కోల్కతా: తొలి టీ20 ప్రపంచకప్ ఆడుతున్న యూరోపియన్ దేశం ఇటలీ.. తమ ఫుట్బాల్ ప్రత్యర్థి ఇంగ్లండ్ను ఓడించినంత పనిచేసినా పోరాడి ఓడింది. గ్రూప్-సీలో భాగంగా సోమవారం ఈడెన్ గార్డెన్స్లో జరిగిన తమ ఆఖరి లీగ్ మ్యాచ్లో బ్యాట్తో రాణించిన ఇంగ్లిష్ జట్టు.. 20 ఓవర్లకు 7 వికెట్లు కోల్పోయి 202 రన్స్ చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ విల్ జాక్స్ (22 బంతుల్లో 53 నాటౌట్, 3 ఫోర్లు, 4 సిక్స్లు), టామ్ బ్యాంటన్ (30) రాణించారు.
కలుగమగె (2/41), స్టీవార్ట్ (2/51) తలా రెండు వికెట్లు తీశారు. రికార్డు ఛేదనలో 22 పరుగులకే 3 కీలక వికెట్లు పడిపోయిన ఇటలీ.. బెన్ మనెంటి (25 బంతుల్లో 60, 4 ఫోర్లు, 6 సిక్స్లు), జస్టిన్ మోస్కా (34 బంతుల్లో 43) ఎదురుదాడికి దిగడంతో గెలుపు రేసులోకి వచ్చింది.
ఈ ద్వయం నాలుగో వికెట్కు 48 బంతుల్లోనే 92 రన్స్ జోడించింది. అయితే 12వ ఓవర్లో జాక్స్.. మనెంటిని ఔట్ చేసి ఆ జట్టుకు షాకిచ్చాడు. అతడి స్థానంలో క్రీజులోకి వచ్చిన స్టీవార్ట్ (23 బంతుల్లో 45, 2 ఫోర్లు, 5 సిక్స్లు) వీరవిహారంతో ఇటలీలో మళ్లీ గెలుపు ఆశలు చిగురించాయి.
కానీ మూడు పరుగుల వ్యవధిలో 3 కీలక వికెట్లు కోల్పోయిన ఆ జట్టు 20 ఓవర్లలో 178 వద్దే ఆగిపోయింది. ఈ ఓటమితో గ్రూప్-సీ నుంచి విండీస్, ఇంగ్లండ్ సూపర్-8 బెర్తులు ఖాయం చేసుకోగా స్కాట్లాండ్, ఇటలీ, నేపాల్ టోర్నీ నుంచి నిష్క్రమించాయి.