్యాంకు సొంతం చేసుకున్నాడు. న్యూజిలాండ్ సిరీస్లోనూ సూర్య చెలరేగి ఆడి కెరీర్లో రెండో టీ 20 సెంచరీ నమోదు చేశాడు. పొట్టి వరల్డ్ కప్లో అదరగొట్టిన సామ్ కరన్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా ఎంపికయ్యాడు. ఉత్తమ ఫామ్లో ఉన్న అతడు ఐపీఎల్ 2023 మినీ వేలంలో రికార్డు ధరకు అమ్ముడుపోయాడు. పంజాబ్ కింగ్స్ అతడిని రూ.18.50 కోట్లకు దక్కించుకుంది.