IPL 2023 : కొచ్చిలో జరుగుతున్న ఐపీఎల్ 2023 వేలంలో విదేశీ ఆటగాళ్లు భారీ ధరకు అమ్ముడుపోయారు. ముఖ్యంగా ఆల్రౌండర్లను దక్కించుకునేందుకు ఫ్రాంఛైజీలు పోటీపడ్డాయి. టీ 20 వరల్డ్ కప్లో ఆకట్టుకున్న ఇంగ్లండ్ ఆల్రౌండర్ సామ్ కరన్ రూ.18.50 కోట్ల భారీ ధరకు అమ్ముడుపోయాడు. ఈ యువ ఆల్రౌండర్ను పంజాబ్ కింగ్స్ జట్టు సొంతం చేసుకుంది. దాంతో, ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ధర పలికిన ఆటగాడిగా అతను గుర్తింపు సాధించాడు. ఆ తర్వాతి స్థానంలో ఆస్ట్రేలియా ఆల్రౌండర్ కామెరూన్ గ్రీన్ ఉన్నాడు. ఇతడిని రూ.17.50 కోట్లకు ముంబై ఇండియన్స్ దక్కించుకుంది. బెన్ స్టోక్స్ను రూ.16.25 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసింది. అత్యధిక ధర పలికిన ఈ ముగ్గురు ఆటగాళ్లు వేలం పాట మొదలైన అరగంటలోనే అమ్ముడు పోవడం విశేషం.
వెస్టిండీస్ వికెట్ కీపర్, బ్యాటర్ నికోలస్ పూరన్ను రూ.16 కోట్లకు లక్నో సూపర్ జెయింట్స్ సొంతం చేసుకుంది. పాకిస్థాన్ టూర్లో వరుస సెంచరీలతో రాణించిన ఇంగ్లండ్ ఆటగాడు హ్యారీ బ్రూక్ భారీ ధర పలికాడు. అతడిని రూ. 13.25 కోట్లకు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు సొంతం చేసుకుంది. ఐపీఎల్ వేలంలో సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీ ఒక ఆటగాడిని ఇంత ధరకు కొనగడం ఇదే మొదటి సారి. భారత ఆటగాడు మయాంక్ అగర్వాల్ను ఈ ఫ్రాంఛైజీ రూ.8.25 కోట్లకు కొన్నది. భారత ఆటగాళ్లలో అత్యధిక ధర దక్కించుకున్నఆటగాడిగా మయాంక్ నిలిచాడు. వెస్టిండీస్ ఆల్రౌండర్ జేసన్ హోల్డర్ రూ.7.25 కోట్లు పలికాడు. ఇతడిని రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసింది. న్యూజిలాండ్ క్రికెటర్ కేన్ విలియమ్సన్ కనీస ధరకే అమ్ముడుపోయాడు. డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటన్స్ అతడిని రూ.2 కోట్లకు దక్కించుకుంది.
1. సామ్ కరన్ – రూ.18.50 కోట్లు – పంజాబ్ కింగ్స్
2. కామెరూన్ గ్రీన్ – రూ.17.50 కోట్లు – ముంబై ఇండియన్స్
3. బెన్ స్టోక్స్ – రూ. 16.25 కోట్లు – చెన్నై సూపర్ కింగ్స్
4. నికోలస్ పూరన్ – రూ. 16 కోట్లు- లక్నో సూపర్ జెయింట్స్
5. హ్యారీ బ్రూక్ – రూ.13.25 కోట్లు – సన్ రైజర్స్ హైదరాబాద్
6. మయాంక్ అగర్వాల్ – రూ. 8.25 – సన్ రైజర్స్ హైదరాబాద్
7. శివం మావి – రూ.6 కోట్లు – గుజరాత్ టైటన్స్
8. జేసన్ హోల్డర్ – రూ. 5.75 కోట్లు – రాజస్థాన్ రాయల్స్
9. ముఖేష్ కుమార్ – రూ. 5.50 కోట్లు- ఢిల్లీ క్యాపిటల్స్
10. హెన్రిచ్ క్లాసెన్ – రూ. 5,25 కోట్లు – సన్ రైజర్స్ హైదరాబాద్