దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో వచ్చే ఏడాది చేరబోయే రెండు కొత్త జట్లు ఏవో తెలిసిపోయింది. మొత్తం ఆరు పట్టణాలతో ఐపీఎల్ యాజమాన్యం జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే. వీటిలో రెండు సిటీల నుంచి కొత్త జట్లు ఉంటాయని అప్పుడే వెల్లడించింది. సోమవారం నాడు ఈ టెండర్ల ప్రక్రియ పూర్తయింది. మొత్తం పది కంపెనీలు టెండర్లు వేశాయి.
వీటి ఫలితాలను ఐపీఎల్ యాజమాన్యం వెల్లడించింది. వచ్చే ఏడాది నుంచి అహ్మదాబాద్, లక్నో జట్లు కూడా ఐపీఎల్ పోరులో తలపడనున్నాయి. అహ్మదాబాద్ ఫ్రాంచైజీని సీవీసీ క్యాపిటల్స్ పార్టనర్స్, లక్నో జట్టును ఆర్పీఎస్జీ గ్రూప్ దక్కించుకున్నాయి. ఈ జట్ల చేరికతో వచ్చే ఏడాది నుంచి ఐపీఎల్లో తలపడే జట్ల సంఖ్య పదికి చేరనుంది.
లక్నో జట్టు కోసం సంజీవ్ గోయెంకా ఏకంగా రూ.7 వేల కోట్లతో బిడ్ వేయగా.. అహ్మదాబాద్ జట్టు కోసం సీవీసీ క్యాపిటల్ రూ.5 వేల కోట్లతో బిడ్ వేసింది. ఈ బిడ్డింగ్లో కొత్త ఫ్రాంచైజీల బేస్ ధరను రూ. 2 వేల కోట్లుగా ఐపీఎల్ నిర్ణయించిన సంగతి తెలిసిందే.