భారత వెటరన్ మిడిలార్డర్ బ్యాటర్ అజింక్య రహానే ఫామ్పై మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆస్ట్రేలియా సిరీస్లో ఎంసీజీ వేదికగా జరిగిన టెస్టులో సెంచరీతో ఆకట్టుకున్న రహానే.. అప్పటి నుంచి ఒక్క మంచి ఇన్నింగ్స్ కూడా ఆడలేదు. ఇదే విషయాన్ని మంజ్రేకర్ ఎత్తిచూపాడు.
ప్రస్తుతం జరుగుతున్న కేప్టౌన్ టెస్టులో కూడా రెండు ఇన్నింగ్సుల్లో కలిపి కేవలం పది పరుగులే చేశాడీ ముంబై బ్యాటర్. ఈ నేపథ్యంలో రహానే దేశవాళీ క్రికెట్లో ఆడి, తన ఫామ్ను తిరిగి పొందాలని మంజ్రేకర్ సూచించాడు. తన దృష్టిలో రహానే కన్నా, పుజారాకు మరో అవకాశం ఇవ్వొచ్చని అభిప్రాయపడ్డాడు.
గడిచిన మూడు, నాలుగేళ్లలో రహానే ఫామ్లోకి వస్తాడనే ఆశ తనకు ఏమాత్రం కలగలేదని మంజ్రేకర్ చెప్పాడు. ఫామ్ లేమితో బాధలు పడుతున్న రహానే 2021 సంవత్సరంలో 15 మ్యాచులు ఆడి, కేవలం 20.25 సగటుతో 547 పరుగులు మాత్రమే చేశాడు. వీటిలో అతని అత్యధిక స్కోరు 67 పరుగులు.
ఈ 15 మ్యాచుల్లో 11 సార్లే సింగిల్ డిజిట్ స్కోరుకే పెవిలియన్ చేరాడు. ఈ విషయాలను ప్రస్తావించిన మంజ్రేకర్.. ‘‘ఫస్ట్ క్లాస్ క్రికెటలోకి వెళ్లి అతను మళ్లీ ఫామ్లోకి వస్తాడని ఆశిస్తున్నా. రహానేకు మరో ఇన్నింగ్స్ అవకాశం నేనైతే ఇవ్వను. నన్నడిగితే రహానే కన్నా పుజారా కొంచెం బెటర్’’ అని పేర్కొన్నాడు.