భారత పేసర్లు నిప్పులు చెరుగుతున్నారు. వీరి ధాటికి సఫారీ బ్యాటర్లు బెంబేలెత్తుతున్నారు. ముఖ్యంగా వెటరన్ మహమ్మద్ షమీ సత్తా చాటుతున్నాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో సపారీల పట్టుబడుతున్నాడు. తొలి ఇన్నింగ్స్లో సఫారీలను భారత పేసర్లు ముప్పుతిప్పలు పెడుతున్నారు. తొలి ఓవర్లోనే సఫారీ కెప్టెన్ ఎల్గార్ను బుమ్రా అవుట్ చేయగా.. లంచ్ బ్రేక్ తర్వాత షమీ తన పేస్తో సౌతాఫ్రికా బ్యాటర్లను దడదడలాడిస్తున్నాడు.
8వ ఓవర్లో కీగన్ పీటర్సన్ను పెవిలియన్ చేర్చిన షమీ.. 12వ ఓవర్లో మరోసారి సత్తా చాటాడు. ఓపెనర్ ఎయిడెన్ మార్క్రమ్(13)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. షమీ చాలా తెలివిగా వేసిన బంతి.. ఇన్స్వింగ్ అయ్యేలా కనిపించడంతో మార్క్రమ్ పొరపడ్డాడు. అయితే అంతగా స్వింగ్ అవ్వని బంతి ఆఫ్ స్టంప్ అగ్రభాగాన్ని ముద్దాడటంతో పెవిలియన్ బాటపట్టాడు.
ఆ వెంటనే హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్.. వాన్ డర్ డస్సెన్ (3)ను బోల్తా కొట్టించాడు. అతను వేసిన బంతిని కవర్స్కు పంపడానికి ప్రయత్నించిన వాన్ డర్ డస్సెన్ సరిగా బంతిని అంచనా వేయలేకపోయాడు. దీంతో అవుట్ సైడ్ ఎడ్జ్ తీసుకున్న బంతి.. గల్లీ దిశగా వెళ్లింది. అక్కడ కాచుకొని ఉన్న రహానే.. తక్కువ ఎత్తులో వచ్చిన క్యాచ్ను చక్కగా అందుకున్నాడు. దీంతో 32 పరుగులకే సఫారీలు నాలుగు వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడ్డారు.