హైదరాబాద్: న్యూఢిల్లీ వేదికగా జరుగుతున్న 28వ ఆసియా జూనియర్ ట్రాక్ సైక్లింగ్ చాంపియన్షిప్లో తెలంగాణ యువ సైక్లిస్ట్ ఆశీర్వాద్ సక్సేనా కాంస్య పతకంతో ఆకట్టుకున్నాడు. శనివారం జరిగిన 4000 మీటర్ల విభాగంలో సక్సేనా సత్తాచాటాడు. ప్రత్యర్థులకు ఆది నుంచి దీటైన పోటీనిస్తూ ముందుకు సాగిన ఆశీర్వాద్.. ఆసియా జూనియర్ టోర్నీలో పతకం గెలిచిన తొలి తెలంగాణ సైక్లిస్టుగా నిలిచాడు. సరిగ్గా మూడేండ్ల క్రితం సైక్లింగ్ను కెరీర్గా ఎంచుకున్న ఈ షాలీబండ కుర్రాడు అంచలంచెలుగా ఎదిగాడు. బరిలోకి దిగిన ప్రతీ టోర్నీలో సత్తాచాటుతూ పతకాలు కొల్లగొడుతున్నాడు.