Luiz Gustavo : పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో మైదానంలోకి దిగితే చాలు గెలుపుపై ధీమాగా ఉంటారంతా. కానీ, సౌదీ అరేబియా ఆల్ నస్రీ క్లబ్ మిడ్ఫీల్డర్ లూయిజ్ గుత్సవో మాత్రం అతడి రాకతో తమకు మ్యాచ్లు గెలవడం కష్టమవుతోదని సంచలన వ్యాఖ్యలు చేశాడు. అందుకు కారణం ఏంటో కూడా అతను చెప్పుకొచ్చాడు. ‘రొనాల్లో మా క్లబ్లో చేరినప్పటి నుంచి మాకు మ్యాచ్లు గెలవడం కష్టంగా మారింది. ఎందుకంటే.. అతను ఉన్నందున మ్యాచ్ గెలిచేందుకు ప్రత్యర్థి జట్లు రెండొందల శాతం ప్రయత్నిస్తున్నాయి. అన్ని జట్లు రొనాల్డోతో తలపడేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. అంతేకాదు ఉత్తమ ప్రదర్శన చేసేందుకు ఆరాటపడుతున్నాయి’ అని గుత్సవో వెల్లడించాడు.
అతడిని చూసి నేర్చుకుంటాం
అంతేకాదు రొనాల్డో తమ క్లబ్కు ఆడడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని అతను చెప్పాడు.. ‘ఫిజికల్గా, టెక్నికల్గా గొప్ప నైపుణ్యం ఉన్న రొనాల్డోను చూసి ప్రతి రోజు మేము నేర్చుకుంటాం. అతను సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటాడు. ప్రతి ఛాలెంజ్లోనూ సక్సెస్ అవుతాడు’ అని ఈ మిడ్ఫీల్డర్ తెలిపాడు.
చివరి నిమిషంలో గోల్
ఆల్ నస్రీ క్లబ్ ఈమధ్యే రొనాల్డోతో భారీ ధరకు ఒప్పందం కుదుర్చుకుంది. రెండున్నరేళ్ల కాలానికి అతనికి రూ. 4400 కోట్లు ముట్టజెప్పనుంది. ఈ స్టార్ ఆటగాడు తమ క్లబ్ రాత మారుస్తాడని అంతా అనుకున్నారు. కానీ, రొనాల్డో మాత్రం తొలి మ్యాచ్లోనే గోల్ చేయకుండా నిరాశ పరిచాడు. ఎట్టకేలకు సౌదీ ప్రో లీగ్లో అల్ హితేహ్ క్లబ్తో శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్లో రొనాల్డో చివరి నిమిషంలో గోల్ చేశాడు. దాంతో, మ్యాచ్ 2-2తో డ్రాగా ముగిసింది. విశేషం ఏంటంటే.. ఆల్ నస్రీ క్లబ్ తరఫున రొనాల్డో చేసిన మొదటి గోల్ ఇదే. తర్వాతి మ్యాచుల్లోనూ అతను ఫామ్ కొనసాగించాలని అల్ నస్రీ క్లబ్ యాజమాన్యంతో పాటు అభిమానులు కోరుకుంటున్నారు.