టీమిండియా కెప్టెన్లు కోహ్లీ, రోహిత్ మధ్య వైరం ఉందా? అంటే అవును గట్టిగా చెప్పలేకపోయినా ఉందనే వాదనలు మాత్రం బోలెడు వినిపిస్తాయి. మరికొన్ని రోజుల్లో ప్రారంభమయ్యే సౌతాఫ్రికా టూర్కు ముందు వన్డే కెప్టెన్సీ నుంచి కోహ్లీని తప్పించిన బీసీసీఐ.. ఈ బాధ్యతలను రోహిత్కు అప్పగించడంతో ఈ వైరం మరింత ముదిరినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే హెచ్సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్ చేసిన ట్వీట్ కూడా ఈ విషయంపై చర్చకు దారితీసింది. ముంబైలో ప్రాక్టీస్ సందర్భంగా గాయపడిన వన్డే కెప్టెన్ రోహిత్.. సౌతాఫ్రికాలో టెస్టులకు దూరమయ్యాడు. ఇప్పుడు తన గారాలపట్టి వామిక తొలి పుట్టినరోజు జరుపుకోవడం కోసం వన్డేలు ఆడకుండా సెలవు తీసుకోవాలని కోహ్లీ నిర్ణయించుకున్నట్లు వార్తలొచ్చాయి.
దీంతో రోహిత్ కెప్టెన్సీలో ఆడే తొలి వన్డే సిరీస్కు కోహ్లీ దూరమవనున్నాడనేది ఆ వార్తల సారాంశం. దీని గురించే అజారుద్దీన్ ట్వీట్ చేశాడు. ‘ఆట నుంచి సెలవు తీసుకోవడం తప్పేమీ కాదు. కానీ టైమింగ్ చాలా ముఖ్యం. ఇప్పుడు వస్తున్న వైరం వాదనలకు ఇది మరింత బలం చేకూరుస్తుంది. ఎవరూ కూడా ఏ ఫార్మాట్ను వదులుకోరు కదా’ అని ట్వీట్ చేశాడు. దీనిపై క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ను మీడియా ప్రశ్నించింది.
ఈ వివాదంపై స్పందించిన ఠాకూర్.. ‘ఆట అనేది అత్యున్నతమైనది. దీనికన్నా ఎవరూ గొప్పవాళ్లు కాదు. అయితే ఏ ఆటగాళ్ల మధ్య ఏం జరుగుతోంది? అనే విషయాలను నేను చెప్పలేను. ఇది సంబంధిత అసోసియేషన్లు, ఫెడరేషన్ల బాధ్యత. వాళ్లే ఈ వివరాలు వెల్లడిస్తే బాగుంటుంది’ అన్నారు. కాగా, ఈ ఇద్దరు ఆటగాళ్లూ కలిసి ఆడకపోతే భారత క్రికెట్ దెబ్బతింటుందని మాజీ ఆటగాడు కీర్తి ఆజాద్ తాజాగా ఆందోళన వ్యక్తం చేశారు.