IPL 2023 : రెండు సీజన్ల తర్వత ఐపీఎల్ 2023 మళ్లీ స్వదేశంలో జరగనుంది. దాంతో ఐపీఎల్ పాలక మండలి వేలానికి సంబంధించిన పనులను పూర్తి చేసే పనిలో పడింది. డిసెంబర్ 23వ తేదీన కొచ్చిలో మధ్యాహ్నం 2ః30 గంటలకు వేలం పాట మొదలుకానుంది. దాంతో వేలంలో ఉన్న ఆటగాళ్ల తుది జాబితాను ఐపీఎల్ పాలక మండలి మంగళవారం విడుదల చేసింది. 405 మంది ప్లేయర్లు వేలంలో నిలిచారు. వీళ్లలో 273 మంది భారతీయులు, 132 విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. ఐపీఎల్ 2023 కోసం 991 మంది ఆటగాళ్లు పేర్లు నమోదుచేసుకున్నారు. అయితే, వీళ్లలో 391 మందిని 10 జట్లు షార్ట్ లిస్ట్ చేశాయి. ఆ తర్వాత 36 మందిని వేలం జాబితాలో చేర్చాలని ఫ్రాంఛైజీలు కోరాయి. దాంతో, 405 మంది ఆటగాళ్లతో తుది జాబితాను రూపొందించింది.
ఫైనల్ లిస్ట్లోని ప్లేయర్స్లో 119 మందికి అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన అనుభవం ఉంది. 282 మంది ఫస్ట్ క్లాస్ క్రికెట్ మాత్రమే ఆడారు. ప్రస్తుత వేలంలో 89 స్లాట్స్ మాత్రమే ఖాళీగా ఉన్నాయి. ఇందులో 30 స్లాట్స్ను విదేశీ ఆటగాళ్లకు కేటాయించారు. ఈ సీజన్ ఐపీఎల్ స్పాన్సర్షిప్ హక్కులను టాటా కంపెనీ సొంతం చేసుకుంది.
ఈసారి వేలంలో ఫ్రాంఛైజీలు రూ.206.5 కోట్లు ఖర్చు చేయనున్నాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు దగ్గర అత్యధికంగా రూ.42.25 కోట్లు ఉన్నాయి. కోల్కతా నైట్ రైడర్స్ రూ.7.05 కోట్లతో చివరి స్థానంలో ఉంది. 19 మంది విదేశీ ఆటగాళ్లకు రూ.2 కోట్ల కనీస ధరగా నిర్ణయించారు. బెన్స్టోక్స్, సామ్ కరన్, కేన్ విలియమ్సన్, క్రిస్ జోర్డాన్ వంటి ప్లేయర్స్ ఈ జాబితాలో ఉన్నారు. పోయిన సీజన్లో గుజరాత్ టైటన్స్ ట్రోఫీ విజేతగా నిలిచింది.