Lionel Messi : అంతర్జాతీయ ఫుట్బాల్కు అర్జెంటీనా స్టార్ లియోనల్ మెస్సీ(Lionel Messi) వీడ్కోలు పలికాడు. దాదాపు రెండు దశాబ్దాలుగా సాకర్లో అద్భుతాలు చేసిన ఈ లెజెండరీ ఆటగాడు.. సోమవారం అల్విదా చెప్పేశాడు. ఫిఫా వరల్డ్కప్ ఫైనల్లో ఓటమి తర్వాత రిటైర్మెంట్పై ఆలోచించిన మెస్సీ.. తండ్రి జార్జ్ మెస్సీ కోసం తన నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నాడట. ఈ విషయాన్ని వీడ్కోలు అనంతరం స్వయంగా వెల్లడించాడీ వెటరన్.
ప్రపంచంలోని ఫుట్బాల్ అభిమానులను షాక్కు గురి చేస్తూ రిటైర్మెంట్ ప్రకటించాడు లియోనల్ మెస్సీ. ఇన్స్టాగ్రామ్లో మూడు పేజీల లేఖలు పోస్ట్ చేసి.. తాను అర్జెంటీనా ఫుట్బాల్ నుంచి వైదొలుగుతున్నుట్టు వెల్లడించాడీ దిగ్గజం. నిజానికి జులై 19న ఫిఫా ఫైనల్లో స్పెయిన్ చేతిలో ఓటమి అనంతరం తాను వీడ్కోలు లేఖ రాసి పెట్టుకున్నానని, అయితే.. తండ్రి ఆరోగ్యం బాగో లేనందున నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నానని చెప్పాడు మెస్సీ.
‘రిటైర్మెంట్ లేఖను జూలై 21వ తేదీన..ఫైనల్ తర్వాత రెండు రోజులకు రాశాను. మానాన్న హఠాన్మరణంతో నేను రిటైర్మెంట్కు పలకడానికి సమయం వచ్చినందనుకున్నా’ అని మెస్సీ తెలిపాడు. గత కొన్ని ఏళ్లుగా అనారోగ్యంతో బాధపడిన జార్జ్ మెస్సీ ఆగస్టు 8వ తేదీన మరణించాడు. తండ్రి మరణానంతరం ఇంటర్ మియామి తరఫున బరిలోకి దిగిన మెస్సీ.. ఒకే మ్యాచ్లో నాలుగు గోల్స్తో మెరిశాడు. అయితే.. అర్జెంటీనా ఫుట్బాల్కు రిటైర్మెంట్ పలకాల్సిన టైమ్ వచ్చిందనుకున్ను అతడు.. తాను రాసుకున్న లేఖలను సోమవారం ఇన్స్టాలో పంచుకున్నాడు. 2006లో అర్జెంటీనా జాతీయ జట్టుకు ఎంపికైన మెస్సీ.. ఈ ఇరవై ఏళ్లలో 207 మ్యాచుల్లో 125 గోల్స్ సాధించాడు.
‘అర్జెంటీనా ఫుట్బాల్ కోసం నేను సర్వం ధారపోశాను. గత కొన్ని ఏళ్లు సాధిస్తున్న విజయాలకు ముందు నుంచీ నేను ఎంతో చేశా. అర్జెంటీనా అభిమానులుగా మీరు సంతోషపడేందుకు, గర్వపడేందుకు తెలుపు, నీలం రంగు జెర్సీకోసం నేను ఎంతో పోరాడాను. అయితే.. ఇప్పుడు మరింత సమయం లేదు. విభిన్నమైన అధ్యాయాలు ముగియనున్నాయి. ఈ విషయం నన్ను చాలా బాధిస్తోంది. జాతీయ జట్టుకు ఆడడాన్ని నేను ఎంతో ఇష్టపడ్డాను. ఎల్లప్పుడూ ఇష్టపడతాను కూడా. ప్రతిభావంతులైన యువ ఆటగాళ్లు నా స్థానంలో రాబోతున్నారు’అని పేర్కొన్న మెస్సీ.. ఇకపై క్లబ్స్ తరఫున మైదానంలో ఫ్యాన్స్ను అలరించనున్నాడు.ప్రస్తుతానికి ఇంటర్ మియామికి ఆడుతున్న మెస్సీ తనను ఎంతో ప్రేమించి, మద్దతుగా నిలిచిన అర్జెంటీనా అభిమానులకు ధన్యవాదాలు తెలిపాడు.