కివీస్తో రెండు టెస్టుల సిరీస్ ముగిసింది. దీంతో ఆటగాళ్లందరికీ బీసీసీఐ బ్రేక్ ఇచ్చింది. అందరూ తమ ఇళ్లకు వెళ్లి కుటుంబంతో గడిపే అవకాశం కల్పించింది. అయితే కనీసం వారం రోజులు కూడా కుటుంబంతో గడపకముందే.. మళ్లీ ఆటగాళ్లందర్నీ బయో బబుల్లోకి తీసుకొచ్చేయాలని ఆలోచిస్తోందట.
ఈ ఆదివారంలోపు సౌతాఫ్రికా వెళ్లే ఆటగాళ్లను ప్రకటించేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ సిరీస్కు ఎంపిక చేసిన ఆటగాళ్లందరూ కూడా ఆదివారం నాడే ముంబైలో బయో బబుల్లోకి వచ్చేయాలని బీసీసీఐ స్పష్టంగా చెప్పిందట. ఈ నెల 16న భారత జట్టు దక్షిణాఫ్రికాకు బయలుదేరుతుందని సమాచారం.
ఈ విమానం ఎక్కడానికి ముందే నాలుగు రోజుల పాటు ఆటగాళ్లను క్వారంటైన్లో ఉంచాలని బీసీసీఐ ప్లాన్. ఆ తర్వాత ముంబైలోని ఛత్రపతి శివాజీ ఎయిర్పోర్టు నుంచి జొహన్నెస్బర్గ్ బయలుదేరుతారని తెలుస్తోంది. కాగా, దక్షిణాఫ్రికాలో ప్రమాదకరమైన ఒమిక్రాన్ వేరియంట్ వెలుగు చూడటంతో అసలు భారత జట్టు ఈ పర్యటనకు వెళ్తుందా? అనే అనుమానాలు నెలకొన్నాయి.
అయితే ఇటీవల జరిగిన బీసీసీఐ వార్షిక సదస్సులో దీనిపై నిర్ణయం తీసుకున్న అధ్యక్షుడు గంగూలీ అండ్ కో.. సౌతాఫ్రికా టూర్కు వెళ్తున్నామని, అయితే టీ20లు మాత్రం వాయిదా వేస్తున్నామని ప్రకటించిన సంగతి తెలిసిందే.