బర్మింగ్హాం: కామన్వెల్త్ గేమ్స్లో (CWG) భారత పురుషుల హాకీ జట్టు ఫైనల్స్కు చేరింది. శనివారం దక్షిణాఫ్రికా జట్టుతో జరిగిన సెమీఫైనల్లో 3-2తో మన్ప్రీత్సింగ్ సేన విజయం సాధించింది. మొదటి సెషన్లో ఒక్క గోల్ కూడా చేయలేకపోయిన భారత్.. సెకండ్ క్వార్టర్లో రెండు పాయింట్లు సాధించింది. మ్యాచ్ 20వ నిమిషంలో భారత్ తరఫున అభిషేక్ ఖాతా తెరిచాడు. మరో 8 నిమిషాల్లోనే మన్దీప్ సింగ్ రెండో గోల్ చేశాడు. దీంతో ఇండియన్ టీం.. 2-0 లీడ్లోకి దూసుకెళ్లింది.
అయితే తర్వాత పుంజుకున్న దక్షిణాఫ్రికా జట్టు.. భారత డిఫెన్స్ను ఛేదించుకుంటూ రెండు గోల్స్ సాధించింది. దీంతో నాలుగో క్వార్టర్ సమయానికి ఇరు జట్ల స్కోర్ 2-2తో సమమవ్వడంతో ప్రేక్షకుల్లో ఉత్కంఠ నెలకొన్నది. అయితే జుగ్రాజ్ సింగ్ తన డ్రాగ్ఫ్లిక్తో మూడో గోల్ చేయడంతో గెలుపు ఖాయమైంది. మ్యాచ్ చివరివరకు సౌతాఫ్రికా ఆటగాళ్లను మరో గోల్ చేయకుండా అడ్డుకోవడంతో.. 3-2 తేడాతో భారత్ విజయం సాధించింది. దీంతో టీమ్ఇండియా ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఈ నెల 8న (సోమవారం) ఫైనల్లో భారత్.. ఆస్ట్రేలియా లేదా ఇంగ్లండ్ జట్లతో తలపడనుంది.