ఇంగ్లండ్ తో మంగళవారం ముగిసిన తొలి వన్డేలో భాగంగా టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా.. ఆతిథ్య జట్టు బ్యాటర్లకు పట్టపగలే చుక్కలు చూపించాడు. ఈ మ్యాచ్ లో బుమ్రా.. ఆరు వికెట్లు తీసి తన కెరీర్ లో అత్యుత్తమ గణాంకాలను నమోదు చేసుకున్నాడు. బుమ్రా దాటికి ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్లు.. జేసన్ రాయ్, జో రూట్, బెన్ స్టోక్స్ లు ఖాతా కూడా తెరవలేదు. వీరేగాక జానీ బెయిర్ స్టో, డేవిడ్ విల్లే, బ్రైడన్ కార్స్ లు కూడా బుమ్రా దాటికి పెవిలియన్ కు చేరారు.
గ్రౌండ్ లో ఇంగ్లండ్ బ్యాటర్లను భర్త రఫ్ఫాడిస్తే.. మైదానం వెలుపల అతడి భార్య సంజనా గణేషన్ ఇంగ్లీష్ ఆటగాళ్లతో పాటు అభిమానులను కూడా ఆటాడుకుంది. భర్తతో కలిసి ఇంగ్లాండ్ లోనే ఉన్న సంజనా.. మ్యాచ్ ప్రజెంటర్ గా విధులు నిర్వర్తిస్తోంది.
ఈ సందర్భంగా మ్యాచ్ జరుగుతుండగానే ఆమె గ్రౌండ్ లోపల ఉన్న ఓ ఫుడ్ ఏరియా షాప్ నకు వెళ్లి.. ‘ఇది బిజీ ఏరియా. వాస్తవానికి ఇక్కడ ఇంగ్లండ్ అభిమానులే ఎక్కువగా కనిపిస్తున్నారు. వాళ్లకు మ్యాచ్ చూడటం ఇష్టం లేదేమో. ఇక్కడ పైస్, హాట్ డాగ్స్, నార్మల్ మ్యాచ్ డే ఫుడ్ చాలా రకాలుగా అందుబాటులో ఉంది. ఇంగ్లండ్ బ్యాటర్లు రావడానికి ఇష్టపడని స్టాల్ కు మేం వచ్చాం. దీని పేరు క్రిస్పీ డక్..
ఇప్పుడు మైదానం వెలుపల డక్స్ ఎలా ఉంటాయో మనం చూడబోతున్నాం. ఎందుకంటే మైదానంలో డక్స్ అద్భుతంగా ఉన్నాయి కదా..’ అని వ్యాఖ్యానించింది. ఆమె ఈ వీడియో చేసే సమయానికే బుమ్రా తన తొలి స్పెల్ లో నాలుగు వికెట్లు తీసుకున్నాడు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైలర్ గా మారింది. కాగా ఇంగ్లీష్ బ్యాటర్లు డకౌట్ అవడాన్ని నేపథ్యంగా తీసుకుని సంజనా ఈ వీడియోలో ఆ జట్టును ట్రోలింగ్ చేసిందని వీడియోను చూసిన అభిమానులు అంటున్నారు. ట్రోలింగ్ కు ఇది నెక్స్ట్ లెవల్ అని కామెంట్ చేస్తున్నారు.
Sanjana trolling England and how 🤣 #engvind
pic.twitter.com/GPSy4URBv2— Mon (@4sacinom) July 12, 2022