Irfan Pathan : ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ను భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కచ్చితంగా ఇబ్బంది పెడతాడని మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ అన్నాడు. గత రికార్డులు పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుందని అతను తెలిపాడు. ‘గత రికార్డులు చూడండి. అశ్విన్ సాధించిన దాదాపు 50 శాతం వికెట్లు ఎడమచేతి వాటం బ్యాటర్లవే’ అని ఇర్ఫాన్ వెల్లడించాడు. ఆసీస్పై ఈ స్పిన్నర్కు మంచి రికార్డు ఉంది. 18 టెస్టుల్లో 89 వికెట్లు తీశాడు. దాంతో, ఈసారి కూడా అతను చెలరేగితే పర్యాటక జట్టకు కష్టకాలమే. కానీ, స్వదేశంలో బాక్సింగ్ డే టెస్టులో వార్నర్ వీరవిహారం చేశాడు. వందో టెస్టులో ఏకంగా డబుల్ సెంచరీ బాదాడు. అంతేకాదు స్టీవ్ స్మిత్ కూడా సూపర్ ఫామ్లో ఉన్నాడు. ఆసీస్ టాపార్డర్ను అశ్విన్ ఎలా దెబ్బకొడతాడనేది చూడాలి.
పంత్, బుమ్రా లేకుండానే
మరో నాలుగు రోజుల్లో బోర్డర్- గవాస్కర్ ట్రోఫీ ప్రారంభం కానుంది. నాగ్పూర్ వేదికగా తొలి టెస్టు ఫిబ్రవరి 9న జరుగుతుంది. రెండు ప్రపంచస్థాయి జట్ల మధ్య పోరు ఎంతో ఆసక్తికరంగా ఉండనుంది. గతంలో జరిగిన 2014, 2017, 2022 సిరీస్లలో భారత్, ఆసీస్ను చిత్తు చేసింది. అయితే.. ఈసారి టీమిండియాకు కీలకమైన రిషభ్ పంత్ అందుబాటులో లేడు. స్టార్ పేసర్ బుమ్రా కూడా మొదటి రెండు టెస్టులకు దూరమయ్యాడు. తొలి రెండు టెస్టుల్లో భారత్ వీళ్లిద్దరు లేకుండానే బరిలోకి దిగనుంది. అయితే.. సిరాజ్, షమీ, ఉమేశ్ యాదవ్, ఉనాద్కత్ రూపంలో బౌలింగ్ విభాగం పటిష్టంగా కనిపిస్తోంది.
వీళ్లు రాణిస్తే..
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, కేఎల్ రాహుల్, పూజారా బ్యాటింగ్లో రాణిస్తే ఇక భారత్కు తిరుగుండదు. ఈమధ్యే స్వదేశంలో శ్రీలంక, న్యూజిలాండ్పై టీ20, వన్డే సిరీస్ గెలిచిన భారత్ పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంది. టీమిండియా ఆటగాళ్లు అదే జోరు కొనసాగిస్తే టెస్ట్ సిరీస్ గెలిచే అవకాశం ఉంది.