హైదరాబాద్: టీ20 వరల్డ్కప్లో టీమిండియా ప్రస్థానం సెమీస్తో ముగిసింది. నిజానికి ఈ టోర్నీలో సూపర్12 స్టేజ్లో ఇండియా అత్యధికంగా 8 పాయింట్లు సాధించింది. కోహ్లీ, సూర్య, పాండ్యా లాంటి బ్యాటర్లు మెరవడంతో కొన్ని మ్యాచుల్లో ఇండియా నెగ్గింది. కానీ బౌలర్లు ఇండియాను గెలిపించిన సందర్భాలు తక్కువే ఉన్నాయి. ఇక ఈ వరల్డ్కప్లోనూ భారత బౌలర్లు ఆశించిన రీతిలో ప్రభావం చూపలేకపోయారు. కీలకమైన సెమీస్లో మరీ చెతులెత్తేశారు.
జస్ప్రీత్ బుమ్రా లేకపోవడం పెద్ద లోటే. ఆసీస్ పిచ్లు స్పీడ్, బౌన్స్కు చాలా ఫేమస్. అలాంటి పేస్ పిచ్లపై బుమ్రా ఉంటే కొంత బాగుండేది. కానీ అతడు లేని లోటు సెమీస్లో స్పష్టంగా కనిపించింది. భువీ పేస్ బౌలింగ్ .. ఇంగ్లండ్ హిట్టర్లకు ఈజీగా మారిపోయింది. ఆరంభంలో బాల్ కొంత స్వింగ్ అయినా.. భువీ లైన్ అండ్ లెన్త్లో వేయకపోవడంతో ఇంగ్లండ్ ఓపెనర్లు దర్జాగా షాట్లు కొట్టేశారు. హర్షదీప్ను కూడా అవలీలగా ఆడేశారు బట్లర్, హేల్స్.
ఇటీవల ఇండియా ఎక్కువ శాతం మ్యాచ్లను బ్యాటర్ల ఆధారంగానే గెలిచింది. ఎవరో ఒక బ్యాటర్ భారీ స్కోర్ చేయడం జట్టుకు అనుకూలిస్తూ వచ్చింది. సూర్య లాంటి హిట్టర్ శరవేగంగా రన్స్ స్కోర్ చేస్తూ ఇండియాను ఆదుకున్నాడు. ఇక పాక్తో జరిగిన సూపర్12 మ్యాచ్లో కోహ్లీ మ్యాజిక్ ఇన్నింగ్స్ ఆడి ప్రత్యర్థిని స్టన్ చేశాడు. కానీ ఈ టోర్నీలో ఏ ఒక్క ఇండియన్ బౌలర్ కూడా తమ పంచ్ చూపించలేకపోయారు.
టీ20ల్లో రన్స్ ఇచ్చినా పర్వాలేదు, కానీ కీలక దశల్లో వికెట్లను తీయడం చాలా ముఖ్యం. అలాంటి సందర్భాలకు షమీ బెటర్ బౌలర్. కానీ సెమీస్లో అతను కూడా విఫలం కావడం ఇండియాకు పెద్ద జలక్ తగిలినట్లు అయ్యింది. సెమీస్ మ్యాచ్లో ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోవడం.. ఇండియా బలహీన బౌలింగ్ను బయటపెట్టింది. ఇటీవల స్పిన్నర్ అక్షర్ పటేల్ చాలా మెరుగ్గా రాణించాడు. కానీ ఈ టోర్నీలో అతను తన ట్యాలెంట్ను ప్రదర్శించలేకపోయాడు. స్పిన్నర్గా అశ్విన్ కూడా ఆశించినరీతిలో బౌలింగ్ చేయలేదు.
అడిలైడ్ పిచ్పై ఇంగ్లండ్ బౌలర్లు విక్టరీ సాధించారు. పవర్ప్లేలో ఇండియాను సమర్థవంతంగా కట్టడి చేశారు. భారీ షాట్ల ఆడకుండా ఇండియన్ బ్యాటర్లను అడ్డుకున్నారు. ఇంగ్లండ్ బౌలర్లను ఎదుర్కోవడంలో ఇండియన్ టాపార్డర్ ఇబ్బందిపడింది. ఇంగ్లండ్ లాంటి పేస్ అటాక్ లేకపోవడం ఇండియాకు నిరుత్సాహాన్ని మిగిల్చింది. దీంతో వరల్డ్కప్ ఆశలు సెమీస్తోనే అంతం అయ్యాయి.
టీ20 అంటేనే పవర్ హిట్టింగ్. బ్యాటర్లదే పైచేయిగా ఉంటుంది. కానీ కీలకదశల్లో బౌలర్లు రాణిస్తేనే విజయం సొంతం అవుతుంది. ఆ ట్యాలెంట్ లేని లోటు స్పష్టంగా కనిపించింది. ఈ మ్యాచ్లో భువీ 2 ఓవర్లలో 25, హర్షదీప్ 2 ఓవర్లలో 15, అక్షర్ 4 ఓవర్లలో 30, షమీ 3 ఓవర్లలో 39, అశ్విన్ 2 ఓవర్లలో 27, పాండ్యా 3 ఓవర్లలో 34 రన్స్ సమర్పించుకున్నారు. ఇంతకన్నా పేలవ బౌలింగ్ ప్రదర్శన ఉండదేమో !